కొలువులపై టెక్నాలజీ దెబ్బ

9 Aug, 2018 09:18 IST|Sakshi

ఏఐ ప్రవేశంతో ఉత్పత్తి ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు

రోజురోజుకు మారిపోతూ అత్యంత క్లిష్టంగా మారుతున్న జాబ్‌ మార్కెట్‌

ఆటోమేషన్‌కు జై అంటూ ఉద్యోగులను తగ్గించుకుంటున్న కంపెనీలు

నిరంతరం నేర్చుకుంటేనే మనుగడ అంటున్న నిపుణులు

గతమంతా ఘనం.. భవిష్యత్‌ అంతా గందరగోళం అన్నట్లు..! ఒక్కసారి గతంలో ఉద్యోగాలు ఎలా ఉండేవో గుర్తుకు తెచ్చుకోండి. ఉద్యోగాలకు భద్రత ఉండేది. కొంత అనుభవం సంపాదిస్తే.. ప్రమోషన్‌ గ్యారెంటీ..! అనే నమ్మకంఉండేది. జీతం తక్కువైనా ఖర్చులు తక్కువకాబట్టి ఆదాయ భద్రత ఎక్కువగా ఉండేది.ఇప్పుడు ప్రపంచం వేగంగా మారిపోతోంది. ఈరోజున్న జాబ్‌ రేపు ఉంటుందన్న గ్యారెంటీలేదు. ప్రస్తుతం మీకు ఎంత టాలెంట్‌ ఉన్నా.. మీనైపుణ్యాలను మెరుగుపరచుకోకుంటే మూడేళ్లతర్వాత మీ ఉద్యోగం ఊడినట్లే..! అంటున్నారునిపుణులు. ఎందుకంటే.. ప్రతి మూడేళ్లకోసారిటెక్నాలజీ సమూలంగా మారిపోతుండటమే! ఓతాజా నివేదిక ప్రకారం భారత జాబ్‌మార్కెట్లోనియామకాల పరిస్థితి గతంలో ఎన్నడూలేనంత అస్థిరంగా మారింది. ఈ నేపథ్యంలోజాబ్‌ మార్కెట్‌లో తాజా హైరింగ్‌ ట్రెండ్స్‌ ఎలాఉన్నాయి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగంసొంతం కావాలన్నా.. కొలువులో మనుగడసాగించాలన్నా.. ఏం చేయాలోతెలుసుకుందాం...

సాక్షి భవిత, జాబ్‌  ట్రెండ్స్‌ :టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ), డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కారణంగా టెక్నాలజీ రంగంలో రాకెట్‌ వేగంతో మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), ఆటోమేషన్‌ విస్తరణ కారణంగా... ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వాణిజ్యం రంగంలో, ఉత్పత్తి ప్రక్రియలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. కంపెనీలు వ్యయ నియంత్రణలో భాగంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. దాంతో గతంలో ఏ పదేళ్లకో మార్పులకు లోనయ్యే జాబ్‌ మార్కెట్‌.. ఇప్పుడు మూడేళ్లకే పూర్తిగా మారిపోతోంది. కాబట్టి ఈ టెక్నాలజీని ఎంత సమర్థంగా అందిపుచ్చుకోగలరు అనే దానిపైనే మీ కెరీర్‌ గమనం ఆధారపడి ఉంటుందని నిపుణులు  స్పష్టం చేస్తున్నారు

టెక్నాలజీ నేటి మంత్రం
కంపెనీలు ఆన్‌లైన్‌ కస్టమర్స్‌తో మాట్లాడేందుకు చాట్‌ బోట్స్‌ను ఉపయోగిస్తున్నాయి. దాంతో ఇంతకాలం కస్టమర్‌ సర్వీస్, కాల్‌ సెంటర్స్‌లో ఈ పనిచేసిన సిబ్బంది అవసరం లేకుండా పోయింది. అంతేకాదు ఉదాహరణకు ఐబీఎం వాట్సన్‌ కంప్యూటర్‌లో నిక్షిప్తిమైన రోగిæ.. రోగ చరిత్రనంతా స్కాన్‌ చేసి అత్యంత కచ్చితత్వంతో రోగాన్ని విశ్లేషించి.. వ్యాధి నివారణకు ఏం చేయాలో సలహా ఇస్తుంది. తద్వారా సంబంధిత నిపుణుల పాత్ర నామమాత్రంగా మారుతోంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్‌ నుంచి సేవల రంగం వరకూ.. టెక్నాలజీ సాయంతో గతంలో ఒక పని పూర్తిచేసేందుకు నాలుగు గంటల సమయం అవసరమైతే.. ఇప్పుడు ఆ పని క్షణాల్లో పూర్తి కచ్చితత్వంతో పూర్తవుతోంది. తద్వారా కంపెనీలకు ఖర్చు తగ్గ డంతోపాటు తక్కువ సమయంలోనే ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతోంది. అందుకే కంపెనీలు మానవ వనురులపై ఆధారపడటం తగ్గించేస్తున్నాయి.

నైపుణ్యం
ప్రస్తుతమున్న నైపుణ్యాలనే పట్టుకొని కూర్చుంటే.. మీరు రోడ్డునపడటం ఖాయమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. మార్పు నేటి తారకమంత్రం కాబట్టి! ఉదాహరణకు.. గతంలో బుక్‌కీపింగ్‌ తెలిసుంటే చాలు.. అకౌంటెంట్‌ ఉద్యోగం ఖాయంగాలభించేది, జీవిత కాలంపాటు కొనసాగేది. కొన్నేళ్ల క్రితమే బుక్‌కీపింగ్‌ స్థానంలో.. అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ వచ్చి చేరింది. ఆ సమయంలో అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యం లేనివారందరూ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇదే అకౌంటింగ్‌ జాబ్స్‌పై కొద్దికాలం క్రితం అమల్లోకి వచ్చిన జీఎస్‌టీ పెద్ద దెబ్బ కొట్టింది. జీఎస్‌టీ వచ్చాక ఈ అకౌంటెంట్స్‌పై ఆధార పడటం తగ్గిపోయింది. అంటే.. ప్రస్తుతం అమలుచేసిన జీఎస్‌టీ కారణంగా మారిన కంపెనీల అవసరాలకు తగ్గట్లు కొత్త నైపుణ్యాలున్న వారికే జాబ్‌ మార్కెట్‌లో అవకాశం లభిస్తుంది.

నాలెడ్జ్‌
ఇప్పుడు మీరు సంపాదించిన నాలెడ్జ్‌ ఒక్క ఏడాది కళ్లు మూసుకుంటే ఎందుకూ కొరగాకుండా పోతుందంటే నమ్ముతారా..! నమ్మాలంటున్నారు మేధావులు. దీనికి కూడా టెక్నాలజీ విప్లవమే కారణం!! అంతేకాకుండా ఒక డాక్టర్, ఒక లాయర్, ఇంజనీర్‌ అందించే సేవల నాణ్యత.. ఆ సేవలకు ఎంత చెల్లించొచ్చో డేటా అనలిటిక్స్‌ వంటి వాటి ద్వారా క్షణాల్లో అంచనాకు వస్తున్నాయి కంపెనీలు. దాంతో సంస్థలు ఇస్తున్న వేతనానికి ఉద్యోగుల నాలెడ్జ్‌ స్థాయి, పనితీరు ఏమాత్రం తగ్గినా.. పింక్‌ స్లిప్‌ వెలాడుతున్నట్లే! మరోవైపు తక్కువ వేతనానికి నాణ్యమైన పనితీరు చూపే యువత అందుబాటులో ఉంటే.. సీనియర్‌ నిపుణులకు భారీ జీతాలు చెల్లించడం భారమని కంపెనీలు భావిస్తున్నాయి. ఫలితంగానే పింక్‌ స్లిప్‌ల పరంపర మొదలవుతోందని చెబుతున్నారు. ఇటీవలే ఓ ప్రముఖ ఐటీ కంపెనీ 1000 మంది సీనియర్‌ ఉద్యోగులను ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అందుకు సదరు సీనియర్‌ ఉద్యోగులు టెక్నాలజీ పరంగా అప్‌డేట్‌ కాకపోవడం ఒక కారణమైతే.. వారికి జీతాలు భారీగా ఉండటం మరో కారణమట! కాబట్టి ఉద్యోగులు ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నాలెడ్జ్‌ పెంచుకుంటూæ... మంచి ఫలితాలు చూపితేనే కెరీర్‌లో మనుగడ సాధ్యమవుతుంది.

నిరంతర అధ్యయనం
స్టే క్యూరియస్, స్టే హంగ్రీ.. అనేది నేటి కెరీర్‌ మంత్రం. ప్రస్తుత   నైపుణ్యాలు జాబ్‌ మార్కెట్‌కు పనికిరాకుండాపోతే.. ఇక ముందున్న ఏకైక మార్గం.. కొత్త స్కిల్స్‌ను వేగంగా నేర్చుకోవడమే! ఇందుకోసం ఆయా అంశాలపై ఆసక్తి పెంచుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకోవాలి. నిత్య విద్యార్థిలా మారి.. మూక్స్‌ వంటి ఆన్‌లైన్‌ విధానాల ద్వారా అప్‌డేట్‌ కావాలి. నేర్చుకున్నది ఎప్పటికీ వృథా కాదు. నిరంతరం నేర్చుకుంటూ.. సమస్యలను పరిష్కరిస్తూ ఉత్పత్తి పెంచుతున్న ఉద్యోగిని వదులుకోవాలని ఏ కంపెనీ కోరుకోదు.  కాబట్టి ఫ్రెషర్స్‌తోపాటు సీనియర్‌ ఉద్యోగులు కూడా కెరీర్‌ పరంగా, టెక్నాలజీ పరంగా తాము నేర్చుకోవాల్సిన టెక్నాలజీని, నైపుణ్యాలను సమీక్షించుకోవాలి.  గత వారంలో, గత నెలలో ఎలాంటి పనితీరు ప్రదర్శించాం.. ఏఏ కొత్త విషయాలు నేర్చుకున్నాం.. కొత్తగా వస్తున్న టెక్నాలజీ ఏంటి.. ఆ టెక్నాలజీ గురించి మనం ఏం నేర్చుకున్నాం.. నేర్చుకున్న టెక్నాలజీని మన కంపెనీ ప్రొడక్టివిటీ పెంచడంలో ఏమేరకు అన్వయించాం.. ఇలా ప్రతి ఒక్కరూ సమీక్షించుకుంటూ... ఉద్యోగ మనుగడ సాధించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా చేస్తే మేలు
నిరంతరం తమ సామర్థ్యాలను సమీక్షించుకుంటూ.. నైపుణ్యాలు మెరుగుపరచుకుంటూ.. టెక్నాలజీని నేర్చుకుంటూ ముందుకు సాగాలి.
జాబ్‌  మార్కెట్‌కు ఉపయోగపడే  స్కిల్స్‌ నేర్చుకోవడంతోపాటు, ప్రత్యామ్నాయ కెరీర్‌ గురించి ఆలోచిస్తుండాలి.
ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ద్వారా నేర్చుకునే తపన, పనిచేసే సామర్థ్యం పెంచుకోవాలి.
నిపుణుల ప్రసంగాలు వినడం, మంచి పుస్తకాలు చదడం, మనసును చురుగ్గా ఉంచుకోవడం ద్వారా అవుట్‌డేట్‌ ప్రమాదం నుంచి బయటపడొచ్చు.
మనం పనిచేయడమేకాకుండా... తోటి ఉద్యోగులు తమ శక్తిసామర్థ్యాలు పెంచుకొని మరింత బాగా పనిచేసేలా ప్రోత్సహిస్తుండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి.

మరిన్ని వార్తలు