కేవలం 1.96 శాతం ఓట్లే తేడా!

17 May, 2014 22:09 IST|Sakshi
కేవలం 1.96 శాతం ఓట్లే తేడా!

ఆంధ్ర ప్రదేశ్లో మెజార్టీ సాధించిన తెలుగుదేశం పార్టీ కూటమికి, ఆ తరువాతి స్థానంలో నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఓటింగ్ శాతం కేవలం 1.96 శాతం. ఈ ఓట్ల శాతంతోనే టిడిపి, బిజెపి కూటమి 39 శాసనసభ స్థానాలను అదనంగా గెలుచుకుంది. ఏపిలో మొత్తం 175 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికలలో టిడిపి+బిజెపి కలిపి  106 సీట్లను గెలుచుకోగా, వైఎస్ఆర్ సిపి ఒంటరిగా 67 సీట్లను గెలుచుకుంది.

ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద టిడిపి+బిజెపికి కోటి 34 లక్షల 95 వేల 308 ఓట్లు పోలయ్యాయి. ఒక్క వైఎస్ఆర్ సిపికి కోటి 29 లక్షల 31 వేల 730 ఓట్లు పోలయ్యాయి. టిడిపి కూటమికి 46.86 శాతం ఓట్లు పోల్ కాగా, వైఎస్ఆర్ సిపికి 44.90 శాతం ఓట్లు పోలయ్యాయి.  అంటే1.96 శాతం ఓట్ల తేడాతో 39 సీట్లను టిడిపి కూటమి అదనంగా  గెలుచుకోగలిగింది. అయితే ఏపిలో మొత్తం పోలైన ఓట్లు, టిడిపి, బిజెపి, వైఎస్ఆర్ సిపికి పోలైన ఓట్ల వివరాలు ఎన్నికల సంఘం ప్రకటించవలసి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ వివరాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల సంఘం ప్రకటించిన తరువాత ఈ అంకెలలో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకోగా, వైఎస్ఆర్ సిపి ఒంటరిగా పోటీ చేసింది. బిజెపితో పొత్తు పెట్టుకొని టిడిపి బాగా లాభపడింది. అలాగే బిజెపి కూడా రెండు లోక్సభ, నాలుగు శాసనసభ స్థానాలను గెలుచుకోగలిగింది. అయితే ఎన్నికల కోసం ఏర్పడిన ఈ పొత్తు ఎంత కాలం కొనసాగుతుందో వేచి చూడాలి. ఫలితాలు వెలువడిన తరువాత కూడా  వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి మాట్లాడుతూ ప్రజలతోనే తమ పొత్తు అని చెప్పారు. ఆ పార్టీ  ఈ అయిదేళ్లు శాసనసభలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల పక్షాన నిలిచి, వారి మెప్పు పొందుతుందని ఆశిద్దాం.

మరిన్ని వార్తలు