బాలయ్యకు కోపం వచ్చింది!

27 Apr, 2014 18:23 IST|Sakshi
బాలయ్యకు కోపం వచ్చింది - కాలితో తన్నారు!

హిందూపురం: సినిమా హీరో నందమూరి బాలకృష్ణకు కోపం వచ్చింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానన్న విషయం కూడా మరిచిపోయి ఆగ్రహంతో రెచ్చిపోయారు. ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తున్న విషయం మరచిపోయారు. జనం చూస్తుండగానే తన అసిస్టెంట్ను కాలితో తన్నారు. బాలకృష్ణ హిందూపురం శాసనసభ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా ఆయన గ్రామగ్రామాన రోడ్డు షో నిర్వహిస్తున్నారు. అయితే ఆయన షోలకు  జనం పలచగా హాజరవుతున్నారు. దాంతో ఆయన మంచి కాకమీద ఉన్నారు. సినిమా సీన్ చూపించారు.

లేపాక్షి మండలం సిరివరం గ్రామంలో రోడ్డుషో నిర్వహించే  సమయంలో పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు బాలకృష్ణ కారు ఎక్కడానికి వచ్చారు. బాలకృష్ణ అసిస్టెంట్ అతనిని కారులో ఎక్కడానికి అనుమతించారు. కారు తలుపు కూడా తెరిచాడు. కారుపై కూర్చున్న బాలకృష్ణ అందుకు నిరాకరించారు. రంగనాయకులుని తన కారులోకి ఎక్కవద్దని హుకుం జారీ చేశారు. కారు తలుపు తెరిచినందుకు  తన అసిస్టెంట్ను అందరూ చూస్తుండగానే కాలితో తన్నారు.

ఈ సంఘటనతో రంగనాయకులు చిన్నబుచ్చుకున్నారు. ఈ సంఘటన ప్రజల మధ్యలో జరినందున అందరికీ తెలిసింది. బయటకు తెలియని ఇటువంటి అనేక సంఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు