పీఎస్‌ఎల్‌వీ-సీ23 ప్రయోగం విజయవంతం

3 Jul, 2014 03:49 IST|Sakshi
పీఎస్‌ఎల్‌వీ-సీ23 ప్రయోగం విజయవంతం

 వార్తల్లో వ్యక్తులు
 సింగపూర్ అటార్నీ జనరల్‌గా జస్టిస్ వీకే ర
జా
 సింగపూర్ అటార్నీ జనరల్‌గా భారత సంతతి న్యాయమూర్తి జస్టిస్ వీకే రజా (57) జూన్ 25న నియమితులైనట్లు  ఆ దేశ అధ్యక్ష  కార్యాలయం ప్రకటించింది.
 
 కర్ణాటక ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా రోశయ్య
 తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య జూన్ 29న కర్ణాటక ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీహెచ్ వాఘేలా రోశయ్యతో ప్రమాణం చేయించారు. హెచ్‌ఆర్ భరద్వాజ్ పదవీ కాలం జూన్ 28 నాటికి ముగియడంతో కేంద్రం రోశయ్యకు బాధ్యతలు అప్పగించింది.
 
 నాగాలాండ్ గవర్నర్ రాజీనామా
 నాగాలాండ్ గవర్నర్ అశ్వనీకుమార్ జూన్ 25న తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల గవర్నర్లు బీఎల్‌జోషీ, శేఖర్‌దత్‌లు రాజీనామా చేశారు. ఈ ముగ్గురూ సివిల్ సర్వీస్ మాజీ అధికారులే కావడం విశేషం.
 
 భారత చరిత్ర పరిశోధన మండలి చైర్మన్‌గా యల్లాప్రగడ

 కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన భారతీయ చరిత్ర పరిశోధన మండలి చైర్మన్‌గా యల్లాప్రగడ సుదర్శనరావు జూన్ 24న నియమితులయ్యారు. దక్షిణ భారతదేశం నుంచి గత 30 ఏళ్లలో జాతీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగంలో ఈ మండలికి చైర్మన్‌గా నియమితులైన మూడో వ్యక్తి యల్లాప్రగడ. ఆయన స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్. ఆయన గతంలో కాకతీయ యూనివర్సిటీ చరిత్ర విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.
 
 సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మిశ్రా, గోయల్, నారిమన్
 కలకత్తా, ఒడిశా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు అరుణ్‌మిశ్రా, ఆదర్శ్ గోయల్‌తోపాటు ప్రఖ్యాత న్యాయవాది రోహిన్‌టన్ నారీమన్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గా నియామకానికి రాష్ట్రపతి జూన్ 26న ఆమోదం తెలిపారు. కాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నేరుగా ఎన్నికైనవారిలో నారీమన్ ఐదోవారు. ఈయన ఏడేళ్లపాటు సుప్రీం న్యాయమూర్తిగా కొనసాగుతారు.
 
 ఇక్రిశాట్ కొత్త డెరైక్టర్ జనరల్‌గా బెర్గ్ విన్సన్
 హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట పంటల వ్యవసాయ పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) కొత్త డెరైక్టర్ జనరల్‌గా డాక్టర్ డేవిడ్ బెర్గ్ విన్సన్‌ను నియమిస్తున్నట్లు ఆ సంస్థ పాలకమండలి జూన్ 27న ప్రకటించింది. బెర్గ్‌విన్సన్ ఐదేళ్ల పాటు డెరైక్టర్ హోదాలో కొనసాగుతారు.
 
 
 జాతీయం
 స్టార్ అలయెన్స్‌లో ఎయిరిండియా

 అంతర్జాతీయ విమాన యాన సంస్థల కూటమి స్టార్ అలయెన్స్‌లో ఎయిరిండియా భాగస్వామి అయింది. దీంతో ఈ అలయెన్స్‌లో చేరిన తొలి భారతీయ విమానయాన కంపెనీగా ఎయిరిండియా ఆవిర్భవించింది. లండన్‌లో ఏర్పాటు చేసిన స్టార్ అలయెన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశం ఎయిరిండియాను చేర్చుకోవడానికి అనుకూలంగా ఓటు వేసింది. ఈ సభ్యత్వం కోసం భారత్ ఏడేళ్లు ఎదురుచూసింది. యునెటైడ్(అమెరికా), సింగపూర్ ఎయిర్‌లైన్స్, లుఫ్తాన్సా, ఎయిర్ చైనా, ఎయిర్‌కెనడా, స్విస్, ఆస్ట్రియా, ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్‌తోపాటు ప్రసిద్ధి చెందిన 27 సంస్థలకు అలయెన్స్‌లో సభ్యత్వం ఉంది. తాజాగా చేరిన భారత్ 28వ సభ్య దేశం.
 
 ఇంజనీర్స్ ఇండియాకు నవరత్న హోదా

 ప్రభుత్వ రంగ సంస్థ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌కు ప్రతిష్ఠాత్మక నవరత్న హోదా లభించింది. దీనివల్ల సంస్థ దేశీయంగా, అంతర్జాతీయంగా, ఆర్థికంగా, నిర్వహణాపరంగా మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. అలాగే నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్టర్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ)కి కూడా నవరత్న హోదా లభించింది. ఈ రెండు కంపెనీలతో నవరత్న హోదా పొందిన వాటి జాబితా 16 కు చేరింది.
 
 
 క్రీడలు
 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేత సైనా

 భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూ పర్ సిరీస్ టోర్నమెంట్‌లో ఛాంపియన్‌గా అవతరించింది. సిడ్నీలో జూన్ 29న జరిగిన ఫైనల్లో సైనా స్పెయిన్‌కు చెం దిన కరోలినా మారిన్‌పై విజయం సాధించింది. ఈ గెలుపుతో సైనా తన కెరీర్‌లో ఏడో సూపర్ సిరీస్ టైటిల్‌ను సొం తం చేసుకుంది. ఆమెకు రూ.34 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది.
 
 ఐసీసీ చైర్మన్‌గా శ్రీనివాసన్
 పాలనాపరమైన మార్పుల అనంతరం ఏర్పడిన తొలి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు భారత్‌కు చెందిన ఎన్. శ్రీనివాసన్ చైర్మన్‌గా అధికారికంగా ఎన్నికయ్యారు. ఐసీసీ చైర్మన్ పద వీ కాలం రెండేళ్లు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జూన్ 26న జరిగిన వార్షిక సమావేశంలో 52 మంది సభ్యులు శ్రీనివాసన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐసీసీ పాలనా వ్యవహారాలతో పాటు మెమోరాండమ్, ఆర్టికల్స్‌లో సవరణకు కూడా కౌన్సిల్ ఆమోదించింది. దీంతో ఇక పాలనా వ్యవహారాల్లో బిగ్-3 (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్)దే అంతిమ నిర్ణయం.
 
 వరల్డ్ 6-రెడ్ స్నూకర్ విజేత పంకజ్ అద్వానీ
 భారత స్నూకర్ స్టార్ పంకజ్ అద్వానీ వరల్డ్ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచాడు. జూన్ 29న జరిగిన ఫైనల్లో పంకజ్ పోలెండ్‌కు చెందిన కాస్ఫర్ ఫ్లిల్పియాక్‌పై విజయం సాధించాడు. ఈ విజయంతో తొమ్మిదో ప్రపంచ టైటిల్‌ను (బిలియర్డ్స్‌లో 7, స్నూకర్‌లో 2) తన ఖాతాలో వేసుకున్నాడు.
 
 ఉరుగ్వే ఫుట్‌బాల్ ఆటగాడు సూరెజ్‌పై నిషేధం
 బ్రెజిల్‌లో జూన్ 25న ఇటలీ- ఉరుగ్వేల మధ్య జరిగిన ప్రపంచకప్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో గియార్గియా అనే ఇటలీ ఆటగాడిని కొరికినందుకు ఉరుగ్వే ఫుట్ బాల్ క్రీడాకారుడు లూయిస్ సూరెజ్‌పై ఫిఫా నిషేధం విధించింది. తొమ్మిది అంతర్జాతీయ మ్యాచ్‌లతోపాటు నాలుగు నెలలు ఫుట్‌బాల్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా సూరెజ్‌పై చర్య తీసుకుంది.
 
 
 అంతర్జాతీయం
 బీజింగ్‌లో పంచశీల 60వ వార్షికోత్సవాలు

 చైనా రాజధాని బీజింగ్‌లో పంచశీల 60వ వార్షికోత్సవం జరిగింది. దీనికి భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతోపాటు చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్, మయన్మార్ అధ్యక్షుడు యూ థీన్ సీన్ హాజరయ్యారు. భారత్, చైనాల మధ్య ఉన్న విభేదాలను తగ్గించుకుంటూ పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని ఈ అంశం పంచశీలకు ఎంతగానో దోహదపడుతుందని అన్సారీ ఈ సంద్భరంగా అన్నారు.
 
 వరల్డ్ లుక్ క్యాపిటల్‌గా వ్రోక్లా నగరం
 పోలెండ్‌లోని వ్రోక్లా నగరాన్ని 2016 సంవత్సరానికి గాను వరల్డ్ లుక్ క్యాపిటల్‌గా యునెస్కో జూన్ 26న ప్రకటించింది. ప్రచురణ, పుస్తక అమ్మకాల పరిశ్రమను ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ప్రోత్సహించినందుకు ఈ గుర్తింపు లభించింది. వ్రోక్లా నగరంలోని ప్రజానాయకులు ప్రజల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించినందుకు మంచి కార్యక్రమాన్ని అమలు చేసినట్లు యునెస్కో పేర్కొంది. పుస్తకాలు, పుస్తక పఠనాన్ని వివిధ కార్యక్రమాల్లో ప్రోత్సహించిన నగరాన్ని వరల్డ్ లుక్ క్యాపిటల్‌గా 2001 నుంచి ఐరాస సాంస్కృతిక సంస్థ యునెస్కో ప్రకటిస్తోంది. ఈ గౌరవం 2003లో న్యూఢిల్లీకి దక్కింది. కాగా 2014లో నైజీరియాకు చెందిన పోర్ట్‌హార్ కోర్ట్, 2015లో దక్షిణ కొరియాలోని ఇంజియోన్‌లు లుక్ క్యాపిటల్‌గా ఎంపికయ్యాయి.
 
 ప్రపంచ పర్యావరణ నేరాల విలువ
 213 బిలియన్ డాలర్లు
 ప్రపంచ పర్యావరణ నేరాల విలువ 213 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని ఐక్యరాజ్యసమితి, ఇంటర్‌పోల్ జూన్ 24న విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది. ఈ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా భద్రత, సుస్థిర అభివృద్ధిని దెబ్బతీసే నేరస్థులు, ఉగ్రవాదులకు తోడ్పడుతుందని వివరించింది. కెన్యా రాజధాని నైరోబీలోని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ప్రధాన కార్యాలయం (యుఎన్‌ఈపీ)లో వారం రోజులపాటు జరిగిన ప్రపంచ పర్యావరణ సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. వన్యప్రాణుల వేటను అరికట్టడం, హరిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం అనే అంశాల లక్ష్యంగా ఈసదస్సు జరిగింది.
 
 
 అవార్డులు
 ప్రభుత్వ మొబైల్ సేవా
 కార్యక్రమానికి యూఎన్ అవార్డు
 భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ చేపట్టిన మొబైల్ సేవా అప్లికేషన్‌కు ఐక్యరాజ్యసమితి ప్రజాసేవ అవార్డు లభించింది. 2014 పౌరసేవల పురస్కారాల్లో రెండో శ్రేణి విభాగంలో ఈ పురస్కారం దక్కింది. ఈ కార్యక్రమం కింద ప్రజాసేవలను మొబైల్‌ఫోన్ల ద్వారా ఈ సేవల రూపంలో అందిస్తున్నారు. భారత్‌తో పాటు బహ్రెయిన్, బ్రెజిల్, కామెరూన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, స్పెయిన్ ఈ అవార్డుకు ఎంపికయ్యాయి.


 భారత సంతతి మహిళకు
 అంతర్జాతీయ రేడియో అవార్డు
 భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా మహిళ మన్‌ప్రీత్ కౌర్‌సింగ్‌కు అంతర్జాతీయ రేడియో అవార్డు లభించింది. కుటుంబ, గృహహింసపై తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి ఆమెకు ఈ అవార్డును ప్రకటించారు. ఆస్ట్రేలియాలోని భారత సంతతి కుటుంబాల్లో గృహహింస, కుటుంబ సమస్యలపై ది ఎనిమీ వితిన్ అనే పేరుతో ఓ డాక్యుమెంటరీని నిర్మించారు. మన్‌ప్రీత్ ప్రస్తుతం ఎస్‌బీఎస్ పంజాబీ రేడియో చానల్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు.
 
 సుదర్శన్ పట్నాయక్‌కు పీపుల్స్ ఛాయిస్ పతకం
 భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌కు 2014 సంవత్సరానికి పీపుల్స్ ఛాయిస్ పతకం లభించింది. అమెరికాలోని అట్లాంటాలో జూన్ 27న జరిగిన ప్రపంచ సైకత శిల్ప పోటీల్లో ఆయన ఇసుకతో రూపొందించిన వృక్ష సంరక్షణ-భవిష్యత్ పరిరక్షణ అనే శిల్పానికి ఈ బహుమతి లభించింది.
 
 
 సైన్స్ అండ్ టెక్నాలజీ
 నౌకా దళంలోకి ఐ.ఎన్.ఎస్. కమోర్తా

 భారత్ తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో ఐ.ఎన్.ఎస్ కమోర్తా అనే అత్యాధునిక యుద్ధ నౌకను తయారు చేసింది. ఈ యుద్ధనౌక సముద్రంలో నిశ్శబ్దంగా కదిలే శత్రు జలాంతర్గాములను కనిపెట్టగలదు. జలాంతర్గాములను పేల్చివేసే స్వదేశీ రాకెట్ లాంచర్ కూడా తొలిసారి కమోర్తా యుద్ధనౌకకు కల్పించారు. ఈ నౌకలో ఉన్న బౌమౌంటెడ్ సోనార్ నీటి లోపల మరింత మెరుగైన పరిశీలన చేయగలదు. తొలిసారి ఉపరితల, వాయు నిఘాకోసం రేవతి అనే స్వదేశీ రాడార్‌ను ఈ నౌకలో ఏర్పాటు చేశారు. ఈ యుద్ధనౌకను కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ నిర్మించింది. దీని బరువు 3,400 టన్నులు. పొడవు 109 మీటర్లు, వెడల్పు 13 మీటర్లు. గరిష్ఠంగా 25 నాట్‌ల వేగంతో ప్రయాణించగలదు. కదమత్, కిల్టాన్, కవరత్తి అనే మరో మూడు యుద్ధనౌకలను గార్డెన్‌రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ నిర్మించనుంది.
 
 రెండో పెద్ద టెలిస్కోప్
 ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలిస్కోప్‌ను ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) రూపకల్పన చేసింది. దీనికి మ్యాజిక్ అట్మాస్ఫిరిక్ చెరింకోవ్ ఎక్స్‌పెరిమెంట్ (మేస్) అని పేరుపెట్టింది. విశ్వం పుట్టుకను తెలుసుకునేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మేస్ టెలిస్కోప్‌ను జూన్ 28న హైదరాబాద్ నుంచి జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్‌కు తరలించారు. మేస్ నిర్మాణ వ్యయం రూ.45 కోట్లు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా దీన్ని ఆపరేట్ చేయవచ్చు. సూర్యుని నుంచి వెలువడే గామా కిరణాలు మన వాతావరణంపై చూపుతున్న ప్రభావానికి సంబంధించి ఈ పరిశోధనలు కొనసాగుతాయి. 21 మీటర్ల ఎత్తు, 180 టన్నుల బరువుండే ఈ టెలిస్కోప్‌లో అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా-26 డిగ్రీల నుంచి 270 డిగ్రీల కోణంలో 27 మీటర్ల వ్యాసార్ధ పరిధిలో గామా కిరణాలను చిత్రీకరించి, భూమిపై ఉండే కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద టెలిస్కోప్ హెస్ నమీబియాలో ఉంది.
 
 నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ23
 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ-సీ23 అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. జూన్ 30న శ్రీహరికోటలోని షార్ వేదికగా నిర్వహించిన ఈ ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ-సీ23 ద్వారా ఫ్రాన్స్‌కు చెందిన ఉపగ్రహం స్పాట్-7 తోపాటు కెనడా, సింగపూర్, జర్మనీలకు చెందిన మరో నాలుగు బుల్లి ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్య లోకి ప్రవేశపెట్టారు. పీఎస్‌ఎల్‌వీల వరుసలో ఇది 27వది. ఈ ప్రయోగం పూర్తిగా వాణిజ్యపరమైనది. ఇప్పటివరకు ఇస్రో 19 దేశాలకు చెందిన 38 విదేశీ ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టగా అందులో 30 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పీఎస్‌ఎల్‌వీ-సీ 23 పొడవు 44.4 మీటర్లు, బరువు 230 టన్నులు. ఈ రాకెట్ తన వెంట 765 కిలోల బరువుగల ఉపగ్రహాలను, ఇస్రోకు చెందిన 60 కిలోల పేలోడ్‌ను తీసుకెళ్లింది.
 

మరిన్ని వార్తలు