ఎంబీబీఎస్, డెంటల్‌కు పాత ఫీజులే

27 Aug, 2014 02:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఎంబీబీఎస్, దంత వైద్య సీట్లకు పాత ఫీజులే వసూలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. మైనార్టీ, నాన్‌మైనార్టీ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో కన్వీనర్, బి కేటగిరీ, యాజమాన్య కోటా సీట్లకు పాత ఫీజులే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్యకోటా సీట్ల భర్తీకి ఎంపిక కమిటీని నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను భారీగా పెంచుతూ నిర్ణయించింది. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్‌లోని యాజమాన్య కోటా సీట్లకు భారీ గిరాకీ ఏర్పడనుంది.

 యాజమాన్య కోటా మేమే భర్తీచేస్తాం

 తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి

 సాక్షి, హైదరాబాద్: రాటిఫికేషన్ (ధృవీకరణ) ఇచ్చి తెలంగాణలోని వృత్తి విద్యా కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లను తామే భర్తీ చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తె లిపారు. మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీ ఉన్నత విద్యా మండలి తెలంగాణలో ఇంకా అధికారం చెలాయించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఇటీవల తెలంగాణ జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఏపీ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి నేతృత్వంలోనే ఈ ప్రక్రియ అంతా కొనసాగుతుందని వెల్లడించారు.

 

మరిన్ని వార్తలు