ఉపాధ్యాయ అర్హతకు సీటెట్!

25 Dec, 2014 03:33 IST|Sakshi

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్)... సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జాతీయ స్థాయిలో నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష. దీనిలో అర్హత సాధించడం ద్వారా కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, టిబెటన్ పాఠశాలలు, ఇతర అన్‌ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలతోపాటు టెట్ నిర్వహించని రాష్ట్రాల్లోని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులుగా కెరీర్ ప్రారంభించేందుకు మార్గం సుగమం చేసుకోవచ్చు! తాజాగా సీటెట్-2015 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వివరాలు...

నోటిఫికేషన్
సీటెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాలనుకునే వారు (1 నుంచి 5వ తరగతి) పేపర్-1లో అర్హత సాధించాలి. ఉన్నత పాఠశాలలో (6 నుంచి 8 తరగతి) ఉపాధ్యాయుడిగా చేరాలనుకునే వారు పేపర్-2 రాయాల్సి ఉంటుంది. రెండు స్థాయిల్లో అంటే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉపాధ్యాయ అర్హత కోసం రెండు పేపర్లలో అర్హత సాధించాలి. పరీక్షలో 60 శాతం కంటే ఎక్కువ స్కోర్ సాధించిన వారికి అర్హత సర్టిఫికెట్ ఇస్తారు. సీటెట్ స్కోర్ ఫలితాలు విడుదల చేసిన తేదీ నుంచి ఏడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.

పరీక్ష విధానం:
సీటెట్‌ను మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం ప్రశ్నల సంఖ్య 150. మార్కులు 150. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 150 నిమిషాలు.

పేపర్-1
అంశం  పశ్నలు    మార్కులు
చైల్డ్ డెవలప్‌మెంట్
అండ్ పెడగాజి    30    30
లాంగ్వేజ్-1    30    30
లాంగ్వేజ్-2    30    30
మ్యాథమెటిక్స్    30    30
ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్    30    30
మొత్తం    150    150

పేపర్-2
అంశం     పశ్నలు     మార్కులు
చైల్డ్ డెవలప్‌మెంట్
అండ్ పెడగాజి    30    30
లాంగ్వేజ్-1    30    30
లాంగ్వేజ్-2    30    30
మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్
(లేదా)సోషల్ సైన్స్    60    60
మొత్తం    150    150

పేపర్ -1 అర్హత:
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(కోర్సును ఏ పేరుతో వ్యవహరించినా)లో ఉత్తీర్ణత లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు/ తత్సమానం

పేపర్-2 అర్హత:
గ్రాడ్యుయేషన్‌తోపాటు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (కోర్సును ఏ పేరుతో వ్యవహరించినా)ఉత్తీర్ణత లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. (లేదా) కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు ఏడాది వ్యవధి ఉన్న బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్(బీఈడీ)/ తత్సమానం

ప్రిపరేషన్:
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజిలో విద్యార్థుల వయసుకనుగుణంగా టీచింగ్, లెర్నింగ్, ఎడ్యుకేషనల్ సైకాలజీపై ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి సైకాలజీలోని కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు-సూత్రాలు, వాటిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి. లాంగ్వేజ్ విభాగంలో సంబంధిత మాధ్యమంలో అభ్యర్థి ప్రొఫిషియెన్సీతోపాటు కమ్యూనికేషన్, కాంప్రహెన్షన్ సామర్థ్యాలను పరీక్షిస్తారు. కాబట్టి బేసిక్ గ్రామర్ మీద పట్టు పెంచుకోవాలి. కాంప్రెహెన్షన్, ఫొనెటిక్స్, లెటర్ రైటింగ్‌ను ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, సోషల్ సైన్స్‌లో ఎక్కువగా కాన్సెప్ట్స్, ప్రాబ్లం సాల్వింగ్ సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఈ విభాగంలో రాణించేందుకు పేపర్ -1కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ/ సీబీఎస్‌ఈ పుస్తకాల్లోని సిలబస్‌కు అనుగుణంగా ప్రిపేరవ్వాలి. పేపర్-2కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఆరు నుంచి ఎనిమిదో తరగతి సిలబస్‌ను ఔపోసన పట్టాలి. అయితే ప్రశ్నల కఠినతా స్థాయి మాత్రం పేపర్-1కు పదోతరగతి స్థాయిలో, పేపర్-2కు సీనియర్ సెకండరీ స్థాయి వరకు ఉంటాయి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా సిలబస్‌ను అవగాహన పెంచుకుని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.

నోటిఫికేషన్ సమాచారం:
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 8, 2015.
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 22, 2015.
వివరాలకు: http://ctet.nic.in/
 

మరిన్ని వార్తలు