చలో చలో క్యాంప్

13 May, 2014 03:07 IST|Sakshi

- ఆత్మరక్షణ వ్యూహం
- వల వేసే ఎత్తుగడలు
- రెండు పార్టీల్లో హడావుడి

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : అత్యధిక స్థానాల్లో హంగ్ ఫలితాలతో మేయర్, ఛైర్మన్లను కైవవం చేసుకోవటం ప్రధా న పార్టీలకు తలనొప్పిగా మారనుంది. సొంత సభ్యులను కాపాడుకుంటూనే ఇతరుల మద్దతు కూడగట్టేందుకు వ్యూహరచన చేయటం రెండు పార్టీలకు తప్పనిసరిగా మారింది. ఏమరుపాటుగా ఉంటే బలాబలాలు తారుమారయ్యేలా ఉండటంతో సభ్యుల బేరసారాలు.. రకరకాల ఒప్పందాల ఎత్తులతో పాటు క్యాంపు రాజకీయాలకు నేతలు వెనుకాడటం లేదు. ఇప్పటికే ఛైర్మన్, మేయర్ రేసులో ఉన్న అభ్యర్థులు తమకున్న సభ్యుల బలగాన్ని రహస్య శిబిరాలకు తరలించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

కరీంనగర్ కార్పొరేషన్ నుంచి 24 మంది టీఆర్‌ఎస్ అభ్యర్ధులతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్లు మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. మేయర్ రేసులో ఉన్న అభ్యర్ధి రవీందర్‌సింగ్ ఆధ్వర్యంలో వీరు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా క్యాంపు నిర్వహించే  ఆలోచనలో ఉంది.

- కోరుట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్ధి జువ్వాడి నర్సింగరావు శనివారం రాత్రి 31 మందిని ధర్మపురికి తీసుకెళ్లారు. మరుసటి రోజున తిరిగి వచ్చారు. వీరిలో 13 మంది విజయం సాధించారు.
- మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో ఈ నెల 11న టీఆర్‌ఎస్ అభ్యర్థులు 31 మంది హైదరాబాద్‌కు తీసుకెళ్లి తీసుకొచ్చారు. వీరిలో ఎనిమిది మంది గెలిచారు. ఎంఐఎం ఐదు స్థానాల్లో గెలవడంతో వారితో కలిసి క్యాంపునకు వెళ్లేందు కు టీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేసుకుంటోంది.
- మెట్‌పల్లి మున్సిపాలిటీలో 12 మంది టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇప్పటికే క్యాంపునకు చేరుకున్నారు. పట్టణ అధ్యక్షుడు బర్ల సాయన్న సతీమణి బాగీర్త చైర్‌పర్సన్ అభ్యర్థి రేసులో ఉన్నారు. సాయన్న అధ్వర్యంలో వీరందరూ హైదరాబాద్‌కు వెళ్లినట్లు తెలిసింది.
- హుస్నాబాద్ నగర పంచాయతీని స్పష్టమైన ఆధిక్యంతో కైవశం చేసుకున్న టీఆర్‌ఎస్.. సొంత సభ్యులు చేజారకుండా అప్రమత్తమైంది. చైర్మన్ అభ్యర్థి చంద్రయ్య ఆధ్వర్యంలో 11 మంది సోమవారం రాత్రి హైదరాబాద్  బయల్దేరుతున్నారు.
- హుజూరాబాద్ నగర పంచాయతీ నుంచి 9 మంది టీఆర్‌ఎస్ అభ్యర్థులతో పాటు ఇద్దరు ఇండిపెండెంట్లను సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ క్యాంపునకు తరలించేందుకు సిద్ధమయ్యారు.

మరిన్ని వార్తలు