తప్పుల కుప్ప యూపీఎస్సీ!

27 Jul, 2014 00:16 IST|Sakshi

అఖిల భారత సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఆ లక్ష్యాన్ని వదిలిపెట్టి అభ్యర్థుల్లోని ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానానికి పెడుతున్న పరీ క్షలపై ఇప్పుడు దేశవ్యాప్త నిరసన రాజుకుంది. హేతుబద్ధతకు వీడ్కో లు పలికి, సమన్యాయాన్ని అటకెక్కించి తరచు చేస్తున్న ఈ ‘సంస్క రణ’లన్నీ సివిల్ సర్వీసుల జోలికి ఎవరూ రాకుండా బెదరగొట్టేందుకే ఉపయోగపడుతున్నాయి. నిరుడు మెయిన్స్ పరీక్షా విధానంలో తీసు కొచ్చిన మార్పులన్నీ ఇంగ్లిష్ లేదా హిందీలో రాసేవారికి అనుకూ లంగా ఉన్నాయని అభ్యర్థులంతా గగ్గోలుపెట్టారు. ఇప్పుడు ప్రిలిమ్స్ లోని సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్(సీశాట్) పోతున్న పోకడలపై నిరసనలు ఊపందుకున్నాయి. భిన్నరంగాల్లో దేశాన్ని ముందుకు నడ పాల్సిన కీలక బాధ్యతలను చేపట్టగల సమర్థులెవరని చేయవలసిన అన్వేషణ కాస్తా... యూపీఎస్సీ అనుసరిస్తున్న ధోరణులవల్ల ఎవరికి ఇంగ్లిష్ బాగావచ్చునో, ఆ భాషను ముచ్చటగా మాట్లాడగలవారెవరో తెలుసుకునే పరీక్షగా మారిపోతున్నది. నిరుడు సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్షా విధానంలో సంస్కరణల పేరిట తీసుకొచ్చిన మార్పులపై నిరు ద్యోగ లోకం భగ్గుమంది. ప్రాంతీయ భాషలను చిన్నచూపు చూసే ఈ సంస్కరణలు కేవలం ఇంగ్లిష్ లేదా హిందీలో రాసేవారికి మాత్రమే అనుకూలంగా ఉన్నాయని ఎందరెందరో నిరసించారు. డిగ్రీ వరకూ ప్రాంతీయ మాధ్యమంలో చదువుకున్నవారు మాత్రమే పరీక్షను ఆ భాషలో రాయవచ్చని కొత్త నిబంధన విధించింది. అంతేకాదు...ఆ భాషలో రాసే అభ్యర్థులు కనీసం పాతికమంది ఉంటేనే అలా రాయడా నికి అనుమతిస్తామని మెలికపెట్టింది. తగిన సంఖ్యలో అభ్యర్థులు లేని పక్షంలో పరీక్షను హిందీ లేదా ఇంగ్లిష్‌లో రాయాలన్నది. పైగా డిగ్రీలో తమ ప్రాంతీయ భాషను ఆప్షనల్‌గా తీసుకున్నవారు మాత్రమే మెయి న్స్‌లోనూ దాన్ని ఆప్షనల్‌గా తీసుకోవడానికి అర్హులని మరో నిబంధన పెట్టింది. తీవ్ర నిరసనల తర్వాత ఈ విషయంలో వెనక్కి తగ్గినా అభ్య ర్థులు పడుతున్న అసలు బాధలు వేరే ఉన్నాయి. పరీక్షను ప్రాంతీయ భాషలో రాయొచ్చంటున్నారుగానీ ప్రశ్నపత్రాన్ని మాత్రం ఇంగ్లిష్ లేదా హిందీలో ఇస్తున్నారు. ఇక ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానంపై పెడుతున్న పరీక్ష అత్యంత కఠినంగా ఉంటున్నదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

మెయిన్స్ పరీక్ష స్థితి ఇలావుంటే ఇక ప్రిలిమ్స్ స్థాయిలోని సీశాట్ తోనూ, అందులోని పేపర్-2తోనూ అభ్యర్థులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. అందులో ఇంగ్లిష్, గణిత శాస్త్రాల పరిజ్ఞానాన్ని మా త్రమే పరీక్షించడంద్వారా గ్రామీణ నేపథ్యంగలవారికీ, తెలుగు మాధ్య మంగా ఉన్నవారికీ తీరని అన్యాయం చేస్తున్నారు. సీశాట్ ప్రవేశ పెట్టాక తెలుగు మాధ్యమంగా ఉన్నవారిలో ఉత్తీర్ణతా శాతం క్రమేపీ తగ్గడమే ఇందుకు సాక్ష్యం. అయితే, ఇదే పరీక్ష హిందీ మాధ్యమంగా గలవారికి కూడా తలనొప్పిగా మారడంతో ఇప్పుడు దీనిపై ఉద్యమం దేశవ్యాప్తమయింది. వాస్తవానికి రెండేళ్లక్రితం సీశాట్‌పై గొడవ రాజు కున్నప్పుడు అప్పటి యూపీఏ సర్కారు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక మరికొన్నిరోజుల్లో రాబోతున్నది. ఈలోగానే యూపీఎస్సీ పరీక్షల నిర్వహణకు తయారైంది. అది స్వ యంప్రతిపత్తిగల సంస్థే కావొచ్చుగానీ చుట్టూ జరుగుతున్నదేమిటన్న స్పృహ ఉండాలి. మన దేశం భిన్న భాషలు, సంస్కృతులు గల దేశం. దేశ పాలనా నిర్వహణలో ఈ వైవిధ్యత ప్రతిఫలించాలంటే అన్ని ప్రాం తాలకూ, భాషలకూ, సంస్కృతీ నేపథ్యంగలవారికీ ఆ నిర్వహణలో చోటివ్వాలి. అప్పుడు మాత్రమే ఈ దేశ ప్రగతిలో తమకు కూడా భాగ స్వామ్యం ఉన్నదన్న సంతృప్తి అందరిలోనూ కలుగుతుంది. దేశ సమై క్యతకూ, సమగ్రతకూ అలాంటి భావన దోహదపడుతుంది. గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి అన్యాయం కలిగే రీతిలో, కేవలం నగరాల్లోని ఖరీదైన కార్పొరేట్ విద్యాలయాల్లో చదువుకున్నవారికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా మొత్తం ప్రక్రియ సాగితే అది ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో యూపీఎస్సీకి అర్ధంకావడంలేదు.

సివిల్ సర్వీసులకు ఎంపికయ్యేవారిలో రాను రాను ఇంగ్లిష్ ప్రావీ ణ్యం అడుగంటుతున్నదని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ‘కాలం చెల్లిన విధానాలకు’ స్వస్తిపలకాలని నిర్ణయించామని యూపీఎస్సీ చెబుతున్నది సబబు కానేకాదు. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం తగినంతగా ఉండాలని ఆశించడంలో తప్పులేదుగానీ అది మాత్రమే అభ్యర్థి జయా పజయాలను నిర్ణయించే స్థితి కల్పించడం అన్యాయం. వాస్తవానికి అలాంటివారంతా మౌలికంగా పనిచేయాల్సింది ఈ దేశంలోనే, వ్యవ హరించాల్సిందీ ఈ దేశ ప్రజలతోనే. అలాంటపుడు వారి ఇంగ్లిష్ పరి జ్ఞానంకన్నా... సమస్యలను గుర్తించడంలో, వాటికి పరిష్కారాలను వెదకడంలో, విస్తృత ప్రజానీకానికి మేలు చేకూర్చే అంశాలను సృజనా త్మకంగా ఆవిష్కరించడంలో వారికి ఉండే సమర్ధతను పరీక్షించాలి. వారిలో సమయస్ఫూర్తి, చొరవ, హేతుబద్ధత, అంకితభావం, దృఢ సంకల్పం, నైతికవర్తన వంటివి ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయ గలగాలి. కానీ, యూపీఎస్సీ పెడుతున్న పరీక్షలన్నీ వేరే రకంగా ఉంటున్నాయి. అయితే హిందీకి లేదా ఇంగ్లిష్‌కు పెద్దపీట వేయడం, గణితాన్ని నెత్తికెత్తుకోవడంవంటివి చేస్తూ తరచు అభ్యర్థులకు తల నొప్పి కలిగిస్తున్నది. పరీక్షకొచ్చినవారిని గందరగోళపరచడమే లక్ష్యమ న్నట్టు వ్యవహరిస్తున్నది. ఇన్ని దశాబ్దాల అనుభవంతో సివిల్ సర్వీసు లకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మరింత సమర్ధవంతంగా నిర్వ హించడానికి బదులు దాన్ని సంక్లిష్టంగా మారుస్తున్నది. యూపీఎస్సీకి తగిన సలహాలిచ్చి దీన్ని సరిదిద్దవలసిన అవసరం ఉన్నదని పాలకులు ఇప్పటికైనా గుర్తించడం అవసరం.
 

మరిన్ని వార్తలు