వ్యాధి నిరోధక శక్తి... టీకాలు

23 Apr, 2015 03:26 IST|Sakshi

 శరీరంలో ప్రవేశించిన వ్యాధి కారకాన్ని గుర్తించి నిర్మూలించే వ్యవస్థ అసంక్రామ్యత వ్యవస్థ లేదా వ్యాధి నిరోధక వ్యవస్థ (Immune System). ఈ వ్యవస్థ ద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అసంక్రామ్యత వ్యవస్థను అర్థం చేసుకోవడం ద్వారానే మనిషి టీ కాలను అభివృద్ధి చేశాడు. అంతేకాకుండా ప్రస్తుతం అనేక రోగ నిర్ధారణ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.
 
 మనిషిలో వ్యాధి నిరోధక శక్తి రెండు రకాలు. అవి స్వాభావిక, స్వీకృత వ్యాధి నిరోధక శక్తులు. పుట్టుకతోనే లభించేది స్వాభావిక వ్యాధి నిరోధక శక్తి. శరీరంలోకి ఏ వ్యాధి కారకం ప్రవేశించక ముందే.. ఈ వ్యాధినిరోధక శక్తి ఉంటుంది. వ్యాధి కారకం ప్రవేశించడం ద్వారా అభివృద్ధి చెందింది కాదు. చర్మం, శ్లేష్మస్తరం, బాహ్య అవరోధాలుగా వ్యవహరిస్తూ స్వాభావిక వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయి. వీటికి అదనంగా బ్యాక్టీరియా నాశినిగా పనిచేసే కంటిలోని లైసోజైం అనే ఎంజైమ్, జఠరరసంలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లాలు కూడా స్వాభావిక వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయి. కాబట్టి అందరిలోనూ స్వాభావిక వ్యాధి నిరోధక శక్తి ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఆర్జించే వ్యాధి నిరోధక శక్తి స్వీకృత/ఆర్జిత వ్యాధి నిరోధక శక్తి. ఒక వ్యక్తి నివసించే ప్రాంతం లేదా పీల్చేగాలి, తాగేనీరు, ఆహారపు అలవాట్లపై ఈ రకమైన వ్యాధి నిరోధక శక్తి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది అందరిలోనూ ఒకే విధంగా ఉండదు.
 
 మనిషిలో వ్యాధి నిరోధక వ్యవస్థ:
 మనిషి వ్యాధి నిరోధక వ్యవస్థలో తెల్లరక్తణాలు, లింఫాయిడ్ ఉంటాయి. తెల్ల రక్తకణాలు శరీర రక్షక భటులు వంటివి. వీటిలో ఇసినోఫిల్స్ అలర్జీ చర్యల్లో పాల్గొనగా, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ భక్షక కణాలుగా వ్యవహరిస్తాయి. లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాలు చాలా కీలకమైనవి. ఇవి రెండు రకాలు టి-లింఫోసైట్స్, బి-లింఫోసైట్స్. వ్యాధి నిరోధక వ్యవస్థలోని అవయవాలు రెండు రకాలు. అవి ఎముక మజ్జ, థైమస్ - అనేవి ప్రాథమిక అవయవాలు. ఎముక మజ్జలో లింఫోసైట్స్ ఏర్పడతాయి. బి-లింఫోసైట్స్ మాత్రం ఎముక మజ్జలో, టి-లింఫోసైట్స్ థైమస్ నుంచి విడుదలయ్యే థైమోసిన్ హార్మోను ప్రేరణతో పరిపక్వత చెందుతాయి. టి, బి లింఫోసైట్స్ ద్వారా లభించే వ్యాధి నిరోధక శక్తిని నిర్దిష్ట వ్యాధి నిరోధక శక్తి అంటారు. వ్యాధి కారకం ఉపరితలం పైనున్న ప్రతిజనకం ఆధారంగా దాన్ని గుర్తిస్తారు.
 
 టి- లింఫోసైట్స్ అందించే వ్యాధి నిరోధక శక్తిని సెల్యులాడ్/సెల్‌మీడియేటెడ్ వ్యాధి నిరోధక శక్తి అంటారు. వ్యాధి కారకాన్ని గుర్తించి టి-లింఫోసైట్స్ భక్షక కణాలను ప్రేరేపిస్తాయి. ఫలితంగా భక్షక కణాలు వ్యాధి కారకాన్ని భక్షిస్తాయి. కొన్ని సందర్భాల్లో టి-లింఫోసైట్స్ నేరుగా వ్యాధి కారకాన్ని నాశనం చేస్తాయి. ముఖ్యంగా సీడీ 8 కణాలు ఈ విధంగా వ్యవహరిస్తాయి. కొన్ని టీ4 లింఫోసైట్స్ వ్యాధి కారకాన్ని గుర్తించిన వెంటనే బి-లింఫోసైట్స్‌ను ప్రేరేపిస్తాయి. ఈ విధంగా ప్రేరణకు గురైన బి-లింఫోసైట్స్ వ్యాధి కారకానికి వ్యతిరేకంగా ప్రత్యేక ప్రతిదేహకాలు లేదా ప్రతి రక్షకాల(ఊఖీఐ ఆైఈఐఉ)ను విడుదల చేస్తాయి. ఈ ప్రతిదేహకాలు వ్యాధి కారకం ఉపరితలంపై ప్రతిజనకాన్ని బట్టి వ్యాధి కారకాన్ని గుర్తించి నాశనం చేస్తాయి. కొన్ని బి-కణాలు వ్యాధి కారకాన్ని గుర్తుపెట్టుకునే ఇమ్యూనలాజికల్ మెమొరీ అనే గుణాన్ని ప్రదర్శిస్తాయి. మళ్లీ ఎప్పుడైనా అదే వ్యాధి కారకం శరీరంలోకి ప్రవేశిస్తే ఈసారి అధిక మొత్తంలో వేగంగా ప్రతిదేహకాలు విడుదలై, వ్యాధి కారకాన్ని పూర్తిగా నిరోధిస్తాయి. ఈ రకంగా ప్రతిదేహకాల ద్వారా బి-లింఫోసైట్స్ అందించే వ్యాధి నిరోధక శక్తి హ్యూమొరల్ వ్యాధి నిరోధక శక్తి.
 
 టీకా:
 టీకా లేదా వ్యాక్సిన్ అనేది ఒక నివారణ మందు. వ్యాధి కారకం శరీరంలోకి చేరకముందే దీన్ని ఇవ్వడం ద్వారా భవిష్యత్‌లో సంక్రమించే అవకాశమున్న వ్యాధికారక నిరోధాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చు. కేవలం చిన్న పిల్లలే కాకుండా పెద్దలు కూడా వేయించుకునే టీకాలు ఉన్నాయి. సాధారణంగా టీకాలు రెండు రకాలు ఒకటి సంప్రదాయక, రెండోది ఆధునిక టీకాలు. సంప్రదాయక టీకాల్లో క్షీణింపజేసిన లేదా మృత వ్యాధి కారకాలు ఉంటాయి. ఈ టీకాలను అందించటం ద్వారా వ్యాధి అభివృద్ధి చెందదు. అయితే వ్యాధి కారక ఉపరితలంపై ఉన్న ప్రతిజనకానికి విరుద్ధంగా శరీరంలో ప్రతిదేహకాలు విడుదలై మెమొరీ అభివృద్ధి చెందుతుంది.
 
 ఇలాంటి టీకాలను రెండు/మూడుసార్లు వేయిస్తే శరీరంలో వ్యాధికి విరుద్ధంగా పూర్తిస్థాయి నిరోధకత లభిస్తుంది. ఉదా: ఓరల్ పోలియో వ్యాక్సిన్ (ై్కగ), డీపీటీ వ్యాక్సిన్ . సంప్రదాయ టీకాల్లో కొన్ని లోపాలను అధిగమించేందుకు ఆధునిక టీకాలతో శుద్ధమైన ప్రతిజనకం లేదా వ్యాధి కారకానికి చెందిన ఉపరితల భాగం ఉంటాయి. ఇవి సంప్రదాయ టీకాల కంటే సురక్షితమైనవి ఉదా: హెపటైటిస్ ఎ టీకా. స్థిరమైన ప్రతిజనకం లేని కారణంగా హెచ్‌ఐవీ లాంటి వాటికి విరుద్ధంగా ఎలాంటి టీకాలు అందుబాటులోకి రాలేదు.
 
 భారత్‌లో టీకా కార్యక్రమం:
 1975లో ప్రపంచవ్యాప్తంగా మశూచిని పారదోలిన తర్వాత భారత ప్రభుత్వం 1978లో టీకా విస్తరణ క్రమాన్ని ప్రారంభించింది. 1974లో ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన నమూనా ఆధారంగా ఈ కార్యక్రమాన్ని భారత్ చేపట్టింది. 1990 నాటికల్లా దేశంలో ఉన్న చిన్నారులందరికీ టీకాలు అందించాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యం. 1985లో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా 1990 నాటికల్లా 85 శాతం చిన్నారులకు టీకాలు అందించాలని, టీకాల ఉత్పాదనలో స్వయం సమృద్ధి సాధించాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యం. ఆ తర్వాత కొన్ని ఇతర కార్యక్రమాల్లో.. టీకా కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రస్తుతం జాతీయ ఆరోగ్య మిషన్‌లో టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రస్తుతం ఉచితంగా అందిస్తున్న టీకాలు, కనీసమైనవి, కచ్చితమైనవి. గర్భిణీలకు రెండు డోసుల టీ-టీ (టెటనస్ టాక్సాయిడ్) టీకాలు ఇస్తున్నారు. ప్రాణాంతక వ్యాధుల నివారణగా నవ శిశువులకు ఈ టీకాలు అందిస్తున్నారు.
 
 క్షయ     బాసిల్లస్ కాల్మేట్ గ్వెరిన్ (బీసీజీ)
 పోలియో    ఓరల్ పోలియో వ్యాక్సిన్ (ఓపీవీ)
 డిఫ్తీరియా
 పర్టుసిన్     డీపీటీ టీకా
 టెటనస్
 మీజిల్స్     మీజిల్స్ టీకా
 హెపటైటిస్-బి    హెప్-బి టీకా
 వీటికి అదనంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో జపనీస్ ఎన్సిఫలై టీస్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో నీమోకోకల్ కాంజిగేట్ టీకా, హ్యూమన్ పాపిల్లోమ టీకా, రోటా టీకా, హెచ్‌ఐబీ టీకాను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ప్రభుత్వం అందిస్తున్న టీకాలకు అదనంగా కొన్ని కచ్చిత టీకాలను పిల్లలకు అందించాల్సిందిగా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) సూచిస్తుంది.
 
 మంప్స్
 మీజిల్స్    ఎంఎంఆర్ టీకా
 రుబెల్లా
 పోలియో    ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్
 టైఫాయిడ్    టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్
 హీమోఫిలస్
 ఇన్‌ఫ్లూయంజా టైప్‌బి    హెచ్‌ఐబి టీకా
 సర్వైకల్ క్యాన్సర్    హ్యూమన్ పాపిల్లోమ టీకా
 వీటికి అదనంగా కూడా కొన్ని ఐచ్ఛిక టీకాలను ఐఏపీ సూచిస్తుంది.
 1. హెపటైటిస్-ఎ     హెప్‌అ టీకా
 2. అమ్మవారు    వారిసెల్ల టీకా
 ప్రతిజనకం: వ్యాధి కారకం ఉపరితలంపై ఉంటూ శ రీర నిరోధక శక్తిని ప్రేరేపించే అన్య పదార్థమే. ప్రతజనకం. రసాయనకంగా ఇది ఏదైనా కావచ్చు. దీనికి విరుద్ధంగా శరీరంలోని బి-లింఫోసైట్స్ అనే తెల్ల రక్తకణాలు ప్రతిదేహకాలు అను జీవక్షిపణులను విడుదల చేస్తాయి.
 
 వ్యాక్సినేషన్‌పై అవగాహన
 త ల్లిదండ్రులు విధిగా డాక్టర్లను సంప్రదించి పిల్లలకు వేయించాల్సిన కచ్చిత, ఐచ్చిక టీకాలపై అవగాహన పెంచుకోవాలి.
 ప్రభుత్వం అందించే టీకాలు, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సూచిస్తున్న కచ్చిత, ఐచ్చిక టీకాల ఆవశ్యకతపై తల్లిదండ్రులకు డాక్టర్లు అవగాహన కల్పించాలి.
 టీకా కార్డులో సూచించిన విధంగా ఎప్పటికప్పుడు టీకాలు వేయించాలి.
 టీకా వేసిన వైద్య వాలంటీర్ కార్డులో గుర్తుపెట్టి మళ్లీ ఎప్పుడు టీకా వేయించాలన్నది తల్లిదండ్రులకు తెలియజేయాలి.
 జ్వరం, దగ్గు, జలుబులు ఉన్నప్పుడు టీకాలు వేయించరాదు. తగ్గిన తర్వాత వేయించాలి.
 ఏ కారణం చేతైనా టీకాలు వేయించడంలో అవాంతరం ఏర్పడితే, మళ్లీ వైద్యుణ్ని సంప్రదించి కొత్త షెడ్యూల్‌ను ఖరారు చేసుకోవాలి.
 కేవలం పిల్లలకే కాదు పెద్దలకు కూడా వేయించాల్సిన టీకాలు ఉంటాయి.
 సాధారణంగా ఒకే రోజు ఎన్ని టీకాలైనా పిల్లలకు ఇవ్వొచ్చు. అయితే మళ్లీ 4 వారాల వరకు టీకాలు ఇవ్వకూడదు. పల్స్ పోలియో కార్యక్రమం, రేబిస్ టీకాలకు ఈ షరతు వర్తించదు.
 టీకా వేయించిన తర్వాత అర గంట వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దే వేచి ఉండాలి. ఎలాంటి ప్రతీకార చర్య కన్పించినా వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.
 అన్ని టీకాలు ప్రతీకార చర్యలకు కారణం కావు. అందరి పిల్లల్లో ప్రతీకార చర్యలు ఒకేవిధ ంగా ఉండవు. ప్రతీకార చర్య కనిపించినంత మాత్రానే టీకా పనిచేసినట్టు కాదు.
 ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేయించినప్పుడు స్వల్ప జ్వరం ఉంటుంది. పారాసిటమాల్ ఇవ్వాలి. ఆస్ప్రిన్ ఇవ్వకూడదు.
 కోడి గుడ్లకు అలర్జీ ప్రదర్శించే వారు ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేయించుకోకూడదు.
 కొత్తగా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన పెంటావలెంట్, టెట్రావలెంట్‌ల కాంబినేషన్ వ్యాక్సిన్‌లపై అవగాహన పెంపొందించుకోవాలి.
 
 కాంబినేషన్ వ్యాక్సిన్
 నాలుగు అంతకంటే ఎక్కువ వ్యాధి కారకాలకు నిరోధక మందులు ఉన్న టీకాలను కాంబినేషన్ టీకాలు (వ్యాక్సిన్) అంటారు. భారత్‌లో ప్రస్తుతం బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన రెండు రకాల టీకాలు బాగా వినియోగంలో ఉన్నాయి. ఒకటి టెట్రావలెంట్ టీకా (నాలుగు వ్యాధులకు ఒకే నివారణ మందు). రెండోది పెంటావలెంట్ టీకా(ఐదు వ్యాధులకు ఒకే నివారణ టీకా). తొలిసారిగా ఇలాంటి టీకాలను కేంద్రం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పెలైట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నారు. 2014, నవంబర్‌లో పెంటావలెంట్ టీకాను మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా రెండు దశల్లో దీని వినియోగాన్ని విస్తరిస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లతో పాటు తొలి దశలో 12 రాష్ట్రాల్లో అమల్లోకి తీసుకొస్తున్నారు. 2015లో రెండో దశలో ఇతర రాష్ట్రాలకు విస్తరించనున్నారు. అంతర్జాతీయ సంస్థ ‘గావి’ సహకారంతో పెంటావెలెంట్ టీకా వినియోగాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. 2000లో ఏర్పాటైన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది. ఈ సంస్థ 2015 నాటికి 500 మిలియన్ పిల్లలకు టీకాలను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఇప్పటి వరకు 70 లక్షల పిల్లలను ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా రక్షించింది.
 
 పల్స్ పోలియో కార్యక్రమం
 పోలియోను నిర్మూలించే లక్ష్యంతో 1995లో భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఐదేళ్లలోపు పిల్లలకు జాతీయ, రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో పోలియో చుక్కలు వేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో 1.5 లక్షల మంది సూపర్ వైజర్ల ఆధ్వర్యంలో 24 లక్షల మంది వైద్య వాలంటీర్లు పాల్గొన్నారు. 2011 నుంచి 2014 వరకు దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాకపోవడంతో 2014, మార్చిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించింది. 1995లో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిననాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 131 పోలియో కార్యక్రమాలు నిర్వహించి 12.1 బిలియన్ పోలియో టీకాలను పిల్లలకు అందించారు. 2011, జనవరి 13న పశ్చిమ బెంగాల్‌లోని హౌరా ప్రాంతంలో చివరిసారిగా ఒక అమ్మాయికి పోలియో కేసు నమోదైంది. ఆ తర్వాత వరుసగా మూడేళ్లు ఎలాంటి పోలియో కేసు నమోదు కాకపోవటంతో భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించారు. తొలి సారిగా 1985లో ప్రపంచ వ్యాధి నిరోధక శక్తి కార్యక్రమంలో మొదటి సారిగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ భారత్‌లో ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయిలో 1995లో జాతీయ స్థాయిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా జాతీయస్థాయిలో రెండు, రాష్ట్రస్థాయిలో అనేక సార్లు 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు