దేశమంతటా మోడీ హవా:సుధీర్ మునగంటివార్

21 Apr, 2014 23:09 IST|Sakshi

బీజేపీ నేత మునగంటివార్

భివండీ న్యూస్‌లైన్: దేశం నలుమూలలా మోడీ గాలి వీస్తోందని బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సుధీర్ మునగంటివార్ పేర్కొన్నారు. భివండీ లోక్‌సభ నియోజకవర్గం బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పద్మనగర్‌లోని గణేశ్‌టాకీస్ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ‘టోరంట్ పవర్ కంపెనీ దూకుడుకు కళ్లెం పడాలంటే  మోడీ ప్రభుత్వం రావాలి. ఇదే టోరంట్ కంపెనీ గుజరాత్‌లో విద్యుత్‌ను సరఫరా చేస్తుంది. అయితే దాని పప్పులు అక్కడ ఉడకవు’ అని  అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని సోనియా గాంధీ ఆశిస్తున్నారని, అయితే నరేంద్ర మోడీకి మాత్రం భారత్ అభివృద్ధి కావాలని ఆశిస్తున్నారన్నారు.
 
నరేంద్ర మోడీ గత 15 సంవత్సరాల కాలంలో గుజరాతీయులకు ఎనలేని సేవ చేశారన్నారు.  ఇక 125 కోట్ల మందిప్రజలకు సేవలందించేందుకు తహతహలాడుతున్నారన్నారు. ఎవరూ మోడీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు.  రాహుల్ గాంధీకి మంత్రి బాధ్యతలేమిటో తెలియవని, మోడీ 15 సంత్సరాలు రాష్ట్ర ముఖ్య మంత్రి బాధ్యతలను నిర్వర్తించారని, అంతేకాకుండా గుజరాత్ రూపురేఖలు మార్చిన ఘనతను కూడా దక్కించుకున్నాడన్నారు. దీని దృష్టిలో పెట్టుకుని 24న జరగనున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కపిల్ పాటిల్‌కు అమూల్యమైన ఓటేసి గెలిపించిన ట్టయితే భివండీ అభివృద్ధి చెందుతుందన్నారు.
 
ఈ కార్యక్రమంలో శివసేన ఎమ్మెల్యే రూపేష్ మాత్రే,  శ్యామ్‌జీ అగ్రవాల్, పట్టణ శాఖ అధ్యక్షుడు మహేశ్ చౌగులే, స్థానిక కార్పొరేటర్లు మురళీమచ్చ, మధన్ బువా నాయిక్, అఖిల పద్మశాలి సమాజ్ అధ్యక్షుడు కమటం శంకర్, కార్యదర్శి దాసి అంబాదాస్, నిష్కం భైరి, కమటం సుధాకర్, వినోద్ పాటిల్, భీమనాథ్ శివప్రసాద్, కొండ వివేక్, తదితర్లుతో పాటు భారి సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు