సారథుల సమరం

10 Apr, 2014 00:18 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  ఒకరు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు.. మరొకరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు.. ఇంకొకరు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్.. ఈ ముగ్గురు ఒకే స్థానం నుంచి సార్వత్రిక ఎన్నికల సమరంలోకి దిగితే.. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఇబ్రహీంపట్నంలో నెలకొంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన జిల్లా బాధ్యులు ఇక్కడి నుంచి పోటీ చేయడం ఆసక్తిని రేపుతోంది. ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ ఇప్పటికే భారీ ఎత్తున కార్యకర్తలతో తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు.

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ కూడా అభిమానుల మధ్య నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనుచరగణంతో నామినేషన్ సమర్పించారు. ఈ ముగ్గు రు నేతలు కూడా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన వారే కావడం విశేషం. ప్రధానంగా పోటీ కూడా ఈ ముగ్గురి మధ్యే నెలకొంది. మొత్తంగా పార్టీ జిల్లా సారథులు ముగ్గురూ ఒకే సీటుకోసం పోటీపడుతుండడంతో స్థానికంగా ఆసక్తి కలిగిస్తోంది. అంతిమంగా గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు