నిజాయితీ నిలుస్తుంది, గెలుస్తుంది

2 Sep, 2018 00:58 IST|Sakshi

త్రికాలమ్‌

ఈ దేశానికి ఇంతవరకూ14 మంది ప్రధానులుగా పని చేశారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు 16 మంది ముఖ్యమం త్రులు. నవభారత నిర్మాత జవహర్‌లాల్‌ నెహ్రూ కంటే ఆయన తనయ ఇందిరాగాంధీని బడుగుజనం ఆరాధించ డానికి కారణం ఏమిటి? నందమూరి తారకరామారావు సినీ నటుడుగా సుప్రసిద్ధుడు. తెలుగుదేశం పార్టీని స్థాపిం చిన తొమ్మిది మాసాలకే ముందస్తు ఎన్నికలలో  కాంగ్రెస్‌ని చిత్తుగా ఓడించి చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమిని జయప్రదంగా నిర్మించారు. అసాధారణమైన నాయకుడు కనుక ఎన్టీఆర్‌ని ఇప్పటికీ అభిమానిస్తున్నవారు అనేకమంది ఉన్నారు. అదే విధంగా  వైఎస్‌ రాజశేఖరరెడ్డితో ఆవేశపూరితమైన అనుబంధం కలిగి నవారు రెండు తెలుగు రాష్ట్రాలలో లెక్కకు మించి ఉంటారు. ఎందుకని?

ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని అర్థం చేసుకోవా లన్న అభిలాషతో రూపొందించిన ‘రచ్చబండ’ కార్యక్ర మాన్ని చిత్తూరు జిల్లాలో ప్రారంభించేందుకు వైఎస్‌ హెలి కాప్టర్‌లో బయలుదేరారు. అకస్మాత్తుగా వాతావరణం క్షీణించింది. హెలికాప్టర్‌ గల్లంతైనట్టు సమాచారం అంద డంతో పోలీసులూ, అధికార యంత్రాంగంతో పాటు మీడియా సంస్థలకు చెందిన విలేఖరులు కూడా రంగంలో దిగారు. సుదీర్ఘ అన్వేషణ అనంతరంS నల్లమల అడవిలో పావురాల గుట్టపైన హెలికాప్టర్‌ కూలిపోయినట్టూ, వైఎస్‌ సహా ఐదుగురు ప్రయాణికులూ దుర్మరణం పాలైనట్టూ విషాదవార్త అశనిపాతంలాగా తెలుగు ప్రజల హృదయా లను తాకింది. ఈ ఘోరం జరిగి తొమ్మిదేళ్ళు గడిచినా వైఎస్‌ ప్రస్తావన వస్తే గుండెచెదిరి కన్నీరుమున్నీరయ్యేవారు ఇప్పటికీ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్య క్రమం జరిపించాలని సంకల్పించిన అనుపల్లి గ్రామానికి వైఎస్‌ వర్థంతి సందర్భంగా సాక్షి టీవీ చానల్‌ సిబ్బంది వెళ్ళారు. నాడు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనవలసిన వారిని ఇప్పుడు సమావేశపరచి ఆ రోజు వైఎస్‌ రాకకోసం ఎట్లా ఎదురు చూశారో,  ఏయే అంశాలు ఆయన దృష్టికి తేవాలని అనుకున్నారో, మరణవార్త విని ఎట్లా దిగ్భ్రాంతికి గురైనారో చెప్పవలసిందిగా కోరారు. వారిలో కంటతడి పెట్టనివారు లేరు. ఒక ఇందిరాగాంధీకీ, ఒక వైఎస్‌కీ విశేష మైన ప్రజాదరణ ఎందుకు ఉన్నది? వారు మరణించిన తీరు వల్లనా? బతికుండగా వారు నడిచిన బాట వల్లనా? పేదల జీవితాలలో వెలుగు నింపాలనే ఆకాంక్షతో సాహసో పేతమైన నిర్ణయాలు తీసుకున్నవారినీ, వారిలో ఆత్మవి శ్వాసం పెంచినవారినీ, వారి సంక్షేమంకోసం నిబద్ధతో కృషి చేసేవారినీ ప్రజలు విస్మరించరు. నిత్యం స్మరిస్తారు.

ప్రతి రాజకీయ నాయకుడూ ఒక ప్రత్యేక వాతావర ణంలో పనిచేస్తాడు. అప్పటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు రాజకీయవాది నిర్ణయాలపైన ప్రభావం వేస్తాయి. ప్రతి ప్రధానమంత్రికీ, ముఖ్యమంత్రికీ కొన్ని పరి మితులు ఉంటాయి. అన్ని అవరోధాలనూ అధిగమించి పేదలకు ఉపకారం చేయడానికి ప్రయత్నించేవారే ప్రజా నాయకులుగా చరిత్రలో నిలిచిపోతారు. ఒక కుటుంబం లోని ప్రతి వ్యక్తికీ ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సాయం అందాలనే లక్ష్యంలో వైఎస్‌ సంక్షేమ కార్యక్రమాలను రూపొందించారు. నిరుపేదకు సైతం మెరుగైన వైద్య, విద్య సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ‘ఆరోగ్యశ్రీ’ పథకా నికీ, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల ఫీజు చెల్లించే (ఫీ రీయెంబర్స్‌మెంట్‌) బాధ్యతను ప్రభుత్వం స్వీకరించే పథకానికీ శ్రీకారం చుట్టారు. ఒక వైపు జలయజ్ఞం వంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూనే, వ్యవసాయ ఉత్ప త్తులకు కేంద్రం ప్రకటించే మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం మరికొంత సొమ్మును జోడించి రైతులను ఆదుకునే ప్రయ త్నం చేశారు. సకల సంక్షేమ కార్యక్రమాలూ ప్రాంతాలకూ, రాజకీయాలకూ, మతాలకూ, కులాలకూ అతీతంగా ప్రజ లందరికీ లబ్ధి కలిగించాలనే దీక్షతో పని చేశారు. గ్యాసు బండకు సబ్సిడీ చెల్లించడంలో ఉద్దేశం కూడా దిగువ మధ్యతరగతి ప్రజలను వీలైనంత ఆదుకోవాలనే తాప త్రయంతోనే. ఆయన చిత్తశుద్ధిని ప్రజలు విశ్వసించారు. దళితులకూ, ఆదివాసీలకూ ఇందిరాగాంధీ ఆత్మవిశ్వాసం ఏ విధంగా కలిగించారో, వైఎస్‌ కూడా ముస్లింలలో అదే విధంగా ఆత్మవిశ్వాసం ప్రోదిచేశారు. దళితులు, ఆదివాసీల సంక్షేమానికి ఇందిరలో ఎంత దృఢమైన సంకల్పం ఉండేదో, ఆమె ఎంత పట్టుదలగా పని చేశారో, ముస్లింల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు వైఎస్‌ అంతే అంకితభావంతో కృషి చేశారు. తమ సంక్షేమం కోసం ఎవరు నిజాయితీగా పని చేస్తున్నారో, ఎవరు మాటల గారడీతో కాలక్షేపం చేస్తున్నారో బడుగువర్గాలకు తెలుసు.

పట్టువీడని విక్రమార్కుడు
ఉదాహరణకు ముస్లిం యువతీయువకులకు విద్యాసంస్థ లలో, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడానికి వైఎస్‌ చేసిన కృషిని గమనిస్తే ఆయనకు మైనారిటీల హృదయంలో ఎందుకు శాశ్వత స్థానం దక్కిందో అర్థం చేసుకోవచ్చు. 2004 ఎన్నికల ప్రణాళికలో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్, మూడు శాతం ఇస్తామని టీడీపీ వాగ్దానం చేశాయి. ఎన్నికలలో విజయం సాధించి వైఎస్‌ మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మూడు మాసాలైనా తిరగకుండానే ముస్లిం యువతీయువ కులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జూలై 12న జీవో నంబర్‌ 33 జారీ చేశారు. రిజర్వేషన్లు వెంటనే అమలులోకి వస్తాయని ప్రకటించారు. సామాజికంగా, ఆర్థికంగా బాగా వెనుకబడిన ముస్లింలకు విద్యాసంస్థలలో, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉండాలనే ప్రతిపాదన 1971 నుంచి ఉన్నది. దానికి కార్యరూపం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌. ఈ జీవోను తయారు చేసే ముందు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పీఎస్‌ కృష్ణన్‌ని సంప్రదించారు. మండల్‌ కమిషన్‌ నివేదిక అమలు విషయంలో అప్పటి ప్రధాని వీపీ సింగ్‌కు సల హాలు ఇచ్చిన కృష్ణన్‌ ముస్లింల కోటా విషయంలో ఆం్ర«దప్రదేశ్‌ ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించారు. అయితే, ఈ జీవో మైనారిటీల కమిషన్‌ సిఫార్సుల ఆధా రంగా జారీ చేశారు.

1991 జనాభా లెక్కల ప్రకారం అవి భక్త ఆంధ్రప్రదేశ్‌లో నివసించే 64 లక్షల మంది ముస్లింలలో (మొత్తం జనాభాలో 8.5 శాతం) అక్షరాస్యులు 18 శాతం మాత్రమే. ముస్లిం మహిళలలో అక్షరాస్యుల శాతం కేవలం నాలుగు. ముస్లింలలో 65 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. దుర్భర దారిద్య్రంలో, నిరక్ష రాస్యతలో మగ్గుతున్న ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించ డాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. ఇది రాజ్యాంగబద్ధం కాదని బీజేపీ వాదించింది. మత ప్రాతిపదికపైన రిజ ర్వేషన్లను రాజ్యాంగం అనుమతించని మాట వాస్తవమే. బీసీ కమిషన్‌ సిఫార్సులు కాకుండా మైనారిటీ కమిషన్‌ నివేదికపైన వైఎస్‌ ప్రభుత్వం ఎందుకు ఆధారపడింది? 1994లో కాంగ్రెస్‌ ప్రభుత్వం నియమించిన పుట్టస్వామి బీసీ కమిషన్‌ చాలా విడతల గడువు పెంచినా ఏ నివేదికా సమర్పించకుండానే 2003లో పదవీకాలం ముగించింది. 1995 నుంచి ముఖ్యమంత్రిగా ఉండిన చంద్రబాబు ఆ కమిషన్‌ నుంచి నివేదిక రాబట్టే ప్రయత్నం చేయలేదు. వైఎస్‌ అభిలషించినట్టు ముస్లింలకు ఐదు శాతం రిజర్వే షన్లు మంజూరు చేసినట్లయితే మొత్తం రిజర్వేషన్ల శాతం 51కి పెరుగుతుంది. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు నిర్ణయం ఉన్నది. రాజ్యాంగబద్ధం కాదనే కారణంపైనే జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి నాయకత్వంలోని ఐదు గురు న్యాయమూర్తుల హైకోర్టు ధర్మాసనం 33వ నంబరు జీవోను కొట్టివేసింది. బీసీ కమిషన్‌ సిఫార్సులు పాటిం చాలని చెబుతూ ఒక బీసీ కమిషన్‌ను వెంటనే నియమిం చవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, ఆరు మాసాలలో నివేదిక సమర్పించాలని ఏర్పాటు కాబోయే బీసీ కమిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కోరింది. రిజర్వేషన్ల అమలును నిలిపి వేయనవసరం లేదనీ, హైకోర్టు నిర్ణయంపైన  సుప్రీంకో ర్టుకు  అప్పీలు చేసుకోవచ్చుననీ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వా నికి వెసులుబాటు కల్పించింది.

మరో బీసీ కమిషన్‌
కొన్ని వారాలలోనే జస్టిస్‌ దాల్వ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన బీసీ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిషన్‌ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు జరగాలంటూ సుగ్రీ వాజ్ఞ (ఆర్డినెన్స్‌) జారీ చేసింది. ఆ తర్వాత సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకోసం రిజర్వేషన్లు కల్పిం చాలని కోరే బిల్లును  2007లో శాసనసభ ఆమోదించి చట్టం చేసింది. ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించేవారు ఆర్డినెన్స్‌పైనా, చట్టంపైనా హైకోర్టులో పిటిషన్లు వేశారు. బీసీ కమిషన్‌ అనుసరించిన విధానం లోపభూయిష్టమని నిర్ణయిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బిలాల్‌ న జ్కీ నాయకత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 5–2 ఆధిక్యంతో ఆర్డినెన్స్‌ను కొట్టివేసింది. చట్టం రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. ఇన్ని ఎదురు దెబ్బలు తగిలినా ముస్లింల రిజర్వేషన్ల విషయంలో వెనకంజ వేసే ప్రసక్తి లేదనీ, న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకుంటా మనీ వైఎస్‌ ప్రకటిస్తూ వచ్చారు.

పట్టువిడవకుండా న్యాయ పోరాటం కొనసాగిస్తూనే నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ వచ్చారు. ఇతర వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థుల మాదిరే ముస్లిం విద్యార్థులకు సైతం ప్రభుత్వం ఫీజు చెల్లిస్తూ వచ్చింది. ఈ కారణంగా పది లక్షల మందికిపైగా ముస్లిం యువతీయువకులు ఉన్నత విద్య అభ్యసించగలిగారని, వేలమంది ఉద్యోగాలు పొందగలిగా రనీ  వైఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ఇటీవల అన్నారు. వైఎస్‌ దుర్మరణం అనం తరం  సుప్రీంకోర్టు 2010 మార్చి 25న నాలుగు శాతం రిజర్వేషన్లను అనుమతిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. కాపు రిజర్వేషన్ల విషయంలో టీడీపీ ప్రభుత్వం చేసినట్టు అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత దాన్ని కేంద్రానికి పంపి చేతులు దులుపుకోలేదు వైఎస్‌ సర్కార్‌.  రిజర్వేషన్లు మాత్రమే కాకుండా మైనారిటీస్‌ కార్పొరేషన్‌ ద్వారా చిన్న వృత్తి పనులకు సహాయం చేయడం, అన్యాక్రాంతమైన వక్ఫ్‌ భూములను తిరిగి రాబ ట్టుకునేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం, మసీ దులకు మరమ్మతులు చేయించడం, షాదీ ఖానాలు నిర్మిం చడం వంటి సంక్షేమ కార్యక్రమాలు వైఎస్‌ ప్రభుత్వం అమలు చేసింది.

నారా హమారా, పరాయా?
ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలలో ముఖ్యమైన వాటిని నాలుగున్నర సంవత్సరాలు విస్మరించి ఎన్నికలు సమీపించిన తరుణంలో ‘నారా హమారా’ అంటూ బహిరంగ సభలు పెడితే ముస్లింలు విశ్వసిస్తారనుకోవడం పొరపాటు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం లేని మంత్రి వర్గం లేదు. ప్రస్తుత చంద్రబాబు మంత్రివర్గంలో ఒక్క ముస్లిం లేడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా ఆ పార్టీ పెద్దలను మెప్పించడానికి అసెంబ్లీ ఎన్నికలలో ఒకే ఒక్క సీటు ముస్లింకి ఇచ్చారు. అది కూడా చిత్తూరు జిల్లా పీలేరులో మిత్రుడు కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు, జైసమై క్యాంధ్ర పార్టీ అభ్యర్థి కిశోర్‌కుమార్‌రెడ్డి విజయానికి దోహదం చేయడం కోసం ఒక బలహీనమైన ముస్లిం అభ్యర్థి ఇక్బాల్‌ అహ్మద్‌ని నిలబెట్టారు. అక్కడ వైఎస్‌ ఆర్‌సీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి మంచి మెజా రిటీతో గెలుపొందారు. ఇక్బాల్‌ మూడో స్థానంలో నిలి చారు. నంద్యాల ఉప ఎన్నికలలో గెలుపుకోసం అనివార్య మైన పరిస్థితులలో ఫారూక్‌ని శాసనమండలి అధ్యక్షుడిగా నియమించారు. అప్పటికే బీజీపీతో పొత్తు తెగతెంపులు చేసుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకొని ఉంటారు. ఇప్పుడు ముస్లిం మంత్రిని నియమిస్తానని చెబుతున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ముస్లింల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుకరించలేకపోయింది. ముస్లిం బాలలకోసం సుమారు రెండు వందల గురుకుల పాఠశాలలు నెలకొల్పి నాణ్యమైన విద్య అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం దళి తులకూ, ఆదివాసీలకూ అందే సంక్షేమ కార్యక్రమాలను ముస్లింలకు వర్తింపజేస్తున్నది. ముస్లింల సంక్షేమం విష యంలో వైఎస్‌ స్ఫూర్తి తెలంగాణలో కొనసాగుతున్నది కానీ ఆంధ్రప్రదేశ్‌లో కొండెక్కింది. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే మొన్న గుంటూరు సభలో ప్రశ్నించడానికి ప్రయత్నించిన నంద్యాల యువకుల పైన ఆగ్రహం ప్రదర్శించారు. కేసులు బనాయించారు. ఇప్పుడు ఎన్ని కబుర్లు ఎంత గట్టిగా చెప్పినా ప్రజలు విశ్వసించే స్థితిలో లేరు. వారికి వాస్తవాలు తెలుసు.


కె. రామచంద్రమూర్తి
 

మరిన్ని వార్తలు