తోక లేని రామ సైనికుడితో తలనొప్పి

29 Mar, 2014 11:43 IST|Sakshi
తోక లేని రామ సైనికుడితో తలనొప్పి

నిన్నటి దాకా నరేంద్ర మోడీని ప్రధాని చేయడమే తన లక్ష్యం అని ప్రకటించిన శ్రీరామ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ ఇప్పుడు మోడీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడమే తన ధ్యేయం అంటున్నాడు.  'రా రమ్మని' తలుపులు తీసి, ఆ వెంటనే 'పో పొమ్మని' తలుపులు మూసిన బిజెపికి గుణపాఠం చెబుతానంటున్నాడు ఈ రామ సైనికుడు.


ఇప్పుడు ముతాలిక్ ధార్వాడ్, బెంగుళూరు సౌత్ నుంచి లోకసభకు పోటీ చేయబోతున్నారు. ధార్వాడ్ లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషీ, బెంగుళూరు సౌత్ లో అనంత కుమార్ లు బిజెపి అభ్యర్థులు. వారిద్దరి వల్లే తనకు పార్టీలో చోటు దక్కలేదని, అందుకే వారిద్దరినీ ఓడిస్తానని ముతాలిక్ చెబుతున్నారు.


బెంగుళూరులో పెద్దగా పట్టులేకపోయినా, ముతాలిక్ ధార్వాడ్ లో బిజెపిని డామేజీ చేసే అవకాశాలున్నాయి. ధార్వాడ్ లో అతివాద హిందూ ఓట్లు గణనీయంగా ఉన్నాయి. అవి ముతాలిక్ ఖాతాలోకి వెళ్తే బిజెపి ఓడిపోయే ప్రమాదం ఉంది.


'ఎరక్కపోయి కెలుక్కున్నాము బాబోయ్ ఈ తోకలేని రామసైనికుడిని' అని బిజెపి నేతలు తలలు పట్టుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు