రుతు రాగంలో అపశృతి... ఎల్‌నినో

29 May, 2014 02:14 IST|Sakshi
రుతు రాగంలో అపశృతి... ఎల్‌నినో

ఎల్‌నినో అంటే:
 ఎల్‌నినోకు స్పానిష్ భాషలో అర్థం..లిటిల్‌బాయ్. దక్షిణ అమెరికా పశ్చిమ తీరాన (పెరూ, ఈక్వెడార్) వందల ఏళ్ల క్రితం జాలర్లు తొలిసారిగా ఎల్‌నినోను గుర్తించారు. దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు ఉన్నట్లుండి అసాధారణంగా పెరగడాన్ని ఎల్‌నినో అంటారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరుగుతుంది. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో వేడి సముద్ర గాలులు తూర్పు, మధ్య పసిఫిక్ నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు పశ్చిమ దిశగా వీస్తాయి. ఎల్‌నినో సమయంలో తూర్పు, మధ్య పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో అసాధారణంగా సముద్ర ఉపరితలం వేడెక్కుతుంది. ఫలితంగా పెరూ, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో విపరీత వర్షపాతం నమోదవుతుంది. దీని పర్యవసానంగా పశ్చిమ పసిఫిక్ ప్రాంతమంతా చల్లగా ఉంటూ.. భారత్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో రుతుపవనాలు బలహీన పడి వర్షపాతం తగ్గుతుంది.
 
 భారత సేద్యానికి గొడ్డలిపెట్టు:
 భారత వ్యవసాయరంగాన్ని స్వల్ప నుంచి తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసే అంశాల్లో ఒకటి ఎల్‌నినో. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావాన్ని చవిచూసే అవకాశం ఉందని ఇప్పటికే భారత్‌తో పాటు ఇతర దేశాల వాతావరణ విభాగాలు నిర్ధారించాయి. జూన్-ఆగస్ట్ మధ్య కాలంలో సంభవించే ఎల్‌నినో ద్వారా నైరుతి రుతుపవనాలు ప్రభావితమై అల్ప వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకతకు విఘాతం వాటిల్లనుంది. అదే జరిగితే అన్నదాతలను ఆదుకునేలా కనీస మద్దతు ధరలను ప్రభుత్వం పెంచాల్సి ఉంటుంది. వరి, చక్కెర, కూరగాయలు, ఫలాల ధరలు పెరుగుతాయి. ఈ పరిణామాలు రూపాయి విలువను తగ్గించి ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలవుతాయి.
 
 ఎల్‌నినో సాధారణంగా 3 నుంచి 7 ఏళ్లకోసారి సంభవిస్తుంది. భారత్‌పై నైరుతి రుతుపవనాల కాలంలో దీని ప్రభావం ద్వారా పంటల దిగుబడి దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. 2001-2010 ఖరీఫ్ కాలంలో 2002, 2007, 2009లో ఎల్‌నినో దాపురించడంతో వర్షపాతం వరుసగా 19 శాతం, 13 శాతం, 23 శాతం మేరకు తగ్గింది. భారత వాతావరణ విభాగం (ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్‌మెంట్) ప్రకారం ఈ ఏడాది ఎల్‌నినో సంభవిస్తే వర్షపాతం సుమారు 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఐ.ఎమ్.డి ప్రకారం ఈ ఏడాది ఆగస్ట్-సెప్టెంబర్ మధ్య కాలంలో ఎల్‌నినో ప్రభావం ఉంటుంది.
 
 ఆస్ట్రేలియా బ్యూరో వాతావరణ విభాగం ప్రకారం ఇది జూలైలో అభివృద్ధి చెందనుంది. ఎల్‌నినో ప్రభావం కనిపించిన గత పరిణామాలను పరికిస్తే... 2002, 2004, 2009లో పప్పు దినుసుల దిగుబడి వరుసగా 14,23,27 శాతం మేర క్షీణించింది. అదే విధంగా వాణిజ్య పంటైన చెరకుతోపాటు సజ్జలు, మొక్కజొన్న, రాగి పంటల దిగుబడి కూడా తగ్గింది. ఖరీఫ్ సేద్యానికి నైరుతి రుతుపవనాల వర్షపాతమే ప్రధాన ఆధారం. ఇక వర్షాదార ప్రాంతాలకైతే వేరే చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఏ విధమైన సేద్యపు నీటి సదుపాయాలు ఉండవు. ఈ ప్రాంతాల్లో పప్పు దినుసుల సాగు అధికం. జూలై-
 
 సెప్టెంబర్ కాలంలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆగ స్ట్‌లో వర్షపాతం తగ్గితే..వీటి దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. ఐఎమ్‌డీ అంచనా ప్రకారం ఆగస్ట్‌లో ఎల్‌నినో ప్రభావం ఉండనుంది. అంటే ప్రధాన ఆహార ధాన్యాలతోపాటు పప్పు దినుసుల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావం ద్వారా భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఇదివరకే ఎల్‌నినో సంభవించిన సంవత్సరాల్లో దేశ జీడీపీ కూడా తగ్గింది. ప్రస్తుతం దేశ జనాభాలో 68.9 శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు.
 
  దేశ వ్యవసాయ భూ విస్తీర్ణత 56 శాతంలో వర్షాధార వ్యవసాయం కొనసాగుతోంది. కాబట్టి వ్యవసాయరంగ క్షీణత అధిక జనాభాపై ప్రభావాన్ని చూపుతుంది. ఎల్‌నినో ద్వారా వ్యవసాయ ఆదాయం తిరోగమిస్తే అది అనేక రంగాలపై దుష్ర్పభావం చూపుతుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజల కొనుగోలు సామర్థ్యం కుంటుపడుతుంది. ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్ రంగాలపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. నిత్యావసర ధరలు పెరిగి దేశ ద్రవ్యోల్బణం రేటు కూడా పెరుగుతుంది. వ డ్డీ రేట్లు పెరిగి చివరకు పారిశ్రామిక ఉత్పత్తికి విఘాతం వాటిల్లుతుంది. మూడు నుంచి ఏడేళ్లకోసారి సంభవించే ఎల్‌నినోలతోనే ఇంతటి విపత్కర పరిణామాలు దాపురిస్తే  ఏటా పునరావృతమైతే ఆ నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది.
 
 ఏడింటిలో రెండు మాత్రమే:
 1991 నుంచి ఇప్పటిదాకా 7 ఎల్‌నినో ప్రభావాలు సంభవించాయి. అయితే ఈ ఏడింటిలో కేవలం రెండు మాత్రమే తీవ్ర కరువు పరిస్థితులకు దారితీశాయి. 1994లో తలెత్తిన ఎల్‌నినో ధాటికి రుతుపవనాల ద్వారా 10 శాతం అధికంగానే వర్షపాతం నమోదైంది. అయితే ఈసారి వచ్చే ఎల్‌నినో ద్వారా రుతుపవనాలు 30 శాతం మేరకు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని క్రిసిల్ భావిస్తోంది.
 
 మూలాలెక్కడ?
 ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఈ అసాధారణ  వాతావరణ సంఘటన దాదాపు ప్రపంచంలోని అనేక దేశాలపై ఏదో ఒక రూపంలో కష్టనష్టాలకు గురిచేస్తోంది. అమెరికా తీర ప్రాంతంలో వరద లు ముంచెత్తితే, భారత్‌లో రుతుపవనాలకు విఘాతం కలిగిస్తూ కరువు కాటకాలకు కారణ భూతమవుతోంది. ఎల్‌నినోపై ఇప్పటికే పలు అధ్యయనాలు జరుగుతున్నప్పటికీ దాని మూలాలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలు ఇంకా పూర్తి స్థాయిలో సఫలీకృతులు కాలేకపోతున్నారు. అమెరికా దీనిపై  సమగ్ర అధ్యయనాలను నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా కావాల్సినంత సమాచారం అందుబాటులోకి రాలేదు. భూతాపం (గ్లోబల్ వార్మింగ్) ఈ ఎల్‌నినోకు కారణమా? లేదా? భూతాపం ద్వారా ఎల్‌నినో తీవ్రత పెరుగుతుందా? అనే విషయంలో స్పష్టతకు రాలేదు.
 
 భిన్నాభిప్రాయాలు:
 ఎల్‌నినో ప్రభావంపై వాతావరణ శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎమ్‌డీ అంచనాల ప్రకారం ప్రతికూలత కొంత మాత్రమే ఉండొచ్చని 96 శాతం వర్షాలు కురుస్తాయని చెబుతుండగా.. అమెరికా వాతావరణ శాస్త్రవేత్తలు మాత్రం 1997-1998 నాటి తీవ్ర ఎల్‌నినో ఈసారి సంభవించనుందని అంచనావేస్తున్నారు. ఇలా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉంటుందని అన్ని ప్రధాన వాతావరణ విభాగాలు నిర్ధారించినప్పటికీ అది ఏ స్థాయిలో ఉంటుందనే విషయమై ఏకాభిప్రాయం కనిపించడం లేదు.
 
 నైరుతి గతికి ఇవే ప్రామాణికాలు:

 మన దేశంపై నైరుతి రుతుపవనాల ప్రభావం ఏవిధంగా ఉంటుందనే విషయంలో నిపుణులు ప్రధానంగా  ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
 1.    ఫిబ్రవరి, మార్చి నెలలో దక్షిణ హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు
 2.    ఫిబ్రవరి, మార్చి నెలలో తూర్పు ఆసియా దేశాల్లో నమోదైన వాతావరణ పీడనాలు .
 3.    జనవరిలోని వాయవ్య ఐరోపాలోని భూఉపరితల ఉష్ణోగ్రతలు
 4.    ఫిబ్రవరి,మార్చిలలో పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రతలు
 వీటి ఆధారంగా నైరుతి రుతుపవనాల గమనం ఎలా ఉంటుందో అంచనా వేస్తారు.
 
 ఇప్పటి వరకు అనుకూలం:
 ఈ ఏడాది అనుకున్నదానికంటే రెండు రోజుల ముందుగానే  మే 18 నాటికే భారత ఉపఖండంలో నైరుతి జల్లులు ప్రవేశించాయి. వాటికి అనుకూలంగానే ప్రస్తుతం బంగాళాఖాతంలో విస్తరించడానికి సానుకూల వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతమంతటా విస్తరించిన తర్వాత అరేబియా సముద్రం మీదుగా నైరుతి కేరళ తీరాన్ని తాకుతుంది. వాస్తవానికి అన్ని వాతావరణ పరిస్థితులను అంచనావేస్తే భారత్ వాతావరణ శాఖ ఎల్‌నినో ప్రభావం ఉందని అంచనా వేసింది. కానీ దాని ప్రభావం ఉండుంటే  రుతు పవనాల ఆగమనం మరింత ఆలస్యమయ్యేది.
 
 ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే...రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనికి శుభశకునంగానే తూర్పు, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని, తద్వారా రుతుపవనాల విస్తరణకు తోడ్పడుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.రుతుపవనాల విషయానికి వస్తే ఈ గాలులు దేశమంతా విస్తరించిన తర్వాతే నైరుతి ద్రోణి ఏర్పడుతుంది. ఈద్రోణికి సముద్రంలో ఏర్పడే అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, వాయుగుండాలు, తీవ్రవాయుగుండాలు తోడైతే దేశమంతా మంచివానలే కురుస్తాయి. వీటి ద్వారా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశమంతా చిరుజల్లులనుంచి భారీవర్షాల వరకు పలు దఫాలుగా కురిసే అవకాశముంది.
 
 మన రాష్ట్రానికి వస్తే:
 మన రాష్ట్రంలో జూన్-సెప్టెంబర్ మధ్య నైరుతి ప్రభావం అధికంగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు, కోస్తా, రాయలసీమల్లో ఈశాన్య రుతుపవనాలు అధికంగా ప్రభావం చూపుతాయి. గడచిన ఐదేళ్ల వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది అంత ఎక్కువగా ఉండకపోవచ్చని నిపుణుల అంచనా. అయితే మధ్యలో వచ్చే అల్పపీడనాలు, వానలు, రుతుపవనాల ఉపసంహరణతో వచ్చే వర్షపాతాలు, ఆ లోటును పూడుస్తాయని మొత్తంగా చూస్తే ఈ ఏడాది మంచి వానలే కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  
 
 పేరుకే పరిరక్షణ:
 పర్యావరణ దినోత్సవం... క్యోటో ప్రోటోకాల్... జీవ వైవిధ్య సదస్సు... ఓజోన్ పరిరక్షణ దినం... ఇలా నెలకోమారు ఏదో రూపంలో మన పర్యావరణాన్ని కాపాడేందుకు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా సదస్సులు, చర్చాగోష్ఠులు, మేధోమథనం లాంటివి చేపడుతున్నా మరోవైపు జరగరాని నష్టం జరుగుతూనే ఉంది. ఈ సదస్సులు చేపట్టిన నాటి నుంచి కనీసం వైపరీత్యాల పరంపరకు అడ్డుకట్ట పడడం లేదు సరికదా నష్టాల తీవ్రత రేటు పెరిగి పోతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు పెచ్చరిల్లుతున్నాయి. పర్యావరణానికి ఎనలేని విఘాతం కలిగిస్తున్నాయి. వీటిని నిషేధించాలని వేదికలపై గొంతెత్తి చాటుతున్న ఏలికలు తమ పరిపాలనలో అమలు చేయడంలో మాత్రం ఘోర వైఫల్యం మూటగట్టుకుంటున్నారు. ప్లాస్టిక్ నిషేధం విషయంలో జపాన్, సింగపూర్ లాంటి చిన్న దేశాలను చూసి మనదేశం నేటికీ గుణపాఠం నేర్వలేకపోవడం విచారకరం.
 
 మన కృషి ఎంత?
 భారత్‌లో కూడా ఈ ఎల్‌నినో అంశంపై పూర్తి స్థాయిలో పరిశోధనలను నిర్వహించాలి. ప్రపంచ జల వలయంపై ప్రభావాన్ని చూపగల ఎల్‌నినోను తేలిగ్గా తీసుకోవడం భవిష్యత్  ఆహార భద్రతకు ముప్పుగా పరిణమిస్తుంది.దారిద్య్ర రేఖకు దిగువనున్న జనాభాకు నిరంతర ఆహారభద్రతను కల్పించాలంటే అది వ్యవసాయ దిగుబడులను పెంచడం ద్వారానే సాధ్యమవుతుంది. వరుసగా సంభవించే ఎల్‌నినోలతో ఆహారభద్రతకు ముప్పు వాటిల్లుతోంది. దీన్ని  అధిగమించాలంటే ఎల్‌నినో మూలాలను వెతికి పట్టుకొని అడ్డుకట్ట వేయాలి.  ఆ దిశగా మన శాస్త్రవేత్తలు ప్రగతి సాధించాలి. క్లిష్ట పరిస్థితులను తట్టుకోగలిగే వ్యవసాయ వంగడాలను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. ఎల్‌నినో, భూతాపం లాంటి వైపరీత్యాలను సమర్థంగా ఎదురొడ్డే సాంకేతిక పరిజ్ఞానం మన సొంతమవ్వాలి.
 
 

>
మరిన్ని వార్తలు