అవకాశాల వేదిక.. డిజిటల్ మార్కెటింగ్

16 Oct, 2014 02:29 IST|Sakshi
అవకాశాల వేదిక.. డిజిటల్ మార్కెటింగ్

కంపెనీలు / సంస్థలు.. తమ ఉత్పత్తులు, సేవల గురించి..  వివిధ ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా వినియోగదారులకు తెలియజేయడాన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాజ్యమేలుతోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీల దృష్టి డిజిటల్ మార్కెటింగ్‌పై పడింది.  ఎలాంటి ఖర్చ్చూ లేకుండా తమ ఉత్పత్తులను ప్రజల ముందుకు తీసుకొచ్చే మాధ్యమంగా దీన్ని గుర్తిస్తున్నాయి. దీంతో డిజిటల్ మార్కెటింగ్ అవకాశాల వేదికగా మారుతోంది. ఈ రంగంలో కొన్ని లక్షల మంది మానవ వనరుల అవసరం ఏర్పడనుంది. సిటీలోని పలు ఇన్‌స్టిట్యూట్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులను అందిస్తున్నాయి.  ఈ విభాగంలో ఉద్యోగావకాశాలు, కోర్సులు.. కావాల్సిన
 స్కిల్స్‌పై ఫోకస్..
 
 డిజిటల్ మార్కెటింగ్ ప్రత్యేకతలు
 ప్రముఖ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌ను వాడేవారి సంఖ్య వంద కోట్ల పైమాటే. అదేవిధంగా ట్విట్టర్‌ను ఉపయోగించేవారి సంఖ్య 274 మిలియన్లు. ఇక వాట్స్‌యాప్‌ను 600 మిలియన్ల మంది వినియోగిస్తున్నారు. సెల్‌ఫోన్  యూజర్లు కోట్లలోనే ఉన్నారు. లింకిడ్ ఇన్, గూగుల్ ప్లస్, నెట్‌లాగ్, ఇన్‌స్టాగ్రామ్, మీట్‌అప్, మీట్‌మీ వంటివాటిని వాడే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలోనే వివిధ వస్తుత్పత్తి సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, హాస్పిటల్స్, ఆహార పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ సంస్థలు.. మొదలైనవన్నీ తమ వస్తువులు, సేవలను ప్రజలకు పరిచయం చేయడానికి డిజిటల్ మార్కెటింగ్‌పై ఆధారపడుతున్నాయి.
 
 ఎలాంటి ఖర్చూ లేకుండా ఉచితంగా సోషల్ మీడియా ద్వారా తమ వస్తువులకు ప్రచారం కల్పిస్తున్నాయి. దీనివల్ల కంపెనీలకు భారీ ఎత్తున ఖర్చు కలిసి వస్తుంది. ప్రైవేటు కంపెనీలే కాకుండా ప్రభుత్వాలు కూడా డిజిటల్ మార్కెటింగ్ ప్రాధాన్యాన్ని గుర్తించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ మంత్రిత్వ శాఖలు తాము ప్రవేశపెట్టనున్న పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల గురించి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ శాఖలు, ప్రధానమంత్రి కార్యాలయం ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలు కూడా తెరిచాయి.  
 
 వీటిలో ఉద్యోగాలు
  డిజిటల్ మార్కెటింగ్‌లో రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మంది నిపుణుల అవసరం ఉంటుందని వివిధ సర్వేలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా కంటెంట్ రైటర్లు, వెబ్ డెవలపర్లు, యానిమేటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, డేటా ఎనలిస్టుల అవసరం భారీగా ఉంది. కంటెంట్ రైటర్.. సంబంధిత కంపెనీ అందించే వస్తువులు, సేవల గురించి వినియోగదారుని ఆకట్టుకునేలా క్లుప్తంగా, స్పష్టంగా, సూటిగా రాయాల్సి ఉంటుంది. వస్తువులు/సేవల ప్రత్యేకతలను వివరించాలి. అవసరమైతే వీడియోలు కూడా పొందుపర్చాలి. వెబ్ డెవలపర్లు.. సంబంధిత కంపెనీ వెబ్‌సైట్‌ను.. యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దాలి. సంబంధిత కంపెనీ ఫేస్‌బుక్‌లో ప్రత్యేకంగా పేజీ ఓపెన్ చేస్తే.. అందుకు సంబంధించిన సేవలు అందించాల్సి ఉంటుంది. డేటా ఎనలిస్ట్.. ఎంతమంది ఏయే వెబ్‌సైట్లను చూస్తున్నారు? తమ వెబ్‌సైట్‌ను చూసేవారెంతమంది? ఏ వస్తువులను వినియోగదారులు ఇష్టపడుతున్నారు? వంటి విషయాలపై డేటా తయారుచేయాలి.
 
 ఇవేకాకుండా అఫిలియేట్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, కంటెంట్ స్ట్రాటజీ, కమ్యూనిటీ మేనేజ్‌మెంట్, డిజిటల్ అకౌంట్ మేనేజ్‌మెంట్, డిజిటల్ కాపీ రైటింగ్, డిజిటల్ సీఆర్‌ఎమ్, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ, డిజిటల్ అడ్వర్టైజింగ్ సేల్స్, ఈ-మెయిల్ మార్కెటింగ్, ఈ-కామర్స్, ఇన్‌బౌండ్ మార్కెటింగ్, ఇన్‌ఫో గ్రాఫిక్స్, మొబైల్‌యాప్ డెవలప్‌మెంట్, మొబైల్ కామర్స్, మొబైల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ పబ్లిక్ రిలేషన్స్, పే పెర్‌క్లిక్ (పీపీసీ), సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్‌మీడియా మార్కెటింగ్, ఎస్‌ఎమ్‌ఎస్ మార్కెటింగ్, వెబ్ అనలిటిక్స్, వెబినార్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ వంటి విభాగాల్లో వివిధ హోదాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.
 
 మన దేశంలో అపార అవకాశాలు
 ప్రపంచంలో అమెరికా తర్వాత ఎక్కువమంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తోంది మన దేశంలోనే. స్మార్ట్‌ఫోన్ల రాకతో ఇంటర్నెట్ వాడకం పెరిగింది. దేశంలో మొబైల్ ద్వారా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య 110 మిలియన్లకు పైమాటే. ఇందులో 25 మిలియన్ల మంది గ్రామీణ ప్రాంతం వారే. 2016 నాటికి ప్రపంచంలోనే అత్యధిక ఫేస్‌బుక్ వినియోగదార్లతో మన దేశం అగ్రస్థానానికి చేరుకోవచ్చని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే డిజిటల్ మార్కెటింగ్ అపార అవకాశాల నిలయంగా మారుతోంది. ఆన్‌లైన్ షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, సామాజిక చర్చలు, వార్తలు తెలుసుకోవడంలో డిజిటల్ మీడియా ప్రధాన వనరుగా మారింది.  
 
 కోర్సులు.. సంస్థలు
 డిజిటల్ మార్కెటింగ్‌లో అడుగుపెట్టాలనుకునేవారు ప్రత్యేకంగా ఎలాంటి కోర్సులు పూర్తిచేయాల్సిన అవసరం లేదు. ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి కంప్యూటర్ బేసిక్స్ తెలిసినవారు ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు. ఎంబీఏ మార్కెటింగ్ వంటి కోర్సులు పూర్తిచేస్తే కెరీర్‌లో ఎదగడానికి అవకాశం ఉంటుంది. మనదేశంలో డిజిటల్ మార్కెటింగ్ అభివృద్ధి దశలో ఉంది. అందువల్ల ప్రైవేటు రంగంలోని కంప్యూటర్ శిక్షణా సంస్థలు డిజిటల్ మార్కెటింగ్ కోర్సులను అందిస్తున్నాయి. ప్రైవేటు రంగంలోని ప్రముఖ కంప్యూటర్ శిక్షణ సంస్థ ఎన్‌ఐఐటీ (వెబ్‌సైట్: www.niitdigitalmarketing.com/) డిజిటల్ మార్కెటింగ్‌లో వివిధ కోర్సులను ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంలు), వివిధ ప్రముఖ బిజినెస్ స్కూల్స్ కూడా ఎన్‌ఐఐటీ సహకారంతో పీజీడీఎం/పీజీపీ కోర్సులో ఒక ఎలక్టివ్‌గా డిజిటల్ మార్కెటింగ్‌ను బోధిస్తున్నాయి.
 
  ఇవేకాకుండా డిజిటల్ అకాడమీ ఆఫ్ ఇండియా, డిజిటల్ విద్య, ఎడ్యుకార్ట్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, గూగుల్ డిజిటల్ మార్కెటింగ్, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ వంటివి ఈ రంగంలో కోర్సులను అందిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
 (http://www.isb.edu/) డిజిటల్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్‌పై స్వల్పకాలిక కోర్సును అందిస్తోంది. అదేవిధంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా (ఏఐఎస్‌ఎఫ్‌ఎం).. మాస్టర్స్ ఇన్ మాస్ కమ్యూనికేషన్ (అడ్వర్టైజింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్)ను ఆఫర్ చేస్తోంది. 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్‌‌స డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకు అర్హులు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ www.aisfm.edu.in/ చూడొచ్చు.
 
 సొంతంగా నైపుణ్యాలు పెంచుకోవాలి
 డిజిటల్ మార్కెటర్లుగా రాణించాలంటే సాంకేతిక నైపుణ్యాలు కీలకం. సరైన ప్రతిభ కనబరచకపోతే కంపెనీలు, క్లయింట్లు, ఎగ్జిక్యూటివ్స్, ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో కొన్ని కళాశాలలు, యూనివర్సిటీలు డిజిటల్ మార్కెటింగ్ కోర్సును కెరీర్‌గా మలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. అభ్యర్థులు మార్కెటింగ్‌లో ఎలా విజయం సాధించాలనే దానిపై ప్రత్యేక దృష్టి సారించాయి. కేవలం ఫ్యాకల్టీ సూచనలు, సలహాలపైనే ఆధారపడకుండా సొంతంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. వెబ్ వర్క్స్, హెచ్‌టీఎమ్‌ఎల్, పీహెచ్‌పీ, జావా స్క్రిప్ట్, సీఎస్‌ఎస్, రూబీ లాంటి వాటిపై ప్రాథమిక పరిజ్ఞానం ఉంటే మార్కెటింగ్ క్యాంపెయిన్‌లను మరింత సమర్థంగా నిర్వహించవచ్చు.
 
 వేతనాలు
 సెర్స్ హోల్డింగ్ కార్పొరేషన్, ఎన్‌బీసీ యూనివర్సల్, మైక్రోసాఫ్ట్, డెల్, ఈఎంసీ2, వీఎమ్‌వేర్, ఈబే, గూగుల్, ఏటీ అండ్ టీ,  హనీ వెల్ వంటి కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. సంప్రదాయ మార్కెటింగ్ సిబ్బంది వేతనంతో పోలిస్తే డిజిటల్ మార్కెటింగ్ రంగంలో  వారికి వేతనాలు ఎక్కువగా ఉంటాయి. ప్రారంభంలో నెలకు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు పొందొచ్చు. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి నెలకు రూ. 40,000 నుంచి రూ.80,000 వరకు అందుకోవచ్చు. ఈ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తే రూ.లక్షల్లో ఆర్జించొచ్చు.  
 
 విస్తరిస్తున్న డిజిటల్ మార్కెటింగ్  
 ‘‘రానున్న రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ మరింత అభివృద్ధి చెందుతుంది. ఇందులో రాణించాలంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మేనేజర్లకు, కింది స్థాయి సిబ్బందికి మధ్య వారధిగా ఉండాలి. వినియోగదారులను ఆకట్టుకోవడంపైనే ఈ రంగంలో కెరీర్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి వినియోగదారుల ఇష్టాయిష్టాలు, అభిరుచులను ఫీడ్‌బ్యాక్ ద్వారా తెలుసుకుంటుండాలి. మన దేశంలో యువ జనాభా ఎక్కువగా ఉంది. వీరంతా సామాజిక మాధ్యమాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ రంగం మరింత విస్తరిస్తుంది. తద్వారా అంతేస్థాయిలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి’’
 
 - గౌతమ్ సాతియా, మార్కెటింగ్ కన్సల్టెంట్
 - బ్రాండ్ ప్లానింగ్ అండ్ డిజిటల్ స్ట్రాటజీ,
 అంత్రాగ్ని డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్
 
 కావాల్సిన లక్షణాలు
  కంప్యూటర్ బేసిక్స్ తెలిసుండాలి.  ఇంటర్నెట్‌పై  అవగాహన తప్పనిసరి.   వివిధ సెర్చ్ ఇంజన్లు, సోషల్ మీడియా వెబ్‌సైట్లపై పట్టు ఉండాలి.   మాతృభాషతోపాటు ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి.   డిజిటల్ మార్కెటింగ్‌లో వస్తున్న ఆధునిక విధానాల గురించి తెలుసుకోవాలి.
  వినియోగదారుల అభిరుచులను గమనిస్తుండాలి.
  సృజనాత్మకతతోపాటు విభిన్నంగా ఆలోచించగలగాలి.
 

మరిన్ని వార్తలు