హామీలను నెరవేరుస్తాం : యనమల

18 May, 2014 23:48 IST|Sakshi
హామీలను నెరవేరుస్తాం : యనమల

 కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల ఆశలను, ఆకాంక్షలను సాకారం చేస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. పార్టీ అధికార ప్రతినిధి గన్ని కృష్ణను పరామర్శించేందుకు ఆదివారం రాజమండ్రి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో సీమాంధ్ర ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమేనని, అయినప్పటికీ ప్రణాళికాబద్ధంగా హామీలను నెరవే రుస్తామని పునరుద్ఘాటించారు. అన్ని అంశాలను పరిశీలించాకే హామీలు ఇచ్చామని, ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదన్నారు. రైతు రుణాల మాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, యువతకు ఉపాధి, పింఛను పెంపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అమలు చేస్తామన్నారు.
 
 గన్ని కృష్ణకు పరామర్శ

 అనారోగ్య సమస్యలతో స్వతంత్ర హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న గన్ని కృష్ణను యనమల పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ గన్ని భాస్కరరావు వివరించారు. గన్ని కృష్ణ త్వరగా కోలుకోవాలని యనమల ఆకాంక్షించారు. యనమల వెంట రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, నాయకులు గంగుమళ్ల సత్యనారాయణ, పట్టపగలు వెంకట్రావు, దండుమేను వెంకటసుబ్బారావు, నిమ్మలపూడి గోవింద్, మొల్లి చిన్నియాదవ్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు