ఉపాధ్యాయ కెరీర్‌కు తొలి మెట్టు.. సీటెట్

23 Jul, 2014 23:31 IST|Sakshi
ఉపాధ్యాయ కెరీర్‌కు తొలి మెట్టు.. సీటెట్

 విద్యాహక్కు చట్టం ప్రకారం.. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే వారు కొన్ని నిర్దేశిత ప్రమాణాలను అందుకోవాల్సిఉంటుంది.. దేశంలో ఉపాధ్యాయ విద్యను పర్యవేక్షించే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) కూడా ఆ మేరకు మార్గదర్శకాలను రూపొందించింది.. ఈ క్రమంలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అమల్లోకి వచ్చింది.. దీన్ని రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో నిర్వహిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన సీబీఎస్‌ఈ సీటెట్ (సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్ వివరాలు.. సెంట్రల్ స్కూల్స్‌లో ఉపాధ్యాయులుగా కెరీర్‌గా ప్రారంభించాలనుకునే వారు సీటెట్ (సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్షను సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) నిర్వహిస్తుంది.
 
 రెండు పేపర్లుగా:
 సీటెట్ రెండు పేపర్లుగా ఉంటుంది. అవి..
 పేపర్-1:1 నుంచి 5 తరగతులకు ఉద్దేశించింది. అంటే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాలనుకునే వారు ఈ పేపర్‌కు హాజరు కావాలి.
 
 అర్హత: 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/తత్సమానంతోపాటు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (ఈ కోర్సును ఏ పేరుతో వ్యవహరించినా) లో ఉత్తీర్ణత. లేదా 45 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/ తత్సమానంతోపాటు రెండేళ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/ తత్సమానంతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఐఈడీ) ఉత్తీర్ణత/చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/తత్సమానంతోపాటు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా గ్రాడ్యుయేషన్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు.పేపర్-2:6 నుంచి 8 తరగతులకు ఉద్దేశించింది. అంటే ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాలనుకునే వారు ఈ పేపర్‌కు హాజరు కావాలి.
 
 అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ పూర్తి చేసిన/ చదువుతున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/ తత్సమానంతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఐఈడీ) ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువు తున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/ తత్సమానంతోపాటు బీఏ/ బీఎస్సీ బీఈడీ/ బీఏఎడ్/ బీఎస్సీఎడ్ ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువు తున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) చదువుతున్న విద్యార్థులు.
 
 పరీక్ష విధానం:
 పరీక్షను మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటుంది. సమాధానాలను గుర్తించడానికి 150 నిమిషాల సమయం కేటాయించారు. వివరాలు..
 
 పేపర్-1
 అంశం     పశ్నలు    మార్కులు
 చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగీ    30    30
 లాంగ్వేజ్-1    30    30
 లాంగ్వేజ్-2    30    30
 మ్యాథమెటిక్స్    30    30
 ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్    30    30
 మొత్తం    150    150
 
 పేపర్-2
 అంశం     పశ్నలు     మార్కులు
 చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగీ    30    30
 లాంగ్వేజ్-1    30    30
 లాంగ్వేజ్-2     30    30
 ఎంచుకున్న సబ్జెక్ట్    60    60
 మొత్తం    150    150
 
 ఎంచుకున్న సబ్జెక్ట్‌లో మ్యాథమెటిక్స్, సైన్స్ అభ్యర్థులకు మ్యాథమెటిక్స్, సైన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్‌ల నుంచి 30 ప్రశ్నలు చొప్పున ఇస్తారు. సోషల్ స్టడీస్ అభ్యర్థులకు మాత్రం ఆ సబ్జెక్ట్ నుంచే ప్రశ్నలు అడుగుతారు.
 
 ప్రయోజనం:
 పరీక్షలో 60 శాతం కంటే ఎక్కువ స్కోర్ సాధించిన వారికి అర్హత సర్టిఫికెట్ ఇస్తారు. సీటెట్ స్కోర్ ఫలితాలు విడుదల చేసిన తేదీ నుంచి ఏడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.
 
 సీటెట్‌లో అర్హత సాధిస్తే కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు (కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, సెంట్రల్ టిబెటన్ స్కూల్స్ తదితర పాఠశాలలు), చండీగఢ్, దాద్రా-నగర్ హవేలీ, డయ్యూడామన్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లోని పాఠశాలలు, నేషనల్ క్యాపిటల్ టెరీటరీ న్యూఢిల్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు/స్థానిక సంస్థల నిర్వహణలో ఉన్న పాఠశాలల్లోని ఉపాధ్యాయ పోస్టుల నియామకం కోసం సీటెట్ అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
 
 నోటిఫికేషన్ సమాచారం:
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 4, 2014.
 పరీక్ష తేదీ: సెప్టెంబర్ 21, 2014.
 వివరాలకు: http://ctet.nic.in/
 
 ప్రిపరేషన్
 సీటెట్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టెట్ మాదిరిగానే ఉంటుంది. కానీ టెట్‌తో పోల్చితే ప్రశ్నలు క్లిష్టంగా ఉంటాయి. ప్రశ్నలు ఇంగ్లిష్/హిందీ మాధ్యమంలో అడుగుతారు. కాబట్టి సంబంధిత సబ్జెక్ట్‌ల పదజాలంపై పట్టు ఉంటే మంచి స్కోర్ సాధించవచ్చు.సైకాలజీని అభ్యసనం చేసేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు-సూత్రాలు, వాటిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర అంశాలను విశ్లేషణాత్మకంగా, సమన్వయం చేస్తూ చదవాలి. కీలకాంశాలైన శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం- నాయకత్వం- మార్గనిర్దేశకత్వం- మంత్రణం (కౌన్సెలింగ్)లను గత ప్రశ్నపత్రాల ఆధారంగా సిలబస్‌ను అనుసరించి విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.లాంగ్వేజ్ విభాగంలో గ్రామర్‌కు సంబంధించి ప్రతి అంశాన్ని పరీక్షిస్తూ.. ప్రశ్నలు అడుగుతారు. ఈ నేపథ్యంలో.. బేసిక్ గ్రామర్ మీద పట్టు చాలా అవసరం. ఈ క్రమంలో.. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రొవెర్బ్స్, కొశ్చన్స్ ట్యాగ్స్, యాక్టివ్ వాయిస్-ప్యాసివ్ వాయిస్, కాంప్రెహెన్షన్, ఫొనెటిక్స్, లెటర్ రైటింగ్, సింపుల్- కాంపౌండ్- కాంప్లెక్స్ సెంటెన్సెస్.. ఇలా గ్రామర్‌కు సంబంధించి ప్రతి అంశాన్ని ఔపోసన పట్టాలి.
 
 సబ్జెక్ట్‌ల విషయానికొస్తే.. ఎన్‌సీఆర్‌టీఈ పుస్తకాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. వీటిని అప్లికేషన్ పద్ధతిలో అడుగుతారు. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించి ప్రాథమిక భావనలపై పట్టు ఉండాలి. పాఠ్యాంశాల చివరన ఇచ్చే ప్రాక్టీస్ బిట్స్ చదవాలి. కంటెంట్ చదివేటప్పుడు.. ఏదైనా ఒక అంశం 3, 4, 5 తరగతి పుస్తకాల్లో ఉండి.. 6, 7, 8, 9, 10 తరగతి పుస్తకాల్లో పునరావృతమైతే.. ఆ అంశాలన్నింటినీ ఒకేసారి చదవడం వల్ల సమన్వయం ఏర్పడుతుంది. తమ నేపథ్యానికి చెందని పాఠ్యాంశాలు (అంటే.. బయాలజీ వాళ్లు గణితం చదవడం, తెలుగు, ఇంగ్లిష్ అభ్యర్థులు సోషల్ స్టడీస్ చదవడం) చదివేటప్పుడు కొంత ఇబ్బందికి గురవడం సహజం. కాబట్టి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠ్యాంశాల విషయంలో సిలబస్‌ను అనుసరిస్తూ.. ప్రతి పాఠ్యాంశం వెనుక ఇచ్చిన బిట్స్‌ను ఔపోసన పడితే సులభంగానే ఈ సమస్యను అధిగమించొచుెు్చథడాలజీ విషయంలో మెథడ్స్ ఆఫ్ టీచింగ్, ఎవాల్యుయేషన్, ల్యాబ్, రిలేషన్ టు అదర్ సబ్జెక్ట్స్, టీచర్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్‌ఎం), రీసెంట్ ట్రెండ్స్(ఇటీవలి కాలంలో విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు/పథకాలు), డెవలప్‌మెంట్ ఆఫ్ కరికుల్యం వంటివి ప్రధాన అంశాలు.
 

మరిన్ని వార్తలు