ఏలూరును రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం

27 Apr, 2014 01:37 IST|Sakshi
ఏలూరును రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం

 సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని దేశంలోనే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతానని ఆ పార్టీ ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ చెప్పారు. ఇందు కు అవసరమైన ప్రణాళికను ఇప్పటికే రూపొందించామని, తాను ఎంపీగా ఎన్నికైన వెంటనే దానిని అమలు చేస్తానని ప్రకటించారు. శనివారం నగరంలోని పార్టీ కార్యాలయం లో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానితో కలసి లోక్‌సభ నియోజకవర్గ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేనిఫెస్టోను రూపొందించేందుకు జనవరిలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించామని, నియోజకవర్గ పరిధిలోని 750 గ్రామాలకు అభిప్రాయ సేకరణ పత్రాలను పంపించామని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి 30 నుంచి 40 మందితో పూర్తి చేయించామని, మొత్తంగా 1.30 లక్షల మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారని వివరించారు. వాటన్నిటినీ క్రోడీకరించి నియోజకవర్గ అభివృద్ధికి మేనిఫెస్టో రూపొందించామన్నారు. ఎంపీగా గెలి చిన మరుక్షణమే మేనిఫెస్టోను అమలు చేయడమే తన ప్రథమ కర్తవ్యమని చెప్పారు.
 
 మోడల్ సిటీగా ఏలూరు
 ఏలూరు నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని చంద్రశేఖర్ చెప్పా రు. ఐఏఎస్ అధికారిగా ఇప్పటికే పలు నగరాలను అభివృద్ధి చేసిన అనుభవం తనకుందని గుర్తు చేశారు. నగర ప్రజ లకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయా లు కల్పించడంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు అందేలా చేస్తామని తెలి పారు. నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థను నిర్మిస్తామన్నారు. నగరంలో ఆగ్రో ప్రోసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని తెలిపారు. తమ్మిలేరు ముంపునుంచి నగరాన్ని రక్షిస్తామన్నారు. నగరంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతామని, అన్ని సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఉండే అవకాశాల ప్రాతిపదికన ఒక గ్రోత్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. కొల్లేరు అభయారణ్య ప్రాం తాన్ని ఐదో కాంటూరు నుంచి మూడుకు కుదించే అంశంపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తామని తెలిపారు. డెల్టా ఆధునికీకరణ పనులను సత్వరం పూర్తి చేయించి ముంపు బారినుంచి రైతులను కాపాడతామని చెప్పారు.
 
 పెండింగ్ ప్రాజెక్టుల్ని పట్టాలెక్కిస్తాం
 చింతలపూడి, దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాలను పూర్తిచేస్తామని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ నిర్మాణాన్ని సాకా రం చేసి పోలవరం, చింతలపూడి నియోజకవర్గ ప్రజల చిరకాల వాం ఛను నిజం చేస్తామన్నారు. నియోజకవర్గ పరిధిలో ఆక్వా హబ్ ఏర్పాటు చేస్తామని, నూజివీడులో మ్యాంగో మార్కెట్ నెలకొల్పుతామని, జిల్లాలో కొత్త రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని వివరించారు. గ్రామా ల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రజలకు మినరల్ వాటర్‌ను తక్కువ ధరకు ఇస్తామని, ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రయత్నిస్తామని, ఏజెన్సీలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు.
 
 మేనిఫెస్టో హర్షణీయం : ఆళ్ల నాని
 రాష్ట్రంలో ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొం దించిన ఘనత తోట చంద్రశేఖర్‌కే దక్కిందని ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని చెప్పారు. పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్నివర్గాలకు మేలు చేసేవిధంగా మేనిఫెస్టోలోని అంశాలు ఉన్నాయన్నారు. చంద్రశేఖర్ ఎంపీ అభ్యర్థిగా ఇక్కడకు వచ్చినప్పు డు రాజకీయ అనుభవం లేదనుకున్న వారంతా ఆయన పనితీరును చూసి అభిప్రాయాన్ని మార్చుకున్నారని తెలి పారు. మేనిఫెస్టో రూపకల్పన ద్వారా ఆయన వినూత్నంగా ఆలోచిస్తున్నారని అర్థమవుతోందని అన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధులు ఊదరగొండి చంద్రమౌళి, బొద్దాని శ్రీనివాస్, నాయకులు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, తిప్పాని రామ్మోహనరావు, మోర్త రంగారావు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు