ఉద్యోగానికి గ్యారెంటీ వెటర్నరీ సైన్స్

23 Jan, 2014 15:52 IST|Sakshi
ప్రొఫెసర్ పి.సుధాకర్ రెడ్డి

శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీని ఏర్పాటు లక్ష్యం?
 పశువైద్య విద్యలో నాణ్యత పెంచి, తద్వారా పశుగణాభివృద్ధిలో పురోగతి సాధించాలనే లక్ష్యంతో 2005 లో నాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. అత్యుత్తమ ప్రమాణాలతో వెటర్నరీ కోర్సులను అందించడంతో పాటు పరిశోధన ఫలితాలను, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం.. పశుగణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం.. డెయిరీ టెక్నాలజీ, ఫిషరీ రంగాన్ని అభివృద్ధి చేయడం.. శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ప్రధాన లక్ష్యాలు. ఆ లక్ష్య సాధనలో ఆశాజనకంగా ముందుకు సాగుతున్నాం. దాంతోపాటు పశుసంవర్థ్ధక శాఖ క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం.


 
 పాలిటెక్నిక్ వెటర్నరీలో ప్రవేశానికి అర్హతలేమిటి? ఈ కోర్సును అందిస్తున్న కళాశాలలేవి?
 శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 10 యానిమల్ హజ్బెండరీ పాలిటెక్నిక్ కాలేజీలు; ఒక ఫిషరీ పాలిటెక్నిక్ ఉన్నాయి. యానిమల్ హజ్బెండరీ పాలిటెక్నిక్ కాలేజీల్లో.. ఒక్కోదానిలో 20 చొప్పున మొత్తం 200 సీట్లు ఉన్నాయి. డిప్లొమా ఇన్ యానిమల్ హజ్బెండరీ కోర్సులో చేరడానికి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కుల ప్రాతిపదికన ప్రవేశం కల్పిస్తారు. కోర్సు కాలవ్యవధి రెండు సంవత్సరాలు. కోర్సులో భాగంగా విద్యార్థులకు సబ్జెక్టు థియరీతోపాటు ప్రాక్టికల్ పరిజ్ఞానం కూడా కల్పిస్తారు. విద్యార్థులను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి అవగాహన కల్పిస్తాం.


 
 
 ఫిషరీ పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్ని సీట్లున్నాయి? అర్హతలు, ప్రవేశ ప్రక్రియ వివరాలు తెలపండి? వీటి సంఖ్యను పెంచే అవకాశం ఉందా?
 కృష్ణా జిల్లాలోని భావదేవరపల్లిలో మాత్రమే ఫిషరీ సైన్స్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇందులో 30 సీట్లు ఉన్నాయి. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థుల నుంచి డిమాండ్ పెరిగితే సీట్ల సంఖ్యను పెంచుతాం.


 
 
 వెటర్నరీ, ఫిషరీ సైన్స్‌లో డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?
 పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ కోర్సులు చేసేందుకు అవకాశముంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలను దక్కించుకోవచ్చు. ఫిషరీ సైన్స్‌లో పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆక్వారంగంలో, ప్రైవేట్ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
 


 
 బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ (బీవీఎస్సీ) కోర్సును అందించే కళాశాలలు ఎన్ని ఉన్నాయి? ఈ కోర్సులో ప్రవేశానికి అర్హతలు ఏమిటి?
 మన రాష్ట్రంలో తిరుపతి, రాజేంద్రనగర్ (హైదరాబాద్), గన్నవరం (కృష్ణా జిల్లా), ప్రొద్దుటూరు (వైఎస్‌ఆర్ జిల్లా), కోరుట్ల (కరీంనగర్ జిల్లా)లో వెటర్నరీ కళాశాలలున్నాయి. వీటిలో తిరుపతి, రాజేంద్రనగర్, గన్నవరం వెటర్నరీ కళాశాలల్లో ఒక్కోదాంట్లో 60 చొప్పున మొత్తం 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రొద్దుటూరు, కోరుట్లలోని కళాశాలల్లో సుమారు 30 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా అదనంగా 30 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఎన్‌ఆర్‌ఐ కోటాలో ఒక్కొక్క కళాశాలకు 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా బీవీఎస్సీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
 
 
 బీవీఎస్సీ కోర్సులు పూర్తిచేసిన వారికి ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా అవకాశాలు ఏమిటి?

 బీవీఎస్సీ పూర్తిచేసి ఉద్యోగం లభించక ఖాళీగా ఉండే పరిస్థితి ఎంతమాత్రం లేదని చెప్పొచ్చు. బీవీఎస్సీ పూర్తిచేసిన వారికి వెంటనే పశుసంవర్థ్ధక శాఖలో ఉద్యోగం లభిస్తుంది. ఉన్నత విద్యాపరంగా చూస్తే.. ఎంవీఎస్సీ, పీహెచ్‌డీ కోర్సులు చేయవచ్చు.
 
 


 బ్యాచిలర్ స్థాయిలో ఎన్ని ఫిషరీ కళాశాలలు ఉన్నాయి. ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు ఎలా ఉన్నాయి?
 నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరులోని ఫిషరీ సైన్స్ కళాశాల మాత్రమే బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ కోర్సును అందిస్తుంది. ఇందులో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. డిమాండ్‌ను బట్టి సీట్ల సంఖ్య పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఫిషరీ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు మత్స్య శాఖలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే ప్రైవేటు కంపెనీల్లో కూడా అవకాశాలను దక్కించుకోవచ్చు. ఆసక్తి ఉంటే సంబంధిత విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయొచ్చు.
 
 


 బీటెక్ డెయిరీ టెక్నాలజీ కోర్సు, కళాశాలల వివరాలు తెలపండి?
 బీటెక్ డెయిరీ టెక్నాలజీ కోర్సును తిరుపతి, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని డెయిరీ టెక్నాలజీ కళాశాలలు అందిస్తున్నాయి. ఒక్కో కళాశాలలో సుమారు 30 సీట్ల చొప్పున మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్ (ఎంపీసీ) ర్యాంక్ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
 


 
డెయిరీ, వెటర్నరీ, ఫిషరీలో పీజీ కోర్సులకు సంబంధించి ప్రవేశ ప్రక్రియ వివరాలు తెలపండి?
 వెటర్నరీకి సంబంధించి పీజీ కోర్సు.. ఎంవీఎస్సీని తిరుపతి, రాజేంద్రనగర్, గన్నవరంలోని వెటర్నరీ కళాశాలలు అందిస్తున్నాయి. ఈ మూడు కళాశాలల్లో కలిపి 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఆయా కాలేజీల్లో అడ్మిషన్ కల్పిస్తారు. అలాగే ఫిషరీ సైన్స్‌లో పీజీ కోర్సును ముత్తుకూరు (నెల్లూరు జిల్లా)లోని ఫిషరీ కళాశాల అందిస్తుంది. ఈ కోర్సుకు సంబంధించి 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు.


 
 యూనివర్సిటీ పరిధిలో ఎన్ని పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి? వీటి స్థాపన ప్రధాన ఉద్దేశం ఏమిటి?
 తెలంగాణ ప్రాంతంలో నాలుగు, సీమాంధ్రలో తొమ్మిది పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. పరిశోధనలు నిర్వహించడం, అరుదైన పశు జాతులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవడం వీటి ప్రధాన ఉద్దేశం.
 


 
 ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని వెటర్నరీ కళాశాలలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) గుర్తింపు ఉందా? కళాశాలల సంఖ్యను పెంచే అవకాశం ఉందా?
 ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని వెటర్నరీ కళాశాలలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) గుర్తింపు లభించింది. ప్రస్తుతానికి కళాశాలల సంఖ్య పెంచే ఆలోచన లేదు.
 


 
పశు సంపదకు సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? వాటి ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు?
 తెలంగాణలో ఒకటి, సీమాంధ్రలో ఒకటి కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. రైతులకు పశుపోషణలో శిక్షణ ఇవ్వడం, కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని పశుపోషణపై అవగాహన కల్పించడం వీటి ప్రధాన లక్ష్యాలు.
 
 


 వెటర్నరీ సైన్స్, ఫిషరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నారా? ఏ సంస్థలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి?
 వెటర్నరీ విద్యార్థులకు కోర్సు పూర్తికాగానే ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. గెజిటెడ్ హోదాలో ఉద్యోగంలో చేరుతున్నారు. అలాగే ఫిషరీసైన్స్, డెయిరీ టెక్నాలజీ విద్యార్థులకు కూడా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్లు నిర్వహించడంలేదు. కొన్ని బ్యాంక్‌లు, ఇతర సంస్థలు సంబంధిత క్యాంపస్‌లను సందర్శించి తమకు కావాల్సిన విద్యార్థులను నియమించుకుంటున్నాయి.
 
 
 ప్రపంచంలో మన దేశం పాల ఉత్పత్తిలో, పశుసంపదలో అగ్రస్థానంలో ఉంది. ఈ స్థానాన్ని నిలుపుకునే క్రమంలో ఒంగోలు జాతి, ముర్రా జాతి గేదెలు మొదలైన వాటి సంరక్షణ కు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
 ఒంగోలు, ముర్రా జాతి పశు సంపదలు నశించి పోకుండా నాలుగు కేంద్రాల్లో ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టాం. గుంటూరు జిల్లాలోని లాంఫాం, పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి, ప్రకాశం జిల్లా చదలవాడ, కర్నూలు జిల్లాలోని మహానందిలో ఒంగోలు జాతి పశువుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆ జాతి నశించకుండా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే వెంకటరామన్నగూడెంలో ముర్రాజాతి పశువుల సంరక్షణకు సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పాం. పుంగనూరు జాతి పశువులు అంతరించకుండా.. పుంగనూరులో ఫాం ఏర్పాటుచేసి వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం.
 
 
 విదేశీ విశ్వవిద్యాలయాలు ఆయా ప్రాంతాల్లో అంతరించిపోతున్న పశుజాతుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. వెటర్నరీ యూనివర్సిటీ ఇలాంటి కార్యక్రమాలను చేపడుతుందా?

 రాష్ట్ర పశుసంవర్థక శాఖ సహాయంతో కృత్రిమ గర్భధారణ పద్ధతులను చేపడుతున్నాం. తద్వారా అరుదైన ఒంగోలు, పుంగనూరు జాతి పశువుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం.
 
 
 ఇప్పటికీ మనదేశంలో ఎక్కువ మంది పశుపోషణ అంటే కోళ్లు, మేకలు, గొర్రెలు, కుందేళ్లు, గిన్నెకోళ్లు, ఆవులు, ఎద్దులు, గేదెలు, పందులు, చేపలు, రొయ్యల పెంపకంపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
 పశుజాతి అభివృద్ధి కోసం వాటికి ఎటువంటి ఆహారం ఇవ్వాలి? అనే విషయంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విశ్వవిద్యాలయ విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా పశుపోషణపై రైతులకు శిక్షణ ఇస్తున్నాం.
 

 -ప్రొఫెసర్ పి.సుధాకర్ రెడ్డి,
 రిజిస్ట్రార్, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ.

 
 ప్రపంచంలోనే అత్యధిక పశు సంపద కలిగిన దేశంగా భారత్ గుర్తింపు సాధించింది. ప్రపంచ పశు జనాభాలో భారత్ వాటా 15 శాతం. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పశు పరిశ్రమ వాటా ఎనిమిది శాతం.
 
దేశంలో వెటర్నరీ కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు: ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఆర్‌ఐ)- ఇజత్‌నగర్; సీసీఎస్ హర్యానా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (హిసార్); బాంబే వెటర్నరీ సైన్స్ కాలేజ్ (ముంబై); ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ఆనంద్).
 
 బీవీఎస్సీ పూర్తిచేసి ఉద్యోగం లభించక ఖాళీగా ఉండే పరిస్థితి ఎంతమాత్రం లేదని చెప్పొచ్చు. ఇటు ప్రభుత్వ, అటు ైప్రైవేటు రంగంలోనూ మెరుగైన అవకాశాలుంటాయి. ఉన్నత విద్యాపరంగా చూస్తే.. ఎంవీఎస్సీ, పీహెచ్‌డీ కోర్సులు చేయవచ్చు.
 
 బి.హరిమల్లికార్జున రెడ్డి,
 న్యూస్‌లైన్, యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి)

>
మరిన్ని వార్తలు