ప్రచారం సమాప్తం

29 Apr, 2014 01:34 IST|Sakshi
ప్రచారం సమాప్తం

 కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల సమ రం తుది దశకు చేరుకుంది. సోమవారం సాయంత్రం నాలు గు గంటలకు ప్రచారం ముగి యడంతో వీధులు మూగబోయాయి. పక్షం రోజులుగా మైకులతో హోరెత్తించిన అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రచారం ముగించారు. అన్ని పార్టీల నాయకులు తమ అగ్రనాయకులను రప్పించి ప్రచారం నిర్వహిం చారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు 107 మంది అభ్యర్థులు బరి లో ఉన్నారు. ఒక్కో అసెంబ్లీ స్థానానికి 5 నుంచి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ప్రచారం ఉత్కంఠ రీతిలో కొనసాగింది. దీంతో ప్రచార పోరు రోజుకో తీరుగా గ్రామాల్లో సందడిని నెలకొంది. మొదట్లో పట్టణాల్లో వార్డుల వారీగా తిరుగుతూ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తే, పల్లెల్లో మొబైల్ ప్రచార వాహనాలను ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. ప్రచార పర్వం ముగింపు గడువు దగ్గరపడుతుండడంతో ప్రచారంలో కూడా నువ్వా.. నేనా.. అన్నట్లుగా కొనసాగింది. పల్లె వాకిట్లో గంట గంటకు ఒక ప్రచారం వాహనం వివిధ రకాల పాటలతో హోరేత్తించగా, పట్టణాల్లో వీధులు, వార్డుల గుండా పలువురు అభ్యర్థులు ఒకరిని మించి మరోకరు పోటాపోటీ ప్రచారం నిర్వహించారు.
 
 జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రచార కార్యక్రమాలను పరిశీలిస్తున్న అకౌంటింగ్ టీమ్ అధికారులకు ప్రతినిత్యం ప్రచార ఖర్చులకు సంబంధించిన వివరాలను ఆయా అభ్యర్థుల అభ్యర్థుల ఖాతాల్లో జమ చేశారు. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఖర్చులు కొంత మంది అభ్యర్థులవి ఎన్నికల సంఘం విధించిన దానికంటే ఎక్కువగా కూడా అయినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. అయితే వీరి వివరాలను మరో మూడు రోజుల్లో వెల్లడించనున్నారు. పరిధి దాటిన అభ్యర్థులకు నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసులు జారీ అయినా అభ్యర్థుల ఇచ్చే  సమాధానాలను బట్టి అర్హులా.. అనర్హులా అనేది ఎన్నికల కమిషన్ తేల్చనుంది.
 
 ఉదయం ఏడు నుంచి పోలింగ్
 సాధారణ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. సిర్పూర్, చెన్నూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, మిగతా ఆరు నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. మంగళవారం పోలింగ్ సామగ్రిని కేంద్రాలకు తరలించనున్నారు. ఎన్నికల నిర్వహణకు 24 వేల మంది పోలింగ్ అధికారులు, సిబ్బందిని వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పురుషులు 9,80,897, స్త్రీలు 9,78,561 మంది, ఇతరులు 202 మంది మొత్తం 19,59,660 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు తమ ఓటును 2,318 పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటు వినియోగించుకోనున్నారు. 4,244 మందికి రెండేసి ఓట్లు ఉన్నట్లుగా, 6,985 మంది చనిపోయిన వారిగా, 5078 మంది షిప్టెడ్ ఓటర్లుగా, 1227 మంది అందుబాటులో లేని ఓటర్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు 18 వేల మందికి పోస్టల్ బ్యాలెట్లు అందజేస్తే, 13 వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటును వినియోగించుకోగా, ఇంకా మంగళవారం వరకు సమయం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.1.70 కోట్లు నగదు స్వాధీనం చేసుకోవడంతోపాటు 53 వేల లీటర్ల లిక్కర్ పట్టుబడడంతో మద్యం రవాణాలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
 
 పోలింగ్ కేంద్రాలు.. అధికారులు, సిబ్బంది..
 జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 1670 ప్రాంతాల్లో మొత్తం 2,318 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిర్పూర్‌లో 229, చెన్నూర్‌లో 208, బెల్లంపల్లిలో 195, మంచిర్యాలలో 253, ఆసిఫాబాద్‌లో 258, ఖానాపూర్‌లో 224, ఆదిలాబాద్‌లో 244, బోథ్‌లో 232, నిర్మల్‌లో 225, ముథోల్‌లో 250 మొత్తం 2,318 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సాధారణ పోలింగ్ కేంద్రాలు 1,553, సమస్యాత్మక 282, అత్యంత సమస్యాత్మక 483 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికలకు సుమారు 3 వేల ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 27 మంది సెక్టార్, 27 మంది వరకు రూట్ అధికారులను నియమించారు. వీరితోపాటు 159 మంది ఫ్లయింగ్‌స్వ్కాడ్, 282 మంది స్టాటిక్ సర్వేలెన్స్, 156 మంది మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, 26 మంది వీడియో సర్వే లెన్స్, 44 మంది వీడియో వ్యూయింగ్, 44 మంది అకౌంటింగ్ టీం అధికారులతోపాటు 6,836 మంది అధికారులను 866 గ్రామ పంచాయతీల్లో నియమించారు. 1039 మంది మైక్రో పరిశీలను నియమించారు. 1001 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహణకు 1100 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులను వినియోగించనున్నారు. ఎన్నికల కోసం 5,500 మంది పోలీసులను, 1500 మంది పారామిలటరీ బలగాలను వినియోగించనున్నారు. ఎన్నికలకు 394 ఆర్టీసీ, 155 చిన్న బస్సులను, 138 జీపులను, 19 వ్యాన్లను, రెండు ట్రాక్టర్లు, రెండు టాటా సుమోలను వినియోగించనున్నారు.
 
 ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ అహ్మద్ బాబు
 ఈ నెల 30న జరిగే ఎన్నికలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ అహ్మద్ బాబు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లాలో 19,59,660 మంది ఓటర్లుండగా, ఇప్పటి వరకు 18,95,877 మంది ఓటర్లకు ఫొటో ఓటరు స్లిప్పులు అందజేసి 90 శాతం పోలింగ్ నమోదుకు కృషి చేస్తున్నామన్నారు. పార్లమెంట్ బ్యాలెట్ పేపర్ కలర్ తెలుపులో, అసెంబ్లీ బ్యాలెట్ పేపర్ గులాబీ కలర్‌లో ఉంటుందన్నారు. మొట్టమొదటి సారిగా ఈవీఎంలో నోటా బటన్ పద్ధతి ఉందన్నారు. ప్రతి సెక్టార్ అధికారి వద్ద రెండు ఈవీఎంలను రిజర్వులో ఉంచామని, వెంటనే ఈవీఎంలను రీ-ప్లేస్ చేసేందుకు వినియోగించవచ్చన్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఓటరు సహాయక కేంద్రం ఉంటుందని, 200 మీటర్ల దూరంలో రాజకీయ అభ్యర్థుల ఓటరు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ జరుగుతుందని, సాధారణ పోలింగ్ కేంద్రంలో హెడ్‌కానిస్టేబుల్, హోంగార్డు, సమస్యాత్మక కేంద్రాల్లో ఆర్మీ పోలీసులు, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పారామిలటరీ పోలీసులను వినయోగిస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక హెలిక్యాప్టర్‌ను వినియోగించనున్నట్లు, ఇందుకు జిల్లాలో 11 హెలిప్యాడ్‌ను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను అదేరోజు రాత్రి జిల్లాలో ఏర్పాటు చేసిన 20 స్ట్రాంగ్ రూంలకు చేరుకుంటాయని, స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు, ఈ భద్రత మే 16 వరకు ఉంటుందని తెలిపారు.
 
 ఓటర్లకు కలెక్టర్ సందేశం

 ఈ నెల 30న జరుగనున్న సాధారణ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటేయాలి. జిల్లా ఇంకా ముందుకు వెళ్లాలంటే అది ప్రజలతోనే సాధ్యమవుతుంది. ఓటుతో మంచి నాయకుడిని ఎన్నుకుంటాం. ప్రతి ఒక్కరు ఓటు వేస్తే అది సాధ్యమవుతుంది. అందరు ఓటు వినియోగించుకుంటే బాగుంటుంది.

మరిన్ని వార్తలు