బ్రిటన్‌లో చదివే స్టూడెంట్స్‌కు తీపికబురు

11 Sep, 2019 15:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్‌లో చదివే భారతయ విద్యార్ధులకు తీపికబురు అందింది. అక్కడ చదివే విద్యార్ధులు తమ విద్యాకాలం ముగిసిన తర్వాత రెండేళ్ల పాటు బ్రిటన్‌లో పనిచేసే వెసులుబాటును బ్రిటిష్‌ ప్రభుత్వం కల్పించింది. భారత విద్యార్ధులతో సహా అంతర్జాతీయ విద్యార్ధులందరికీ రెండేళ్ల పాటు వర్తించేలా విద్యానంతర వర్క్‌ వీసాను బ్రిటన్‌ ప్రకటించిది. భారత విద్యార్ధులు తమ చదువు ముగిసిన తర్వాత మరో రెండేళ్లు యూకేలో గడిపే వెసులుబాటు లభించిందని, ఈ అవకాశంతో వారు మరింత అనుభవం, నైపుణ్యాలు సమకూర్చుకోవచ్చని భారత్‌లో బ్రిటన్‌ హైకమిషనర్‌ సర్‌ డొమినిక్‌ అక్విత్‌ పేర్కొన్నారు.

2019 జూన్‌ నాటికి 22,000 మంది భారత విద్యార్ధులు యూకేలో చదువుతుండగా, 2016 జూన్‌తో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ విద్యార్ధులకు నూతన గ్రాడ్యుయేట్‌ రూట్‌ ద్వారా తాము కోరుకున్న డిగ్రీలను పొందడంతో పాటు విలువైన అనుభవంతో పటిష్టమైన కెరీర్‌లను రూపొందించుకునేందుకు అవకాశం లభిస్తుందని బ్రిటన్‌ హోం సెక్రటరీ ప్రీతి పటేల్‌ చెప్పారు. మరోవైపు శాస్త్రవేత్తలకు త్వరితగతిన వీసా కల్పించే సదుపాయం అందుబాటులోకి తేవడంతో పాటు నైపుణ్యంతో కూడిన వర్క్‌ వీసాకు అనుమతించే పీహెచ్‌డీ విద్యార్ధుల సంఖ్యపై పరిమితిని బ్రిటన్‌ తొలగించింది.

మరిన్ని వార్తలు