ఈ-అభివృద్ధికి డిజిటల్ ఇండియా...

9 Jul, 2015 01:59 IST|Sakshi

 డిజిటల్ ఇండియా... భారత్‌ను డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఒక గొప్ప ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే కార్యక్రమం! దేశవ్యాప్తంగా డిజిటల్ టెక్నాలజీని విస్తరించి, సామాజిక, ఆర్థిక ప్రగతిని సాధించడంతోపాటు పౌరులు సంపూర్ణ సాధికారతను సాధించాలన్నది ఈ కార్యక్రమం లక్ష్యం. సమాచార సాంకేతిక రంగాన్ని ఉపయోగించి, దేశంలోని డిజిటల్ అంతరాన్ని తొలగించి భవిష్యత్తు భారత్‌ను నిర్మించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ జూలై 1న ‘డిజిటల్ ఇండియా వీక్’ను న్యూఢిల్లీలో ప్రారంభించారు. కేంద్ర కేబినెట్ 2014 ఆగస్టులో డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఆమోదించింది.
 
 ‘ఇండియా టుడే + ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ = ఇండియా టుమారో’ అనే నినాదంతో డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని రకాల ఈ-గవర్నెన్స్ విధానాలను ఏకీకృతం చేస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కేంద్ర రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అనేక ఇతర సంస్థలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డీఈఐటీవై) ఈ కార్యక్రమాన్ని సమన్వయపరుస్తుంది.
 
 కీలకమైన మూడు అంశాలతో డిజిటల్ ఇండియా కార్యక్రమం అభివృద్ధిని విస్తరించనుంది. ప్రతి పౌరుడికి డిజిటల్ మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం:ఇందులో భాగంగా హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపు లభిస్తుంది. మొబైల్ ఫోన్‌ను బ్యాంకు అకౌంట్‌కు అనుసంధానించి పౌరులకు ఆర్థిక సేవలను సత్వరం అందిస్తారు. ఈ మౌలిక సదుపాయాల్లో భాగంగా ప్రతి పౌరుడి నివాస ప్రాంతానికి దగ్గరలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు సేవలను అందించే ఉమ్మడి సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. అన్ని రకాల లావాదేవీల భద్రత కోసం సైబర్ భద్రతను మెరుగుపరుస్తారు.డిమాండ్‌కు తగ్గట్టుగా ఎలక్ట్రానిక్స్ మాధ్యమంలో ప్రభుత్వ పాలన, సేవలను అందించడం:దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని విభాగాలన్నిటినీ ఇంటర్నెట్ ద్వారా అనుసంధానించి అన్ని రకాల సేవలను ఆన్‌లైన్, మొబైల్ విధానంలో అందిస్తారు. అన్ని రకాల లావాదేవీలను ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే నిర్వహించే విధంగా ప్రభుత్వ విభాగాలను, బ్యాంకులను ప్రోత్సహిస్తారు.
 
 దేశవ్యాప్తంగా పౌరులందరికీ డిజిటల్ సాధికారతను కల్పించడం:
 దేశవ్యాప్తంగా అందరికీ డిజిటల్ వనరులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డిజిటల్ అక్షరాస్యతను సాధించాలి. ప్రజలు వీటివైపు ఆకర్షితులవడానికి అన్ని భారతీయ భాషల్లో డిజిటల్, మౌలిక సదుపాయాలను రూపొందిస్తారు. క్లౌడ్ కంప్యూటింగ్ విధానంలో ప్రజలకు సేవలను అందించేందుకు కృషి చేస్తుంది.డిజిటల్ కార్యక్రమంలోని పై మూడు కీలక లక్ష్యాలను సాధించడానికి తొమ్మిది మూల అంశాలను అభివృద్ధి చేయగలిగారు. ఇవి డిజిటల్ ఇండియా కార్యక్రమానికి మూల స్తంభాలుగా అభివర్ణించారు.
 
 బ్రాడ్ బ్యాండ్ హైవేస్: దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలను బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ ద్వారా అనుసంధానించాలన్నది లక్ష్యం. 2016 నాటికల్లా దీన్ని పూర్తిచేస్తారు. టెలీకమ్యూనికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమ వ్యయం అంచనా రూ.32 వేల కోట్లు. పట్టణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ను విస్తరించడానికి ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్ ఆపరేటర్లను ప్రోత్సహించడంతోపాటు కొత్త భవనాలు, నివాస సముదాయాల్లో కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల వినియోగాన్ని తప్పనిసరి చేస్తారు. ఫలితంగా 2017 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్ వైడ్ ఏరియా నెట్‌వర్క్(ఎస్‌డబ్ల్యూఏఎన్)లను, నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌లను,నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్‌లను అనుసంధానించి నేషనల్ ఇన్ఫర్మేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను రూపొందిస్తారు.అందరికీ మొబైల్ కనెక్టివిటీ: 2014-18 మధ్యకాలంలో రూ.16 వేల కోట్ల ఖర్చుతో టెలీకమ్యూనికేషన్స్ విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఏమాత్రం మొబైల్ సదుపాయం లేని 42,300 గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.
 
 ాతీయ రూరల్ ఇంటర్నెట్ మిషన్: ఇది దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను విస్తరించేందుకు ఉద్దేశించిన సమయ నిర్ధారిత కార్యక్రమం. మూడేళ్లలో (2017 మార్చి నాటికి) అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ ఈ-గవర్నెన్స్: టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ సేవలను పూర్తిగా ప్రక్షాళించే ఈ-గవర్నెన్స్ విధానాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలి. ఇందుకోసం అనేక రకాల ఆన్‌లైన్ అప్లికేషన్లను రూపొందించడంతోపాటు పౌరులకు సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్ డేటాబేస్‌లలో పొందుపరుస్తారు. ప్రజల నుంచి అన్ని రకాల సిఫార్సులను కూడా ఆన్‌లైన్ విధానంలోనే స్వీకరిస్తారు. ఇందుకోసం వివిధ విభాగాల మధ్య సమన్వయానికి ఇది కృషి చేస్తుంది.
 
 ఈ-క్రాంతి: ఎలక్ట్రానిక్ విధానంలో సేవలను అందించే కార్యక్రమం. ఇందులో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, భద్రత, ప్రభుత్వ ప్రణాళిక, న్యాయసేవలన్నింటినీ ఎలక్ట్రానిక్ విధానంలో అందిస్తారు. ఈ-ఎడ్యుకేషన్‌లో భాగంగా దేశంలోని అన్ని పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ సదుపాయాలు కల్పిస్తారు. 2.5 లక్షల పాఠశాలల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించడం ద్వారా డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని విస్తరిస్తారు.అంతేకాకుండా ఆన్‌లైన్ విధానంలోనే విద్యను అభ్యసించి సర్టిఫికెట్ పొందే మ్యాసివ్ ఆన్‌లైన్ ఓపెన్ కోర్సులను రూపొందిస్తారు. ఈ-ఆరోగ్యంలో భాగంగా ఆన్‌లైన్ టెలీకన్సల్టేషన్ వైద్య రికార్డుల బదిలీ, ఇతర దేశాల్లోని వైద్యుల ద్వారా సూచనలు మొదలైన సేవలను అందుబాటులోకి తీసుకొస్తారు.
 
 ఈ-వ్యవసాయంతో ప్రత్యక్ష వ్యవసాయ మార్కెట్ సమాచారాన్ని అందించడంతోపాటు ఎరువులు, క్రిమిసంహారకాలను, విత్తనాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే విధానాన్ని ఈ కార్యక్రమంలో కల్పిస్తారు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నగదు బదిలీ, రుణాలు, కరువు భత్యం బదిలీ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. న్యాయ సేవలను ప్రజలకు అందించే లక్ష్యంతో ఈ-కోర్టు, ఈ-పోలీస్, ఈ-జైల్స్ మొదలైన సేవలను అందుబాటులోకి తీసుకొస్తారు.అందరికీ సమాచారం: పౌరులందరికీ ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో ప్రభుత్వ, ఇతర సేవల సమాచారాన్ని అందించే కార్యక్రమం- ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్. సామాజిక నెట్‌వర్క్‌ల ద్వారా మొబైల్ సంక్షిప్త సమాచారం ద్వారా ప్రజలకు సమాచారాన్ని అందించే ప్రత్యేక మౌలిక సదుపాయాలను ఇందులో భాగంగా అందజేస్తారు.
 
 ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పాదన: ఏటా భారత్ 100 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగిస్తోంది. వీటిలో ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, సిమ్‌కార్డ్, సెట్ అప్ బాక్స్‌లు, వైద్య రక్షణ సంబంధిత పరికరాలు మొదలైనవి. వీటికోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశంలోనే పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయాలన్నది ఈ వ్యూహం ప్రధాన లక్ష్యం. 2020 నాటికి దిగుమతులను పూర్తిగా తగ్గించి దేశంలో ఈ రంగాన్ని అభివృద్ధి చేసి ఎగుమతులను ప్రోత్సహించాలి. ఇందుకోసం ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు వివిధ రకాల రాయితీలు కల్పించి ప్రోత్సహించాలి.
 
 ఉద్యోగ కల్పనకు ఐటీ: 2019 నాటికి గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో కోటి మంది విద్యార్థులకు ఐటీ రంగంలో శిక్షణ ఇవ్వాలి. ముఖ్యంగా బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ శిక్షణ అందిస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకంగా యువతను ఐటీ వైపు ఆకర్షితులను చేసేందుకు బీపీవో రంగాన్ని అభివృద్ధి చేస్తారు. టెలికాం సర్వీసు ప్రొవైడర్స్ తమకు అవసరమయ్యే సిబ్బంది కోసం గ్రామీణ ప్రాంత యువతకు శిక్షణ అందిస్తారు. ప్రారంభ కార్యక్రమాలు: ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య సమాచార మార్పిడికి ఉద్దేశించి ప్రత్యేక మ్యాన్ మేనేజింగ్ అప్లికేషన్‌లను అభివృద్ధి చేశారు. ఫలితంగా 1.36 కోట్ల మొబైల్ ఫోన్‌లు, 22 లక్షల ఈ-మెమరీలను అనుసంధానించారు. న్యూఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ అటండెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 
 2019 నాటికి డిజిటల్ ఇండియా ద్వారా అందుబాటులోకి వచ్చే సేవలు:
 దేశ వ్యాప్తంగా 2.5 లక్షల గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలు.
 దేశ వ్యాప్తంగా మొబైల్ కనెక్టివిటీ, మొబైల్ గవర్నెన్స్.
 2020 నాటికి ఎలక్ట్రానిక్ దిగుమతులు పూర్తిగా నిలుపుదల.
 నాలుగు లక్షల పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సిస్ పాయింట్లు.
 
 2.5 లక్షల పాఠశాలలు, అన్ని విశ్వవిద్యాలయాల్లో వైఫై సేవలు, ప్రజలకు పబ్లిక్ వైఫై కేంద్రాలు.
 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలీ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ రంగాల్లో 1.7 కోట్ల ప్రత్యక్ష ఉద్యోగాలు, కనీసం 8.5 లక్షల పరోక్ష ఉద్యోగాలు. అన్ని ప్రభుత్వ సేవలు ఎలక్ట్రానిక్ విధానంలో అందించటం, విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్ రంగాల్లో ఐటీ సేవలను వినియోగించే దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానం.పూర్తిస్థాయిలో ప్రజలకు డిజిటల్ సాధికారత.
 

మరిన్ని వార్తలు