ప్రాతినిధ్యం పెరగాలి.. ముస్లింలకు పాకిస్తాన్

24 Apr, 2014 00:55 IST|Sakshi
ప్రాతినిధ్యం పెరగాలి.. ముస్లింలకు పాకిస్తాన్

* తెలంగాణ ముస్లింల డిమాండ్
* ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలి


తెలంగాణలో ముస్లింల స్థితిగతులు, సామాజికంగా, రాజకీయంగా వారికున్న అవకాశాలు, ఆకాంక్షలు తదితరాలపై మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో జేఎన్‌యూ సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అజయ్ గుడవర్తి ఒక సర్వే నిర్వహించారు. ముస్లిం సంస్థల నేతలతోపాటు లాయర్లు, రాజకీయ నాయకులు, డాక్టర్లు, జర్నలిస్టులు, వ్యాపారులు, మధ్య తరగతికి చెందిన వారు... ఇలా అన్ని రంగాలకు చెందిన ముస్లింల నుంచి అభిప్రాయాలు సేకరించి నివేదిక రూపొందించారు. దాని ముఖ్యాంశాలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం...
 
 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ముస్లింల జనాభా 12.5 శాతం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థాయి మెరుగవుతుందా? లేక ఇంకా దిగజారుతుందా? ఇది ప్రస్తుతం కీల కాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ ముస్లింల అభిప్రాయం ఏమిటి? తెలంగాణ ఉద్యమంలో వారు చురుగ్గా పాల్గొన్నారా? తటస్థంగా ఉన్నారా? లేక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారా? ఉద్యమ సమయంలో తెలంగాణలో మత ప్రాతిపదికన చీలిక ఏర్పడిందా? లేక మరింత లౌకికత్వాన్ని సంతరించుకుందా? ‘సామాజిక తెలంగాణ’లో ముస్లింలకు స్థానముందా? తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం ల ప్రాబల్యం పెరుగుతుందని హిందువులు భయపడుతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో జరిపిన ఒక సర్వేలో కొన్ని వాస్తవాలు వెల్లడయ్యాయి. వాటి వివరాలు...
 
 మా సీట్లు మాకే
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరవాత కేంద్రీకృత ముస్లిం జనాభా కారణంగా హిందూ ముస్లింల మధ్య చీలిక మరింత ప్రస్ఫుటమయింది. ప్రత్యేక రాష్ట్రంలో ముస్లింలు కోరుకుంటున్న సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను, రాజకీయ ప్రాతినిధ్యాన్ని హిందువులు దురాక్రమణపూరిత వైఖరిగా భావిస్తున్నారు. తమ వర్గం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ రాజకీయ ప్రాతినిధ్యం పెరగడమొక్కటే పరిష్కారమని ముస్లింలు భావిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. తమ జనాభా అధికంగా ఉన్న చోట పార్టీలు తమకే టికెట్లు కేటాయించాలని ముస్లింలు కోరుతున్నారు. తద్వారా ఆ స్థానాల్లో తమ అభ్యర్థినే గెలిపించుకుని చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలన్న ఆలోచనలో ముస్లింలున్నారు. అయితే, దీన్ని మతం ప్రాతిపదికన ఓట్లను సమీకరించడంగా, ఓటుబ్యాంకు రాజకీయంగా హిందువులు భావిస్తున్నారు.
 
 నిజాం అనంతరం పేదరికంలోకి

 హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం చెందిన సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా, నిజాం రాజును కర్కోటకుడిగా బీజేపీ పేర్కొంటోంది. దీన్ని తెలంగాణ లోని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా ఆసుపత్రి సహా ఎన్నో నిర్మాణాలు నిజాంల హయాంలోనే జరిగాయని, ఎంతోమంది హిందువులకు భూములనిచ్చి నిజాం వారిని దేశ్‌ముఖ్‌లను చేశారని వారు వాదిస్తున్నారు. ఏ రాజైనా భూస్వామ్య మనస్తత్వమే కలిగి ఉంటాడని, ముస్లిం కావడం వల్లనే నిజాం రాజును నియంతగా ప్రచారం చేస్తున్నారన్నది వారి వాదన. నిజాం పాలన తరువాత ఉర్దూను అధికార భాషగా తొలగించడం వల్ల ఆధునిక విద్యకు ముస్లింలు దూరమయ్యారు. దాంతో 1950లో ప్రభుత్వోద్యోగాల్లో ముస్లింలు 40% ఉండగా, 2010 నాటికి అది 5 శాతానికి చేరింది.
 
 అప్పుడు వారికి 35% భూములుండగా, ప్రస్తుతం అది 4 శాతానికి పడిపోయింది. పోలీస్ చర్య అనంతరం గ్రామాల్లోని ముస్లింలను వెళ్లగొట్టి వారి భూములను అక్కడి వెలమ, రెడ్డి కులస్తులు తీసేసుకున్నారు. ప్రస్తుతం 70% పైగా ముస్లింలు నగరాల్లో, చిన్నచిన్న పట్టణాల్లో మెకానిక్‌లుగా, టైలర్లుగా, డ్రైవర్లుగా జీవనం వెళ్లదీస్తున్నారు.
 
 ఉద్యమంపై భిన్న కోణాలు
 తెలంగాణ ఉద్యమం ప్రధానంగా భూమికి, నీటికి, వ్యవసాయ సంక్షోభానికి సంబంధించినది కావడంతో వ్యవసాయ భూములు లేని ముస్లింలను అది ఆకర్షించలేకపోయింది. తెలంగాణ ఉద్యమంలోగ్రామాల్లోని ముస్లింలు తటస్థంగా ఉండటమో లేక నిశ్శబ్దంగా మద్దతు ప్రకటించడమో చేశారు. పట్టణాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న ముస్లింలు ఉద్యమంపై నిరాసక్తత చూపారు. మధ్యతరగతి ముస్లింలు, ముస్లిం లాయర్లు, టీచర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉద్యమాన్ని ప్రోత్సహించారు. అందులో పాల్గొన్నారు.
 
  హైదరాబాద్‌లో నివసించే ముస్లింలు, జిల్లాల్లో ఎంఐఎం పార్టీకి మద్దతిచ్చేవారు మాత్రం తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించారు. అయితే తెలంగాణ ఉద్యమంలో ముస్లింలు చురుగ్గా పాల్గొనలేదన్న భావన హిందువుల్లో బలంగా ఉంది. ఉర్దూను అధికార భాషగా తొలగించిన తరువాత ముస్లింలు మిగతా సమాజంతో కలిసేందుకు ఇష్టపడలేదని, ఆధునిక విద్యపై ఆసక్తి చూపలేదని, అందువల్లనే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించలేకపోయారని, అంతేగానీ వారిపై వివక్ష ఎన్నడూ లేదని వారు వాదిస్తున్నారు.
 
ముస్లింలే దేశభక్తులు:  ‘దేశ విభజన సమయంలో హిందువులకు భారత్‌లో ఉండటం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. కానీ ముస్లింలకు పాకిస్తాన్ అనే ప్రత్యామ్నాయం ఉంది. అయినా, ముస్లింలు భారత్‌లో ఉండేందుకే నిర్ణయించుకున్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరిది నిజమైన దేశభక్తో?’ అని ఎంఐఎం మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు హబ్దుల్ హజీమ్ ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంతంలో ప్రాంతీయతత్వం ఉంటే తెలంగాణలో మతతత్వం ఉందని నల్గొండకు చెందిన అనీస్ ముఖ్తాదార్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో ముస్లింలు అక్కడి సమాజంతో మమేకమయ్యారని, వెనకబాటుతనం కారణంగా తెలంగాణలో వారికి మిగతా సమాజంతో దూరం పెరిగిందని అనీస్ అభిప్రాయపడ్డారు.
 
 ఆంధ్రలో అస్తిత్వం కోల్పోయారు
 ఈ అభిప్రాయంతో టీ జేఏసీ చైర్మన్ కోదండరాం విభేదిస్తున్నారు. ముస్లింలు ఆంధ్ర ప్రాంతంలో తమ భాష అయిన ఉర్దూ సహా తమ అస్తిత్వాన్ని, తమ ప్రత్యేకతను కోల్పోయారని, అందుకే అక్కడి సమాజంలో కలిసిపోగలిగారని వివరించారు. ‘ఇక్కడలా కాదు. వారి అస్తిత్వం ఇక్కడ బలంగా ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వల్ల ముస్లింలకు తమ గొంతుకను వినిపించే అవకాశం కలిగింది, వారితో చర్చలకు ఆస్కారం ఏర్పడింది. ఉద్యమంలోనూ వారు చురుగ్గా పాల్గొన్నారు’ అన్నారు.
 
 ఓట్లకు మతం రంగు
 మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి 2011లో జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ఈ హిందూ-ముస్లిం మధ్య ఓట్ల చీలిక స్పష్టంగా కనిపించింది. ఒక వర్గం ఓట్లను తమవైపుకు ఆకర్షించుకోవడం కోసం మత కలహాలు సృష్టించే ప్రయత్నాలు కూడా అప్పుడు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. లౌకికవాదం పఠించే తెలంగాణ జేఏసీ కూడా ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిందని ముస్లింలు గుర్తు చేస్తున్నారు.
 
 తెలంగాణ ముస్లింలు, రాజకీయ పార్టీలు
 తెలంగాణ విషయంలో విరుద్ధ అభిప్రాయాలు కలిగిన రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సమ్మిళిత అభివృద్ధి మంత్రం పఠిస్తున్నాయి. అయితే, రాజకీయ ప్రాతినిధ్యమే తమ సమస్యలకు పరిష్కారమని ముస్లింలు నమ్ముతుండగా, పార్టీలు మాత్రం టికెటిచ్చేందుకు గెలుపు అవకాశాలనే ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. ముస్లిం వ్యక్తికి టికెటిస్తే ఆ నియోజకవర్గంలోని హిందూ ఓట్లకు దూరమవుతామన్న భయం పార్టీల్లో నెలకొని ఉంది. ముస్లింలకు టికెటిస్తే వారు గెలవలేరని, ఈ ఎన్నికల్లో ముస్లింలెవరికీ టికెటివ్వబోమని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గతంలో ప్రకటించారు. ముస్లింను ఉప ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ నుంచి కూడా ఆయన వెనక్కు తగ్గారు. అయితే కేసీఆర్‌ను మతవాదిగా ఇక్కడి ముస్లింలు భావించడం లేదు. ఒక్క బీజేపీనే కాదు, ముస్లింలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వని పార్టీలన్నీ మతవాద పార్టీలేనని ఎల్జేపీ నేత షహదత్ అలీ వ్యాఖ్యానించారు.
 
 తెలంగాణ ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించిన పార్టీల్లో ఎంఐఎం ఒకటి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల సంఘ్ పరివార్ శక్తులు బలోపేతమవుతాయని ఎంఐఎం భావిస్తోంది. అయితే, ఆంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలతో భూ వ్యవహారాలు, వ్యాపార సంబంధాలు ఉండటం వల్లనే ఎంఐఎం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిందని ఉర్దూ దినపత్రిక సియాసత్ ఎడిటర్ ఆరోపిస్తున్నారు.

- అజయ్ గుడవర్తి,
 సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్
 జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ

మరిన్ని వార్తలు