గురుకులాల్లో స్పెషల్‌ ప్లాన్‌

21 Oct, 2019 02:06 IST|Sakshi

నవంబర్‌ 1 నుంచి ప్రత్యేక తరగతుల నిర్వహణ

ఉదయం, సాయంత్రం గంటపాటు బోధన, అభ్యసన

ప్రతిరోజు ఒక సబ్జెక్టులో సందేహాల నివృత్తి, స్లిప్‌ టెస్టులు

వరుస సెలవుల నేపథ్యంలో ముందే యాక్షన్‌ ప్లాన్‌

సాక్షి, హైదరాబాద్‌:పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాల కోసం గురుకుల సొసైటీలు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నాయి. ఏటా వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నప్పటికీ... ఈ సారి వరుస సెలవులు రావడం...ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు గురుకుల సొసైటీలు ముం దస్తు చర్యలకు దిగాయి. ఇందులో భాగంగా ప్రత్యేక తరగతుల నిర్వహణ, ప్రతి రోజు పరీ క్షలు నిర్వహిం చేందుకు ఉపక్రమించాయి.ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేసి పాఠశాల ప్రిన్సిపాళ్లకు పం పించాయి.

వాస్తవానికి ప్రతి సంవత్సరం నూరు రోజుల ప్రణాళిక పేరిట గురుకుల సొసైటీలు డిసెంబర్‌ నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేవి. కానీ ఈసారి నవంబర్‌ నుంచే అమలు చేసేం దుకు సిద్ధమయ్యాయి. వరుసగా 24 రోజులు సెలవులు రావడంతో విద్యార్థుల్లో అభ్యసనా కార్యక్రమాలు తగ్గాయి. ఈ నెల 20 నాటికి గురుకులంలో రిపోర్టు చేయాలని సూచించినా... ఆదివారం సాయంత్రానికి చాలా పాఠశాలల్లో విద్యార్థులు రాలేదు.రవాణా సమస్యలే దీనికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో బోధన, అభ్యసన పట్ల శ్రద్ధ తగ్గకుండా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించాయి.

ప్రతిరోజు స్పెషల్‌ క్లాసులు...
నవంబర్‌ మొదటి వారం నుంచి 8, 9, 10 తరగతులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఒకే సబ్జెక్టుపైన ఉదయం పూట బోధన, సాయంత్రం పూట అభ్యసన, సందేహాల నివృత్తితో పాటు పరీక్షను నిర్వహిస్తారు. ఇలా వారంలో అన్ని సబ్జెక్టులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుని, విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు.

ప్రతి ఆదివారం విద్యార్థుల సామర్థ్యంపై ఉపాధ్యాయులు విశ్లేషించి, తక్కువ సామర్థ్యం ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇలాంటి వారు ఎక్కు వ మంది ఉంటే ఒక బృందంగా ఏర్పాటు చేసి ప్రత్యేక బోధన తరగతులు నిర్వహించి, సామర్థ్యాన్ని మెరుగుపర్చేలా వివిధ రకాల కార్యక్రమాలు చేపడతారు. ఈ ప్రణాళికకు అదనంగా పదో తరగతికి మరో కార్యాచరణ అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఆర్సీలకు నివేదికలు...
పాఠశాల వారీగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసిన తర్వాత ఆ వివరాలను రీజినల్‌ కో–ఆర్డినేటర్ల(ఆర్సీ)కు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి నిర్దేశిత ప్రొఫార్మాలను గురుకుల సొసైటీ తయారు చేసి ప్రిన్సిపాళ్లకు పంపింది. దాని ఆధారంగా వివరాలను ఆన్‌లైన్‌లో ఆర్సీలకు సమర్పిస్తే వాటిని క్రోడీకరించి సొసైటీ కార్యాలయానికి పంపిస్తారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నివేదికలను సొసైటీ కార్యాలయాల్లో విశ్లేషించి, తదుపరి కార్యాచరణను రూపొందిస్తారు.

మరిన్ని వార్తలు