జేఈఈ మెయిన్ - 2014 టాపర్ల మనోగతాలు

7 May, 2014 23:45 IST|Sakshi
జేఈఈ మెయిన్ - 2014 టాపర్ల మనోగతాలు

 ఐఐటీ-ముంబైలో సీఎస్‌ఈ లక్ష్యం  సోదరి స్ఫూర్తి.. అమ్మానాన్న తోడ్పాటు..  ఐఐటీ లక్ష్యంగా నిరంతర కృషి.. వెరసి జేఈఈ
 మెయిన్‌లో 355 మార్కులతో జాతీయ స్థాయిలో  ప్రథమ స్థానం. ‘ఫలితం గురించి ఆలోచిస్తూ..  ఆందోళన చెందకుండా.. సబ్జెక్టుల్లో పట్టు  సాధించేందుకు కృషిచేస్తే విజయం తథ్యం’ అంటు న్నాడు వాకచర్ల ప్రమోద్. ఆయన సక్సెస్ స్పీక్స్..
 
 ఆరో తరగతి నుంచే ఐఐటీ లక్ష్యంగా..ఉన్నత విద్యా సంస్థలో సైన్స్ సంబంధిత కోర్సులు చేయాలన్న ఆశయం..ఇందుకు సరైన మార్గం ఐఐటీ అని కుటుంబ సభ్యుల నుంచి లభించిన తోడ్పాటుతోనే  జేఈఈ-మెయిన్‌లో జాతీయ స్థాయిలో టాప్-2లో నిలిచానంటున్న మహమ్మద్ అక్రమ్ ఖాన్ సక్సెస్ స్పీక్స్...
 
 జేఈఈ మెయిన్ జాతీయ స్థాయి టాపర్ (355 మార్కులు)
 స్వస్థలం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు అక్కడే విద్యాభ్యాసం. నేను ఐఐటీలో చదవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకునేలా చేసినవారు సోదరి హర్షిత. ఆమె ఐఐటీలో సీటు లభిస్తే కలిగే ప్రయోజనాల గురించి చెప్పారు. అమ్మానాన్న భగవాన్, జయశ్రీలు కూడా నేను లక్ష్యం దిశగా పయనించేలా ప్రోత్సహించారు. దాంతో ‘కచ్చితంగా ఐఐటీలో సీటు సాధించాలి’ అనే లక్ష్యం మదిలో నిలిచింది. దానికి అనుగుణంగా తొలి అడుగువేస్తూ గుడివాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9, 10 తరగతులు చదివాను. అక్కడ ఐఐటీ కాన్సెప్ట్ ఓరియెంటేషన్‌తో సాగిన బోధన ఎంతో ఉపయోగపడింది. జేఈఈ మెయిన్ పరీక్ష ప్రిపరేషన్‌కు బలమైన పునాది లభించింది.
 
 ఇంటర్‌తోపాటు.. జేఈఈ లక్ష్యంగా:
 ఇంటర్మీడియెట్‌లోనూ ఐఐటీ ఇంటెన్సివ్ బ్యాచ్‌లో చేరడం ఎంతో లాభించింది. అంతేకాకుండా ఇంటర్మీడియెట్‌లో మా బ్యాచ్ నుంచి కొత్త సిలబస్ తీసుకురావడం.. అది ఎన్‌సీఈఆర్‌టీ, సీబీఎస్‌ఈ సిలబస్‌లకు అనుగుణంగా ఉండటంతో.. ఒకేసమయంలో ఇంటర్మీడియెట్, జేఈఈ పరీక్షకు సన్నద్ధం కావడం సులువైంది.
 
 ప్రిపరేషన్ సరళి:
 ఇంటర్మీడియెట్, జేఈఈ రెండు పరీక్షల సిలబస్ ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ పరీక్ష విధానంలో రెండింటికీ తేడా ఉంటుంది. జేఈఈలో కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ. కాబట్టి ఇంటర్మీడియెట్ పాఠ్యాంశాలను చదివేటప్పుడే జేఈఈ కోణంలో కాన్సెప్ట్, అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించాను. తరగతిగదిలో శ్రద్ధతో పాఠాలు వింటే 50 శాతం అంశాలు మెదడులో నిక్షిప్తమవుతాయి. ఫలితంగా స్వీయ సన్నద్ధత సమయంలో అప్పటికే క్లాస్‌రూంలో నేర్చుకున్న అంశాలపై ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం కేటాయించడానికి వీలవుతుంది. ఇదే ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాను. తొలుత మ్యాథమెటిక్స్ చాలా కష్టంగా ఉండేది. కానీ మెంటార్స్ సహకారంతో ఆ సమస్యను అధిగమించాను.
 
 చివరి దశ.. ప్రతి రోజు పది గంటలు:
 జేఈఈ-మెయిన్ పరీక్ష తేదీకి మూడు నెలల ముందు నుంచి రోజుకు పది గంటలు ప్రిపరేషన్ సాగించాను. ప్రతిరోజు ప్రణాళికా బద్ధంగా కెమిస్ట్రీకి నాలుగు గంటలు, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లకు మూడు గంటలు చొప్పున కేటాయించేలా టైం మేనేజ్‌మెంట్ పాటించాను. అంతేకాకుండా కళాశాలలో నిరంతరం నిర్వహించే ప్రాక్టీస్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు కూడా ఉపకరించాయి.
 
 అడ్వాన్స్‌డ్‌పైనే దృష్టి:
 లక్ష్యం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీటు. కాబట్టి అందుకు నిర్వహించే అడ్వాన్స్‌డ్‌పైనే ఇప్పుడు దృష్టంతా. ఈ పరీక్షకు నిర్దేశించిన సిలబస్‌ను ఇప్పటికే పూర్తి చేశాను. మొదట్నుంచీ కొంచెం కష్టంగా భావించే మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను. కచ్చితంగా అడ్వాన్స్‌డ్‌లోనూ విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది.
 
 కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రాధాన్యం:
 అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు ఆధారంగా ఐఐటీ-ముంబైలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో చేరడమే తొలి ప్రాధాన్యం. ఆ తర్వాత విదేశాల్లో రీసెర్చ్ కోర్సులు అభ్యసించడం అకడెమిక్ లక్ష్యాలు. ఇక కెరీర్ పరంగా భవిష్యత్తులో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిశగా అడుగులు వేసి, సొంతంగా సంస్థను నెలకొల్పాలని ఉంది.
 
 ఆందోళన అనవసరం:
 జేఈఈ ఔత్సాహిక విద్యార్థులు.. పరీక్ష గురించి ఆందోళన చెందక్కర్లేదు. ముఖ్యంగా ఇప్పటి ఇంటర్మీడియెట్ సిలబస్ ప్రకారం- జేఈఈని జయించడం సులభమే. క్లాస్‌రూంలో పాఠాలు వినే సమయంలో ఫోకస్డ్‌గా ఉండాలి. సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. లేదంటే చివరి నిమిషంలో ఒత్తిడికి గురవుతాం. జేఈఈ పరీక్ష విధానానికి అనుగుణంగా ప్రాక్టీస్ చేయాలి. రెండేళ్లపాటు ప్రిపరేషన్ కోసం శ్రమించిన దానికంటే పరీక్ష జరిగే మూడు గంటల సమయంలో చూపించిన ప్రతిభ కీలకం. పరీక్ష సమయంలో ఫలితం గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందకుండా అన్ని అంశాలకు సమాధానాలిచ్చేలా అకడెమిక్‌గా, మానసికంగా సన్నద్ధత పొందితే విజయం ఖాయం.
 
 జేఈఈ మెయిన్ జాతీయ స్థాయి రెండో స్థానం (350 మార్కులు)
 మాది ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట. నాన్న ఉద్యోగ రీత్యా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో స్థిరపడ్డాం. నాన్న  ఎజాజుల్లా ఖాన్ కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌లో సివిల్ ఇంజనీర్. దీంతో చిన్నప్పటి నుంచి ఇంట్లో అకడెమిక్ సపోర్ట్ బాగుండేది. మా సోదరి కూడా ప్రస్తుతం బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. వాస్తవానికి నాలోని ఆసక్తిని గమనించి ఐఐటీని లక్ష్యంగా చేసుకోవాలంటూ ఆమె ప్రోత్సహించింది. దీనికి అనుగుణంగా ఆరో తరగతి నుంచే ఐఐటీ లక్ష్యంగా అడుగులు వేశాను. 8 నుంచి పదో తరగతి వరకు హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌లో చదివాను. అక్కడ ఐఐటీ ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ వల్ల కచ్చితంగా ఐఐటీలో సీటు పొందాలి అనే లక్ష్యం బలపడింది.జేఈఈ మెయిన్ పరీక్ష రాశాక మంచి మార్కులు వస్తాయని భావించాను. కానీ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలుస్తానని ఊహించలేదు. ఇప్పుడు అడ్వాన్స్‌డ్‌లో మంచి మార్కులు సాధించడంపైనే దృష్టి సారించాను.
 
 కలిసొచ్చిన ఉమ్మడి పాఠ్యాంశాలు:
 పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్‌లో ఐఐటీ ఇంటెన్సివ్ బ్యాచ్‌లో చేరాను. జేఈఈ సిలబస్, ఇంటర్మీడియెట్ సిలబస్ ఒకే మాదిరిగా ఉండటం.. అత్యధిక శాతం అంశాలు ఉమ్మడిగా ఉండటం జేఈఈ ప్రిపరేషన్‌కు ఎంతో లాభించాయి. ఫలితంగా ఇంటర్మీడియెట్ బోర్డ్ పరీక్షలకు, జేఈఈకు సమాంతరంగా ప్రిపరేషన్ సాగించడం సులువైంది.
 
 ప్రతి రోజు పది గంటలు :
 ఇంటర్మీడియెట్‌లో చేరిన తొలిరోజు నుంచే బోర్డ్ పరీక్షలు, జేఈఈ లక్ష్యంగా ప్రిపరేషన్ సాగించాను. ప్రతిరోజు సగటున పది గంటలు చొప్పున కేటాయించాను. కెమిస్ట్రీకి కచ్చితంగా ఐదు గంటలు కేటాయించాను. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ విషయంలో ఆయా సందర్భాలు, పాఠ్యాంశాలు వాటిలో పరిజ్ఞానం ఆధారంగా సమయాన్ని సర్దుబాటు చేసుకున్నాను. కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీ విభాగం క్లిష్టంగా ఉండేది. అందువల్ల ఈ సబ్జెక్ట్‌కు ఎక్కువ సమయం కేటాయించి ఆ సమస్యను అధిగమించాను.
 
 అనుకూలించే సెల్ఫ్ స్టడీ మెటీరియల్:
 జేఈఈ ప్రిపరేషన్ విషయంలో సెల్ఫ్‌స్టడీ మెటీరియల్ ఎంతగానో అనుకూలిస్తుంది. నేర్చుకున్న అంశాలకు సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లతో సొంత నోట్స్ తయారు చేసుకుంటే.. రివిజన్ సమయంలో బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా సమయం ఆదా అవుతుంది. నేను ఇదే ఫార్ములాను అనుసరించి ప్రిపరేషన్ సాగించాను. జేఈఈలో విజయానికి సమయపాలన ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రిపరేషన్ వ్యూహాలు అనుసరించాలి. అప్పుడే విజయం దిశగా అడుగులు పడతాయి.
 
 కెమిస్ట్రీపై ఫోకస్‌తో అడ్వాన్స్‌డ్‌కు:
 మరికొద్ది రోజుల్లో జరగనున్న అడ్వాన్స్‌డ్‌లో విజయానికి కెమిస్ట్రీపై ఫోకస్డ్ ప్రిపరేషన్ సాగిస్తున్నాను. ఇప్పటికీ కెమిస్ట్రీ అంటే కొంచెం క్లిష్టంగా భావిస్తున్నాను. ఆ భయాన్ని ప్రిపరేషన్ సమయంలో మదిలో మెదలకుండా జాగ్రత్త పడుతున్నాను. మెయిన్ విషయంలోనూ ఇలానే సాగాను. ఆ భయం ప్రిపరేషన్ సమయంలోనూ వీడకపోతే ఫలితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
 
 ఐఐటీ-ముంబైలో సీఎస్‌ఈలో:
 అడ్వాన్స్‌డ్‌లో మంచి మార్కులు సాధించి తద్వారా ఐఐటీ-ముంబైలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సీటు పొందడమే ప్రస్తుత లక్ష్యం. ఆ తర్వాత ఉన్నత విద్య పరంగా మేనేజ్‌మెంట్ పీజీ చేయాలని ఉంది. భవిష్యత్తులో కొద్ది రోజులు ఉద్యోగ అనుభవం గడించాక సొంతగా ఏదైనా సంస్థను నెలకొల్పడం ప్రధాన లక్ష్యం.
 
 ‘ముందు’ చూపుతో:
 జేఈఈ ఔత్సాహిక విద్యార్థులు ముందు నుంచే లక్ష్యంపై గురి పెట్టి ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్ సాగించాలి. సిలబస్‌ను పరిశీలించి వాటిలో తమకు అనుకూలమైన, ప్రతికూలమైన అంశాలను గుర్తించి కష్టంగా భావించే అంశాలను ముందుగా పూర్తి చేసుకోవాలి. ఫలితంగా లాస్ట్ మినిట్ టెన్షన్ నుంచి తప్పించుకోవచ్చు. తరగతిగదిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ.. అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా ప్రిపరేషన్ సాగిస్తే జేఈఈ సక్సెస్ సాధ్యమే.
 
   అకడెమిక్ ప్రొఫైల్
     2012లో పదో తరగతిలో 9.7 జీపీఏతో ఉత్తీర్ణత.
     2014లో ఇంటర్మీడియెట్‌లో 977 మార్కులతో ఉత్తీర్ణత.

 ఇతర విజయాలు:
     ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఏఎంటీఐలో విజయం.
     పదో తరగతిలో ఉన్నప్పుడు సౌత్ ఇండియా మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో విజయం.
     ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజనకు ఎంపిక.
 

>
మరిన్ని వార్తలు