అందుబాటులోకి 86,695 సీట్లు

30 Oct, 2014 02:05 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణలో 86,695 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 174 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టేందుకు సుప్రీంకోర్టు బుధవారం ఓకే చెప్పిన నేపథ్యంలో ఈనెల 31న కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేయాలని, నవంబర్ 5, 6 తేదీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. ప్రభుత్వ ఆమోదం తీసుకొని కౌన్సెలింగ్‌కు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. నవంబర్ 10, 11ల్లో తుది సీట్ల కేటాయింపులు చేసి, మిగులు సీట్లను స్పాట్ అడ్మిషన్లలో భర్తీ చేస్తారు. మేనేజ్‌మెంట్ కోటా సీట్లను నవంబరు 14లోగా భర్తీ చేసేలా షెడ్యూల్ జారీ చేయవచ్చు. ఈ ప్రవేశాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో చేపడతారా, ఏపీ మండలి నేతృత్వంలోనా అన్నదానిపై తీర్పు కాపీ అందాకే స్పష్టత రానుంది. కొత్తగా అందుబాటులోకొచ్చే సీట్లలో కన్వీనర్ కోటాలో 60,687, మేనేజ్‌మెంట్ కోటాలో 26,008 సీట్లు ఉన్నాయి.
 
 తెలంగాణ విద్యార్థులు తక్కువే..
 
 ప్రస్తుత కౌన్సెలింగ్‌లో సీట్లు భాగానే అందుబాటులో ఉన్నా.. తెలంగాణకు చెందిన అర్హులైన అభ్యర్థులు చాలా తక్కువగా ఉన్నారు. తెలంగాణ మొత్తమ్మీద ఎంసెట్ రాసిన వారిలో అర్హత సాధించిన వారు 88,937 మంది. ఇందులో ఇప్పటికే 52,839 మంది విద్యార్థులు వేర్వేరు కాలేజీల్లో చేరిపోయారు. మొత్తమ్మీద తెలంగాణకు విద్యార్థుల్లో మరో 26,098 మంది మాత్రమే అర్హులున్నారు. వారిలో ఎందరు కాలేజీల్లో చేరతారో తేలాలి. ఏపీ విద్యార్థుల్లో మంచి ర్యాంకు ఉన్న వారు 15 శాతం ఓపెన్‌కోటాలో వచ్చే అవకాశం ఉండగా, మరికొంతమంది మేనేజ్‌మెంట్ కోటాలో చేరే అవకాశం ఉంటుంది.
 
 తీర్పు కాపీ అందగానే చర్యలు: టీ మండలి చైర్మన్ పాపిరెడ్డి
 
 సుప్రీం ఆదేశాల ప్రకారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో తదుపరి చర్యలు చేపడతాం. కోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం. కౌన్సెలింగ్ షెడ్యూలును జారీ చేసి ప్రవేశాలను చేపడతాం. ప్రభుత్వం ఓకే అనగానే 31న నోటిఫికేషన్ జారీ చేస్తాం.
 

>
మరిన్ని వార్తలు