సివిల్స్ మెయిన్స్ జీఎస్- 4 కేస్ స్టడీల విశ్లేషణ

29 Aug, 2013 12:02 IST|Sakshi

 డా॥బి.జె.బి. కృపాదానం
 సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ
 ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్
 
 
 సివిల్స్ మెయిన్స్ జీఎస్-4కు సంబంధించి యూపీఎస్సీ ఇటీవల నమూనా ప్రశ్నలు (Sample Questions) విడుదల చేసింది. వీటిని బట్టి ప్రశ్నపత్రం ఎలా ఉంటుందన్న దానిపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవచ్చు. ఆరు నమూనా ప్రశ్నలను విడుదల చేయగా, వాటిలో మూడు కేస్ స్టడీకి సంబంధించినవే. దీన్నిబట్టి రాబోయే ప్రశ్నపత్రంలో కేస్ స్టడీ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఉండే అవకాశముందని అర్థం చేసుకోవచ్చు.
 
 కేస్ స్టడీ-1
 నీవు ఏడాది కాలంగా నీ బృందంతో కలిసి పనిచేస్తున్నావు. నీ కింద పనిచేస్తున్న ’A’.. సమర్థవంతమైన, కష్టపడి పనిచేసే స్వభావమున్న వ్యక్తి. బాధ్యతతో పనులను పూర్తిచేసే ఉద్యోగి. అయితే అతను తన కింద పనిచేసే ’X’ అనే మహిళను ఉద్దేశించి అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నట్లు నీకు తెలిసింది. తనపట్ల ’A’ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, డిన్నర్‌కు బయటకు రావాలని కూడా అడిగినట్లు ఆమె నీతో చెప్పింది. అందువల్ల అతనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ లిఖితపూర్వక ఫిర్యాదు కూడా ఇవ్వాలనుకుంది. అప్పుడు నీవు ఏం చేస్తావు? ఎందుకు?.. ఇది నీ నాయకత్వ లక్షణాలను, సమస్య పరిష్కారానికి ఎలాంటి మార్గాలు అనుసరిస్తావో తెలుసుకునేందుకు ఇచ్చిన ప్రశ్న. ఈ కేస్ స్టడీ.. ఉద్యోగం చేసేచోట నైతికత, తోటి ఉద్యోగుల మధ్య సంబంధాల్లో సంఘర్షణను ప్రతిబింబిస్తోంది.
 
 అభ్యర్థి సమాధానంలో ఉండాల్సిన అంశాలు:
 ’A’ విధి నిర్వహణకు సంబంధించి సమర్థుడైనప్పటికీ కొన్ని సార్లు తప్పులు చేసే అవకాశం లేకపోలేదు. నిప్పు లేనిదే పొగ రాదు కదా! అతను తన కింద పనిచేస్తున్న మహిళా ఉద్యోగిపట్ల నిజంగా అసభ్యంగా ప్రవర్తించి ఉండొచ్చు. లేదా ఆమె అసూయతో ఆరోపణలు చేసుండొచ్చు. మొదటే మహిళా ఉద్యోగి మాటలు నమ్మి, నిజానిజాలను నిగ్గుతేల్చకుండా ‘A’పై చర్యలు తీసుకుంటే.. తర్వాత అది అవాస్తవమని తేలితే సంస్థ ఓ సమర్థవంతమైన ఉద్యోగిని కోల్పోయినట్లవుతుంది. అందుకే ఈ కింది మార్గాలను అనుసరిస్తా.
 
 1.ఇద్దరితోనూ మాట్లాడటం:
 తొలుత ‘A’ను పిలిచి మాట్లాడతాను. ‘ఈ మధ్య నీ ప్రవర్తనలో తేడా కనిపిస్తోంది. కొందరి నుంచి ఫిర్యాదులు కూడా అందాయి. ప్రవర్తనను కొంచెం మార్చుకో. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాలి’ అని సుతారంగా హెచ్చరిస్తాను. అట్నుంచి వచ్చే సమాధానాన్ని వింటాను. అదే విధంగా మహిళా ఉద్యోగితోనూ మాట్లాడతాను. ‘అసూయతోనే నీపై ఉద్యోగిపై ఆరోపణలు చేస్తున్నావా? లేదంటే నిజంగానే అతను అసభ్యంగా ప్రవర్తించాడా? అని ప్రశ్నిస్తే అట్నుంచి వచ్చే సమాధానా న్ని బట్టి నిజానిజాలపై కొంత అవగాహనకు రావొచ్చు.
 
 2.చరిత్రను తవ్వటం (Dig Past):
 రెండో దశలో ఇద్దరు ఉద్యోగుల చరిత్రను తెలుసుకుంటాను. వారు గతంలో పనిచేసిన సంస్థలు, తోటి ఉద్యోగులతో సంబంధాలు ఎలా ఉండేవి? పనితీరు ఎలా ఉండేది? వారిపై ఫిర్యాదులేవైనా వచ్చాయా? వంటి విషయాలపై ఆరా తీస్తాను. వీలైనంత ఎక్కువ మంది నుంచి సమాచారం తీసుకుంటాను. వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాను. ఒకవేళ ‘A’ తప్పు చేసినట్లు తేలితే అతనిని పిలిపించి ‘నీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో’ చెప్పమంటాను.
 
 మహిళా ఉద్యోగికి బేషరతుగా క్షమాపణ చెప్పమంటాను. ఇలాంటి తప్పులు మరోసారి చేస్తే ఉద్యోగం నుంచి తొలగించడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించి, అతని నుంచి లిఖిత పూర్వక  హామీ పత్రాన్ని తీసుకుంటాను. అతని ప్రవర్తనా తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తాను. ఒకవేళ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే ఆమెకు కూడా పై చర్యలను వర్తింపజేస్తాను.
 
 
 కేస్ స్టడీ 2
 నీకు ’X’ చిన్నప్పటి నుంచి మంచి మిత్రుడు. ఇద్దరూ కష్టనష్టాలను, సుఖసంతోషాలను పరస్పరం పంచుకునేవారు. ఒకరిపై మరొకరికి మంచి విశ్వాసం ఉంది. ఇద్దరూ ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు. అయితే మీ స్నేహితుడు ’X’ పరీక్షలో చూసిరాతకు పాల్పడుతుండటం నీవు చూశావు. అప్పుడు ఏం చేస్తావు?
 
 ఇది అభ్యర్థి వ్యక్తిగత నిజాయితీ (Personal Integrity)ని అంచనా వేసేందుకు ఉపయోగపడే ప్రశ్న. ఓ వ్యక్తి నియమాల్ని ఉల్లంఘిస్తున్న సందర్భంలో అభ్యర్థి ఎలా స్పందిస్తాడన్న దాన్ని పరీక్షించేందుకు పై కేస్ స్టడీ ఆధారిత ప్రశ్న ఉపయోగపడుతుంది. కొందరు తమ స్నేహితులు తప్పుచేస్తే ఒక విధంగా, వేరొకరు తప్పుచేస్తే మరోలా స్పందిస్తుంటారు. ఇలాంటి ద్వంద్వ వైఖరి ఉన్న వ్యక్తుల వల్ల సమాజానికి చెడు జరుగుతుంది. అందువల్ల అభ్యర్థి సమాధానం ఆదర్శవంతమైనదిగా ఉండాలి..
 
 సమాధానం: ‘‘తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే! నా స్నేహితుడు ’X’ పరీక్షలో చూసిరాస్తున్నట్లు ప్రత్యక్షంగా చూశాను కాబట్టి వెంటనే విషయాన్ని ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్తాను. ఇన్విజిలేటర్ నిబంధనలకు అనుగుణంగా నా స్నేహితుడ్ని పరీక్షలు రాసేందుకు అనర్హుడ్ని చేస్తారు. ఇలా చేస్తారని భావించడం అభ్యర్థి సానుకూల వైఖరి (Positive Attitude)ని ప్రతిబింబిస్తుంది.
 నా స్నేహితుడ్ని పరీక్ష రాసేందుకు అనర్హుడ్ని చేయడం వల్ల నిజంగా కష్టపడి చదివి పరీక్షలు రాసే వారికి తగిన ఫలితం దక్కుతుంది. మోసానికి పాల్పడ్డ వారికి గుణపాఠం అవుతుంది. అనైతిక కార్యకలాపాలకు పాల్పడే వారి ప్రవర్తనను ఆదిలోనే మార్చేందుకు వీలుంటుంది.
 నేను కనుక నా స్నేహితుడి మోసాన్ని ఇన్విజిలేటర్‌కు చెప్పకుండా ఉండిపోతే దానివల్ల దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయి. నా స్నేహితుడు భవిష్యత్తులోనూ ఇదే రకమైన తప్పులు చేసేందుకు ప్రోత్సహించిన వ్యక్తిని అవుతాను.
 పరీక్షలో చూసిరాతకు పాల్పడి నా స్నేహితుడు ఉత్తీర్ణుడైతే అదే విధానాన్ని మరో పది మంది అనుసరించే ప్రమాదమూ ఉంది. ఒకవేళ ఎంబీబీఎస్ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడి ‘డాక్టర్’ అయితే తర్వాత అతని వల్ల సమాజానికి ఎంత హానికరమో ఊహించవచ్చు.
 
 కేస్ స్టడీ 3
 నిన్ను ఓ జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్‌గా నియమించారు. ఆ ఆసుపత్రి జిల్లా కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లోని పేదలకు వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించినది. దీంట్లో పేదల వైద్య అవసరాలు తీరడానికి సరిపోయే మంచి మౌలిక వసతులున్నాయి. సరిపడా నిధులు కూడా అందుతున్నాయి. అయినా ఆసుపత్రి పనితీరుపై పదేపదే ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా రోగుల నుంచి ఒకే రకమైన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. వీటిలో కొన్నింటిని ఇచ్చి, వాటిని పరిష్కరించేందుకు సమర్థవంతమైన మార్గాలు చూపాలని అభ్యర్థిని ప్రశ్నించారు.
 
 ఫిర్యాదు-1: ఆసుపత్రి నిర్వహణ అధ్వానంగా ఉంది. ప్రాంగణంలో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది.
 అభ్యర్థి సమాధానం: ఆసుపత్రి అంటేనే ప్రజల రోగాలను నయం చేసి, ఆరోగ్యాన్ని ప్రసాదించేది. అలాంటి ఆసుపత్రే అపరిశుభ్రంగా ఉంటే అక్కడికి వచ్చే రోగులకు మరిన్ని రోగాలు సోకే ప్రమాదముంది. అందువల్ల ఓ ఉన్నతాధికారి స్థానంలో ఉన్న నేను వెంటనే పరిశుభ్రత పనులు సక్రమంగా జరిగేలా చూడాలని ఆసుపత్రి శానిటేషన్ ఇన్‌చార్జిని ఆదేశిస్తాను. సంబంధిత అధికారిని జవాబుదారీని చేస్తాను. అప్పుడప్పుడు ఆసుపత్రిలోని వివిధ వైద్య విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతాను.
 
 ఫిర్యాదు-2: ఆసుపత్రి సిబ్బంది రోగుల నుంచి తరచూ లంచం డిమాండ్ చేస్తున్నారు.
 అభ్యర్థి సమాధానం: రోగులు డాక్టర్, ఇతర ఆసుపత్రి సిబ్బందిని దేవుడిలా భావిస్తారు. అలాంటప్పుడు వారిపై రోగులు అనవసరంగా ఫిర్యాదు చేయరు కదా! అలాగని అందరూ లంచం తీసుకోరు కదా? కొందరు విలువలున్న వారూ ఉంటారు. అలాంటి వారి సహాయంతో అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బంది వివరాలు సేకరించి వారిపై తగిన చర్యలు తీసుకుంటాను. నాకు సమాచారం ఇస్తున్న వారి (Whistle Blowers)కి రక్షణ కల్పిస్తూ, అవినీతికి అడ్డుకట్ట వేయడంలో వారి సేవలు విస్తరించేలా చూస్తాను.
 ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వాటిని తెరచి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటాను. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ఫలితం ఉంటుంది. లంచం అడగటమే కాదు.. ఇవ్వడం కూడా నేరమేనని తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేస్తాను. ఒకవేళ ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే అప్పటికప్పుడు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యం కల్పిస్తాను.
 
 ఫిర్యాదు-3: వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
 సమాధానం: తొలుత వైద్యుల నిర్లక్ష్యానికి కారణాలేంటో తెలుసుకుంటాను. ఆసుపత్రిలో మౌలిక వసతుల లేమి వల్ల విధులను నిర్లక్ష్యం చేస్తున్నారా? లేదంటే వ్యక్తిగతంగా కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారా? అని విశ్లేషిస్తాను. గుర్రాన్ని, గాడిదను ఒకే గాటన కట్టలేం కాబట్టి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిని హెచ్చరిస్తాను. చిత్తశుద్ధితో పనిచేస్తున్న వారికి ప్రోత్సాహకాలు అందజేస్తాను. దీనికోసం ఎప్పటికప్పుడు రోగులతో స్వయంగా మాట్లాడతాను. ఎవరిపైనైనా పదేపదే ఫిర్యాదులు వస్తే వారిపై నిబంధనలకు అనుగుణంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను.
 
 ఫిర్యాదు-4: సిబ్బంది ఆసుపత్రిలో మందులను మాయం చేసి, వాటిని బయట అమ్ముకుంటున్నారు.
 స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించి సగటున ఏ ఫార్మసిస్టు విధుల్లో ఉన్నప్పుడు ఎక్కువ మందులు వినియోగం అవుతున్నాయో పరిశీలిస్తాను. వారిపై నిఘా ఉంచి వాస్తవాలను గుర్తిస్తాను. పది మంది రోగులు వస్తే 100 మందికి సరిపోయే మందులు వినియోగమైన సందర్భాలు, ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను సేకరించి, ఆరా తీసి, తప్పు చేసినట్లు తేలితే వెంటనే తగిన చర్యలు తీసుకుంటాను.
 
 ఫిర్యాదు-5: ఆసుపత్రిలోని సీనియర్ వైద్యులు.. స్థానిక ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లు, రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలతో కుమ్మక్కవుతున్నారు. రోగులకు ఆసుపత్రిలో సౌకర్యాలు అందకుండా చూస్తున్నారు. దీనివల్ల రోగులు బయట మార్కెట్లో మందులను కొనుగోలు చేయాల్సి రావడం, రోగ నిర్ధారణ పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్స్‌ను ఆశ్రయించడం వల్ల అధిక భారం పడుతోంది.
 
 సమాధానం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొందరు సీనియర్ వైద్యులు రేడియాలజీ విభాగంలోని ఖరీదైన వైద్య పరికరాలను కావాలనే పనిచేయకుండా చేస్తున్న సంఘటనలను అప్పుడప్పుడు చూస్తుంటాం. వైద్య సేవల కోసం వచ్చే రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు, ల్యాబ్స్‌కు పంపుతారు. ఇలా తమ వద్దకు రోగులను పంపినందుకు గాను ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్స్ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులకు కమీషన్లు ఇస్తుంటాయి.
 
 ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి నేను ఏం చేస్తానంటే.. ఆసుపత్రికి ఎంత మంది రోగులు వస్తున్నారు? వారికి సేవలు ఎలా అందుతున్నాయి? ఏ వైద్యులు ఎక్కువగా కేసులను బయటకు రిఫర్ చేస్తున్నారు? ఏ సంస్థలకు ఎక్కువగా రిఫర్ చేస్తున్నారు? వంటి విషయాలను క్షుణ్నంగా పరిశీలిస్తాను. ఈ క్రమంలో వాస్తవాలు బయటపడేందుకు అవకాశముంది. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని మరెవరూ అనైతిక కార్యకలాపాలకు పాల్పడకుండా చూస్తాను. బయటకు రిఫర్ చేస్తున్న కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు.
 
 ఫిర్యాదు-6: ఆసుపత్రిలో శక్తిమంతమైన ఉద్యోగ సంఘం ఉంది. ఇది పరిపాలన విభాగంపై మితిమీరిన ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వ విధానాల అమల్లో అధికారులకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రతిబింబించేలా ఈ కేస్ స్టడీ ఉంది.
 
 సమాధానం: ఇది ఒక గ్రూపుతో ముడిపడిన సమస్య. దీన్ని పరిష్కరించాలంటే జాగ్రత్తగా వ్యవహరించాలి. పౌర సమాజం, మీడియా సహాయంతో ఉద్యోగ సంఘం ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. సంస్కరణల అమలుతో ఆసుపత్రికి తద్వారా ఉద్యోగులకు కూడా ఎలాంటి మేలు జరుగుతుందో సంఘం నేతలకు వివరిస్తాను. ఇలాంటి అంశాలతో సమాధానం ఉండాలి.
 
 
 సివిల్స్ మెయిన్స్ జీఎస్-4 సిలబస్
 నీతిశాస్త్రం(ఎథిక్స్), నిజాయితీ(ఇంటెగ్రిటీ), అభిరుచి (ఆప్టిట్యూడ్)లకు సంబంధించి సిలబస్‌లో ఎనిమిది అంశాలను పేర్కొన్నారు. ఈ పేపర్‌లో 70 శాతం అంశాలు ప్రభుత్వ పాలన (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్)కు సంబంధించినవే. పేపర్‌కు మొత్తం 250 మార్కులు కేటాయించారు.
 నీతిశాస్త్రం, మానవునితో సంబంధం
 (Ethics and Human Interface)
 వైఖరి (Attitude)
 అభిరుచి, సివిల్ సర్వీస్ ప్రాథమిక విలువలు (Aptitude and foundational values for Civil Service)
 మానసికోద్వేగ మేధస్సు
 (Emotional intelligence)
 భావనలు-పాలనలో వీటి ఉపయోగం, అనువర్తన
 తత్వవేత్తల సేవలు
 (Philosophers Contributions)
 ప్రభుత్వ/పౌరసేవల విలువలు, ప్రభుత్వ పాలనలో నైతికత (Public/Civil service values and Ethics in Public administration)
 పరిపాలనలో నిజాయితీ/రుజువర్తన
 (Probity in Governance)
 పై అంశాలకు సంబంధించిన కేస్ స్టడీలు

 


 నైతిక విలువలు.. కార్యాచరణకు పునాదులు
 అది ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రాంతం.. అక్కడ ఓ పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. పిల్లలందరూ తింటుంటే వారి వెనకే తల్లిదండ్రులు నిరీక్షిస్తున్నారు. ఎందుకు? పిల్లలు తినగా కంచంలో మిగిలిన పిడికెడు మెతుకులు తిని ఆకలి బాధ తీర్చుకోవడానికి! ఆ ప్రాంతంలో పేదరికం స్థాయి ఎలా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
 
 ఇదే ప్రాంతంలో ఉన్న ఓ ప్రభుత్వాసుపత్రిలో కొందరు వైద్యులు, ప్రైవేటు రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలతో కుమ్మక్కవడంతో ప్రజలకు ఆసుపత్రిలో అందుతున్న సేవలు మృగ్యమయ్యాయి. అసలే పేదరికం.. ఆపై తడిసిమోపెడవుతున్న వైద్య సేవల ఖర్చులు.. ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కొత్తగా వచ్చిన కలెక్టర్ (ఆంధ్రప్రదేశ్ వ్యక్తి) కొన్ని చర్యలు తీసుకున్నారు...
 
 అవి: ఆసుపత్రికి రెండు కిలోమీటర్ల లోపు ప్రైవేటు రోగనిర్ధారణ పరీక్ష కేంద్రాలు లేకుండా చేశారు. తన అధికార పరిధిలో ఉన్న నిధులను కేటాయించి, అవసరమైన పరికరాలను, వసతులను ఆసుపత్రిలో ఏర్పాటు చేయించారు. పేదలకు ఆపన్న హస్తం అందించారు.. ఇలాంటి నైతిక విలువలు, విధి నిర్వహణ సామర్థ్యం ఎవరిలో ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నమే సివిల్స్ మెయిన్స్.. ఎథిక్స్ పేపర్!
 
 

మరిన్ని వార్తలు