మెరిసేందుకు మేలిమి వ్యూహాలు

8 Oct, 2014 23:18 IST|Sakshi
మెరిసేందుకు మేలిమి వ్యూహాలు

 ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యార్థులకు రాబోయే ఆర్నెల్లు చాలా ముఖ్యమైనవి. నచ్చిన ఇంజనీరింగ్ కళాశాలలో, ఇష్టమైన బ్రాంచ్‌లో చేరాలనుకునే లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిందే. పటిష్ట ప్రణాళిక ప్రకారం చదవాల్సిందే. ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది కాబట్టి పోటీ పరీక్షలకు సమాంతరంగా పబ్లిక్ పరీక్షలకు సిద్ధం కావాలి.
 
 ఇంటర్ ద్వితీయ సంవత్సర
 ఎంపీసీ+ఎంసెట్ ప్రిపరేషన్ ప్రణాళికఅక్టోబర్ 10 నుంచి జనవరి 10 వరకు ఇంటర్ సబ్జెక్టుల్లోని కాన్సెప్టులు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ ప్రశ్నల ప్రిపరేషన్‌కు అధిక సమయం కేటాయించాలి.     జనవరి 11 నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు అందుబాటులో ఉన్న సమయాన్ని ప్రాక్టికల్స్ చేయడానికి, రికార్డులు రాయడానికి, భాషల సబ్జెక్టుల ప్రిపరేషన్‌కు, ఇంటర్‌లో అధిక మార్కుల సాధనకు కేటాయించాలి. ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షలతో పాటు ఇంటర్ ప్రి ఫైనల్ పరీక్షలు రాయాలి. ఆపై ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక ఏప్రిల్‌లో ఎంసెట్ ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్‌తో పాటు రోజువారీ పరీక్షలు, వారాంతపు పరీక్షలు, గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి.
 
 మ్యాథమెటిక్స్
 ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ మ్యాథమెటిక్స్‌లో 2-ఎకు 75 మార్కులు, 2-బికు 75 మార్కులు కేటాయించారు. అదే విధంగా ఎంసెట్‌లో 160 మార్కులకు 80 మార్కులు మ్యాథమెటిక్స్‌కు ఉంటాయి. అందువల్ల ఈ సబ్జెక్టులో అధిక మార్కులు సాధించడం ద్వారా ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకును కైవసం చేసుకోవచ్చు. ఎంసెట్‌లో విజయానికి కచ్చితత్వంతో పాటు వేగం అవసరం. అందువల్ల ప్రతి చాప్టర్‌ను ఇంటర్ పబ్లిక్ పరీక్షల కోణంలో అధ్యయనం చేసిన తర్వాత,ఎంసెట్ కోసం సంక్షిప్త సమాచారం, సూత్రాలపై దృష్టి కేంద్రీకరించాలి. సమస్యలను సాధించాలి.
 
 ముఖ్య అంశాలు (ఇంటర్ పరీక్షలకు):
     ద్విపద సిద్ధాంతం- 16 మార్కులు
     సంకీర్ణ సంఖ్యలు, ఈ్ఛ కౌజీఠిట్ఛ*ట ఖీజిౌ్ఛట్ఛఝ 17 మార్కులు
     సాంఖ్యక శాస్త్రం- 9 మార్కులు
     సంభావ్యత- 15 మార్కులు
     వృత్తాలు- 22 మార్కులు
     నిశ్చిత, అనిశ్చిత సమాకలనాలు - 33 మార్కులు
     అవకలన సమీకరణాలు- 13 మార్కులు
 
 ముఖ్య అంశాలు (ఎంసెట్‌కు):
 ఇంటెగ్రల్ కాలిక్యులస్, 3డీ జామెట్రీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, వెక్టార్ అల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, మ్యాట్రిసెస్-డిటెర్మినెంట్స్, సర్కిల్స్ చాప్టర్ల ప్రిపరేషన్‌కు అధిక సమయం కేటాయించాలి. ఎంసెట్ 2014,2013 ప్రకారం వివిధ చాప్టర్ల వెయిటేజీ:

చాప్టర్    ప్రశ్నలు

బీజ గణితం    26
 కలనగణితం    19
 రేఖాగణితం    17
 త్రికోణమితి    9
 సదిశా బీజగణితం    6
 3డీ-జ్యామితి    3
 
 ఫిజిక్స్
 ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ ప్రశ్నపత్రం 60 మార్కులకు ఉంటుంది. పబ్లిక్ పరీక్షల కోణంలో చూస్తే ఎలక్ట్రో స్టాటిక్స్, వేవ్ మోషన్, ఆప్టిక్స్ చాలా కష్టమైనవిగా భావిస్తారు. ఇవి చాలా ముఖ్యమైనవి. ప్రతి చాప్టర్‌లోనూ విశ్లేషణాత్మక ప్రశ్నలు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకంలోని అంశాలను క్షుణ్నంగా చదివి, ప్రతి చాప్టర్ వెనుక ఉన్న ప్రశ్నలన్నింటినీ సాధించాలి. వేవ్ మోషన్, సెమీ కండక్టర్ డివెసైస్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిజం చాప్టర్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
 
 ఎంసెట్:
 ఎంసెట్ కోణంలో చూస్తే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఫిజిక్స్‌ను క్లిష్టమైందిగా భావిస్తారు. అయితే కాన్సెప్టులపై పట్టు సాధించడం ద్వారా ఎక్కువ మార్కులు సొంతం చేసుకోవచ్చు. సూత్రాలను అర్థం చేసుకొని, వాటికి సంబంధించిన సమస్యలను ఎక్కువగా సాధన చేయాలి. మూలసూత్రాలను పట్టిక రూపంలో రాసుకొని, వీలైనన్ని సార్లు పునశ్చరణ చేయాలి. మొదటి సంవత్సరం సిలబస్‌లోని శక్తి, ద్రవ్యవేగ, కోణీయ వేగ నిత్యత్వ సూత్రాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి. ఉష్ణగతిక శాస్త్రంలో ఇంటర్నల్ ఎనర్జీ సూత్రం, సరళహరాత్మక చలనంలోని డోలనం, డోలనావర్తన కాలం వాటి అనువర్తనాలను అధ్యయనం చేయాలి.సీనియర్ ఇంటర్ సిలబస్‌లోని కిర్కాఫ్ నియమాలు, ఫ్లెమింగ్ కుడి, ఎడమ చేయి సూత్రాలు, ఎంసీజీ, ప్రవాహ విద్యుత్ శాస్త్రంలోని ప్రాథమిక సూత్రాలను నేర్చుకోవాలి.ఎలక్ట్రో మ్యాగ్నటిజం, ఫిజికల్ ఆప్టిక్స్, వేవ్ మోషన్, సౌండ్, హీట్, కొలిజన్, మ్యాగ్నటిజం అంశాలపై దృష్టిసారించాలి. వీటి నుంచి దాదాపు 25 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
 
 కెమిస్ట్రీ
  ఫిజిక్స్ తరహాలోనే కెమిస్ట్రీకి ఇంటర్‌లో 60 మార్కులు, ఎంసెట్‌లో 40 మార్కులు ఉంటాయి. కెమిస్ట్రీ తెలుగు అకాడమీ పుస్తకంలోని అంశాలను క్షుణ్నంగా చదివితే ఇంటర్, ఎంసెట్ రెండింటిలోనూ అధిక మార్కులు సాధించేందుకు దోహదపడుతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని సమీకరణాలను వీలైనంతలో ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి.ఇంటర్మీడియెట్ కోణంలో చూస్తే సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్ కష్టమని భావిస్తారు. ఈ అంశాలు చాలా ముఖ్యమైనవి. ఒక పద్ధతి ప్రకారం విశ్లేషణాత్మకంగా చదవడం ద్వారా ఈ అంశాలపై పట్టు సాధించవచ్చు. ఒక్క ఫిజికల్ కెమిస్ట్రీలోని సమస్యా సాధనలు మినహా మిగిలిన కెమిస్ట్రీ చాప్టర్లలో ఇంటర్ ప్రిపరేషన్, ఎంసెట్ ప్రిపరేషన్‌కు పెద్దగా తేడా ఉండదు.ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధించడంలో కెమిస్ట్రీ కీలకపాత్ర పోషిస్తుంది. ఎందుకంటే తక్కువ సమయంలో పూర్తిస్థాయిలో సమాధానాలు గుర్తించేందుకు అవకాశమున్న సబ్జెక్టు ఇది.
 
 70% నుంచి 80% ప్రశ్నలకు సమాధానాలను తేలిగ్గా గుర్తించవచ్చు. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, పీరియాడిక్ టేబుల్ అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి.ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అన్ని రసాయనిక సమ్మేళనాల ధర్మాలు, తయారీ పద్ధతులు నేర్చుకోవాలి. ఆల్కహాల్స్, ఫినాల్స్, అమైన్స్‌లోని నేమ్డ్ రియాక్ష న్స్; ఆర్డర్ ఆఫ్ యాసిడ్, బేసిక్ స్ట్రెంథ్ అంశాలను బాగా గుర్తుంచుకోవాలి.సూత్రాలన్నింటినీ నేర్చుకుని, వాటిపై ఆధారపడిన సమస్యల్ని సాధన చేయాలి.ఎంసెట్‌లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 12-16 ప్రశ్నలు వస్తాయి. మిగిలిన విభాగాలతో పోల్చితే ఇది కొంత క్లిష్టమైన విభాగం. ఇందులోని మూలకాల ధర్మాలను ఒకదాంతో మరోదాన్ని పోల్చుకుంటూ అధ్యయనం చేయాలి. అన్ని గ్రూప్స్‌లో మూలకాల ధర్మాలు చాలా వరకూ ఒకేలా ఉంటాయి. వాటి భిన్న ధర్మాలపై పట్టు సాధించాలి. పట్టిక రూపంలో రాసుకొని, పునశ్చరణ చేయడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటాయి.
 
 2014 ఎంసెట్‌లో ప్రశ్నలు: ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 10, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 11, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 16, సమ్మిళిత భావనలు (Mixed Concepts) నుంచి మూడు ప్రశ్నలు వచ్చాయి.
  మొదటి సంవత్సరం:
 అంశం    ప్రశ్నలు
 అటామిక్ స్ట్రక్చర్    2
 పీరియాడిక్ టేబుల్    1
 కెమికల్ బాండింగ్    2
 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్    1
 స్టాకియోమెట్రీ    1
 థర్మోడైనమిక్స్    1
 కెమికల్ ఈక్విలిబ్రియం,
 యాసిడ్‌‌స అండ్ బేసెస్    2
 హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్    1
 ఆల్కలి, ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్    2
 గ్రూప్ 13 ఎలిమెంట్స్    1
 గ్రూప్ 14 ఎలిమెంట్స్    1
 ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ    1
 ఆర్గానిక్ బేసిక్స్, హైడ్రోకార్బన్స్    4
 ద్వితీయ సంవత్సరం
 అంశం    ప్రశ్నలు
 సొల్యూషన్స్    2
 సాలిడ్ స్టేట్    1
 ఎలక్ట్రో కెమిస్ట్రీ    2
 కెమికల్ కెనైటిక్స్    1
 మెటలర్జీ    1
 గ్రూప్ 15 ఎలిమెంట్స్    1
 గ్రూప్ 16 ఎలిమెంట్స్    1
 గ్రూప్ 17 ఎలిమెంట్స్    1
 డి-బ్లాక్ ఎలిమెంట్స్    1
 నోబెల్ గ్యాసెస్    1
 పాలిమర్స్    1
 రోజువారీ జీవితంలో కెమిస్ట్రీ    1
 ఆర్గానిక్ కాంపౌండ్స్    4
 సర్ఫేస్ కెమిస్ట్రీ    1
 
 వృక్షశాస్త్రం
 ఎంసెట్ లేదా ఇతర పోటీ పరీక్షల ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశించే ప్రక్రియలో ఇంటర్మీడియెట్ మార్కులకు ప్రాధాన్యం పెరిగింది. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి, నచ్చిన కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఐపీఈలో 90 శాతానికి (540/600) తక్కువ కాకుండా మార్కులు సాధించారు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇంటర్, ఎంసెట్ పరీక్షలకు సబ్జెక్టులు ఒకటే అయినప్పటికీ ప్రిపరేషన్ మాత్రం భిన్నంగా ఉండాలి.
 
 వెయిటేజీని అనుసరించి ప్రిపరేషన్:
 ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు ప్రధానంగా వెయిటేజీని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ ప్రారంభించాలి. ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు వివిధ పాఠ్యాంశాల్లో చేర్చిన కొత్త విషయాలపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకు ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేనందున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
 
 వెయిటేజీ:
 యూనిట్    మార్కుల వెయిటేజీ
 1.    వృక్ష శరీరధర్మ శాస్త్రం    28
 2.    సూక్ష్మజీవ శాస్త్రం    6
 3.    జన్యుశాస్త్రం    6
 4.    అణుజీవ శాస్త్రం    8
 5.    జీవసాంకేతిక శాస్త్రం    16
 6.    మానవ సంక్షేమంలో
     మొక్కలు, సూక్ష్మజీవులు    12
 మొత్తం మార్కులు    76
     మొత్తం దీర్ఘ సమాధాన ప్రశ్నలు 15. ఇవి సాధారణంగా 1, 5, 6 యూనిట్ల నుంచి వచ్చేందుకు అవకాశముంది.
 
 గమనించాల్సిన అంశాలు:
 వీలైనంత వరకు పాఠ్యపుస్తకాల్లోని వాక్యాలను/ నిర్వచనాలను యథాతథంగా రాయాలి.పాఠ్యపుస్తకాల్లో లేని ఉదాహరణలు రాయకూడదు.చక్కని చిత్రపటాలు గీచి, భాగాలు రాయాలి.    శరీరధర్మ శాస్త్రంలోని క్రెబ్స్, కెల్విన్ వలయాలు పూర్తిగా ఉండాలి. ప్రతి చర్యను విశదీకరించాలి.మొదటి యూనిట్‌కు మొత్తం మార్కుల్లో దాదాపు సగం వెయిటేజీ ఇచ్చిన కారణంగా.. ఈ యూనిట్‌పై అధికంగా దృష్టి సారించాలి.సమాధానాలను రాసే క్రమంలో కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ప్రతి సమాధానానికి సబ్-హెడ్డింగ్, అవసరమైన చోట ఫ్లో చార్ట్ వేయడంవంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే వీటికోసం ప్రత్యేకంగా కొన్ని మార్కులు కేటాయిస్తారు.అవసరమైన చోట పటాలను చక్కగా వేయడంతోపాటు మంచి వివరణ కూడా ఇవ్వాలి.
 
 ఎంసెట్ ప్రణాళిక:
 పాఠ్యాంశాలను చదవడం ప్రారంభించాలి. సిలబస్ మొత్తం జనవరి చివరి నాటికి పూర్తయ్యేలా చూడాలి. డిసెంబర్, జనవరి నెలల్లో ప్రాక్టికల్స్ కారణంగా రెగ్యులర్ విద్యార్థులకు కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ప్రిపరేషన్‌లో జాప్యం జరుగుతుంది. అందువల్ల పటిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ కొనసాగించాలి.  ఫిబ్రవరి మొదటి వారం నుంచి పబ్లిక్ పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధంకావాలి.  2014లో ఎంసెట్ పరీక్ష తేలిగ్గానే ఉన్నప్పటికీ మొత్తంమీద తెలుగు మాధ్యమం అభ్యర్థులకు కొంత నిరాశ ఎదురైంది. చిత్రపటాలకు సంబంధించి అనవసర స్థాయిలో ప్రశ్నలు వచ్చాయి. ప్రస్తుతం ప్రిపరేషన్ కొనసాగిస్తున్న అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. ఈసారి శాస్త్రవేత్తల చిత్రపటాలపై ప్రశ్నలు రావని ఆశిద్దాం!
 
 2014 ఎంసెట్ వెయిటేజీ:
 ప్రథమ సంవత్సరం
     యూనిట్    ప్రశ్నలు
     యూనిట్-1    4
     యూనిట్-2    4
     యూనిట్-3    3
     యూనిట్-4    1
     యూనిట్-5    4
     యూనిట్-6    2
     యూనిట్-7    1
 
 ద్వితీయ సంవత్సరం
     యూనిట్    ప్రశ్నలు
     యూనిట్-1    8
     యూనిట్-2    2
     యూనిట్-3    2
     యూనిట్-4    3
     యూనిట్-5    3
     యూనిట్-6    3
 మొదటి, రెండో సంవత్సరం పాఠ్యాంశాల్లో సారూప్యం ఉన్నవాటిని కలిపి చదవాలి. ఎంసెట్‌కు కనీసం 20 రోజులు ముందుగా సిలబస్ పూర్తిచేయాలి. దీనివల్ల పునశ్చరణకు తగిన సమయం అందుబాటులో ఉంటుంది.
 -బి. రాజేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
 
 జంతుశాస్త్రం
 విద్యార్థులు పూర్తిస్థాయిలో పరీక్షల సన్నద్ధతకు దాదాపు వంద రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు, ఎంసెట్‌కు మధ్య దాదాపు 40-45 రోజుల వ్యవధి ఉంటుంది.
 
 పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధత:
 ఇంటర్ ద్వితీయ సంవత్సరం జంతుశాస్త్రం సిలబస్‌లో ఎనిమిది అధ్యాయాలున్నాయి. వీటిలో మొదటి అయిదు మానవ అంతర్నిర్మాణం, శరీరధర్మ శాస్త్రానికి సంబంధించినవి. మిగిలినవి జన్యుశాస్త్రం, పరిణామం, అనువర్తిత జీవశాస్త్రానికి చెందినవి.
     జంతుశాస్త్రానికి 60 మార్కులు కేటాయించారు. వీటిలో అతి స్వల్ప, స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 76 మార్కుల పేపర్‌లో 60 మార్కులకు సమాధానాలు రాయాలి.
 
 యూనిట్ల వారీగా వెయిటేజీ:
     యూనిట్    మార్కులు
     యూనిట్ 1    10
     యూనిట్ 2    10
     యూనిట్ 3    8
     యూనిట్ 4    8
     యూనిట్ 5    12
     యూనిట్ 6    12
     యూనిట్ 7    8
     యూనిట్ 8    8
     మానవ నిర్మాణానికి సంబంధించిన యూనిట్ల నుంచి 48 మార్కులకు ప్రశ్నలు ఇస్తున్నారు. మిగిలిన మూడు యూనిట్లకు సంబంధించి 28 మార్కులకు ప్రశ్నలు వస్తున్నాయి.
 
 గమనించాల్సిన అంశాలు:
    ఇప్పటి వరకు పూర్తయిన ప్రిపరేషన్‌ను విశ్లేషించుకోవాలి. ఎంత వరకు సిలబస్ పూర్తయింది? మిగిలిన సిలబస్‌కు ఎంత సమయం కేటాయించాలి? ఏ అంశాలు క్లిష్టంగా ఉన్నాయి? తదితర అంశాలపై స్పష్టత ఏర్పరుచుకోవాలి.  మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మానవ హృదయ నిర్మాణం-పనిచేసే విధానం, మానవుని విసర్జక వ్యవస్థ, మూత్రం తయారీ విధానం, కండర సంకోచ విధానం, మానవుని మెదడు-నిర్మాణం, విధులు తదితర అంశాల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి.     {పతి అధ్యాయం చివర ఇచ్చిన ప్రశ్నలను ప్రణాళికాబద్ధంగా సాధన చేయాలి. పటాలను ప్రాక్టీస్ చేయాలి.
 
 ఎంసెట్‌కు ఎలా సిద్ధమవాలి?
 ఎంసెట్ మెడికల్ పరీక్షలో మొత్తం 160 ప్రశ్నలకు గాను జంతుశాస్త్రం నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్‌కు దాదాపు సమాన ప్రాధాన్యమిస్తారు.

 2014 ఎంసెట్ వెయిటేజీ:
     యూనిట్    ప్రశ్నలు
     యూనిట్-1    2
     యూనిట్-2    2
     యూనిట్-3    3
     యూనిట్-4    2
     యూనిట్-5    2
     యూనిట్-6    6
     యూనిట్-7    3
     యూనిట్-8    2
 
 తెలుగు అకాడమీ నుంచి నేరుగా:
 ఎంసెట్-2014 జంతుశాస్త్రం ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు చాలా వరకు సరళంగా ఉన్నాయి.తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకం నుంచి ప్రశ్నలు నేరుగా వచ్చాయి.ప్రతి పాఠ్యాంశంలోని అంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. ప్రతి చాప్టర్‌ను ఇంటర్ పరిధిలో చదువుతున్నప్పటికీ ఎంసెట్‌కు ఉపయోగపడేలా ముఖ్య అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి.ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్‌కు తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకొని రెండింటికీ సమాంతరంగా ప్రిపరేషన్ కొనసాగించాలి.సమయ పాలన, కచ్చితత్వం ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు చాలా ముఖ్యమన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
 
 గుర్తుంచుకోండి:
 ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంతో పోల్చితే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎక్కువగా కష్టపడాలి. ఎందుకంటే ద్వితీయ సంవత్సరంతోపాటు మొదటి సంవత్సరం సిలబస్‌ను సమాంతరంగా చదవడమేకాకుండా.. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది.ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ సమాధానాలు గుర్తుంచుకోవడానికి షార్ట్ కట్ మెథడ్స్‌ను నేర్చుకోవాలి.హ్యూమన్ అనాటమీ-ఫిజియాలజీ యూనిట్లలోని పటాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అధిక శాతం సమాధానాలు వీటితోనే ముడిపడి ఉంటాయి.ప్రతి యూనిట్ చివర ఇచ్చిన అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకు సమాధానాలను కచ్చితంగా నేర్చుకోవాలి. మెరుగైన మార్కుల సాధనకు ఇవి బాగా ఉపయోగపడతాయి. స్వల్ప సమాధాన ప్రశ్నలకు పాయింట్ల వారీగా జవాబులు రాయాలి. దీర్ఘ సమాధాన ప్రశ్నల్లో పటాలతో కూడిన ప్రశ్నలను ఎంపిక చేసుకోవడం వల్ల ఎక్కువ మార్కులు సాధించొచ్చు.
 

మరిన్ని వార్తలు