విద్యావిధానంలో అమెరికాకు, ఇండియాకు తేడా ఉంది

30 Nov, 2017 13:09 IST|Sakshi

అమెరికా రిజిస్ట్రార్‌ వంగపర్తి రాజశేఖర్‌రెడ్డి

ఎంజీయు (నల్లగొండరూరల్‌) : విద్యా విధానంలో అమెరికా–ఇండియాకు తేడా ఉందని అమెరికాలోని న్యూయార్క్‌ స్టేట్‌ ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ రిజిస్ట్రార్‌ వంగపర్తి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం యూనివర్సిటీలో ఎడ్యుకేషన్‌ సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాక్టికల్‌ నాలెజ్డ్‌ కోసం ప్రతి ఒక్కరూ ఇంటర్నషిప్‌ చేయాల్సి ఉంటుందని అన్నారు. మన దేశంలో ప్రాజెక్టు నిర్వహిస్తామని, థియరీ ఎక్కువగా బోధిస్తామని, ఇవి అధ్యయనం చేసిన విద్యార్థులు అమెరికాలో కొంత ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. మంచిభాషాపటిమ, సబ్జెక్టు నాలెడ్జితో పాటు ఇతర అంశాలలో కూడా విద్యార్థులు ప్రతిభ చాటాలని అన్నారు. అమెరికాకు వచ్చి విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు ఇక్కడి ఏజెంట్లు చెప్పినట్లు కాకుండా మంచి కళాశాలను ఎంచుకోవడానికి అన్ని వివరాలను తెలుసుకోవాలని సూచించారు.

వీసాలు పొందడం, చదువుకుంటూ సంపాదించే అవకాశాలను తెలుసుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు కర్ణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తెలుగు విద్యార్థులకు పలు సూచనలు ఇస్తుందని తెలిపారు. వీసీ ఆల్తాఫ్‌ హుస్సేన్‌  మాట్లాడుతూ యూనివర్సిటీ అమలు చేస్తున్న విద్యాబోధన, నైపుణ్యంపై తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఉమేష్‌కుమార్, రవి, వసంత, సరిత, సబాన హెరాల్డ్, పరమేష్, భీంరెడ్డి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు