బీసీలపై చంద్రబాబుది కపట ప్రేమ: ఎంపీ పొన్నం

25 Mar, 2014 20:29 IST|Sakshi
బీసీలపై చంద్రబాబుది కపట ప్రేమ: ఎంపీ పొన్నం

సిరిసిల్ల: ఎన్నికల ముందు బీసీలపై టీడీపీ అధినేత చంద్రబాబు కపట ప్రేమ చూపుతున్నారని  కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్  విమర్శించారు. తన తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు బీసీలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీసీ వ్యక్తిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తానని అందని ద్రాక్షను చూపిస్తూ చంద్రబాబు మరో మోసానికి ప్రయత్నిస్తున్నారనిఅన్నారు.

ప్రతిపక్ష నేతగా, పార్టీ అధ్యక్షుడిగా రెండు పదవుల్లో కొనసాగిన బాబు ఏనాడైనా బీసీలకు ఒక్క పదవైనా ఇచ్చాడా..? అని ప్రశ్నించారు. బీసీ ఓటర్లను మభ్యపెట్టేందుకు తెలంగాణలో చచ్చిపోయిన టీడీపీకి ఎలాగు సీట్లు రావని తెలిసి సీఎం పదవి ఆశ చూపుతున్నాడని విమర్శించారు. తెలంగాణ జిల్లాల్లో టీడీపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబుకు మద్దతిస్తూ బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్య తన గౌరవాన్ని తగ్గించుకుంటున్నారని అన్నారు.

మరిన్ని వార్తలు