బంగారు తెలంగాణ మాతోనే సాధ్యం: కవిత

28 Mar, 2014 04:55 IST|Sakshi

నిజామాబాద్, న్యూస్‌లైన్: బంగారు తెలంగాణ  టీఆర్‌ఎస్ తోనే సాధ్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇందూరు నగర జయభేరిలో ఆమె మాట్లాడారు. 14 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం పోరాడి రాష్ట్ర ఏర్పాటును సాధించిన కేసీఆర్‌కు సమస్యలను పరిష్కరించడం ఇబ్బంది కాదని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే 2.75లక్షలతో రెండు గదులతో సొంత ఇల్లు, వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ. 1500 పింఛను ఇస్తామని కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు.
 
 రాష్ట్ర పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా ఆంధ్ర పాలకులు దోచుకున్నారని విమర్శించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు వలస పాలకుల పాలనలో తీవ్ర విఘాతం కలిగిందని, వాటిని సరి చేసుకోవాల్సి ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందేనని ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అన్నారు.

మరిన్ని వార్తలు