బావకు ఎసరుపెట్టిన బావమరిది

4 Apr, 2014 16:35 IST|Sakshi
బావకు ఎసరుపెట్టిన బావమరిది

ఎక్కడైనా బావమరిది బాగు కోరతాడు అంటారు. కానీ, బావగారి సీటు లాగేసుకునే బావమరిదిని ఎక్కడైనా చూశారా? పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో సరిగ్గా ఇదే జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టడానికి ప్రధానంగా ప్రోత్సహించిన వ్యక్తి, కిరణ్ను ముందునుంచి వెనకేసుకొచ్చి, ఆయనపై ఈగ కూడా వాలకుండా చూసిన వారిలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఒకరు. మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్లో కిరణ్ కొంతమంది విద్యార్థులతో సమావేశం ఏర్పాటుచేసినప్పుడు.. ఆ సమావేశంలో కిరణ్తో పాటు పాల్గొన్న ఆయన ఏకైక సహచరుడు కూడా పితానే.

అలాంటి పితాని సత్యనారాయణ.. కిరణ్ పార్టీని వదిలిపెట్టి చంద్రబాబు పంచన చేరారు. కిరణ్ పెట్టిన పార్టీ వల్ల ఏమాత్రం ఉపయోగం లేదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల పార్టీయే కావాలి కాబట్టి తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని చెప్పారు. ఇక్కడివరకు బాగానే ఉంది గానీ, ఎన్నికల్లో పోటీ విషయానికి వచ్చేసరికే అసలు సమస్యంతా వచ్చింది. ఆచంట టీడీపీ టికెట్ దాదాపుగా తనదేనన్న నమ్మకంతో పెనుగొండ కాలేజి మాజీ ప్రిన్సిపల్ గుబ్బల తమ్మయ్య ఇప్పటికే కాళ్లకు బలపాలు కట్టుకుని నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఆయన స్వయానా పితాని సత్యనారాయణ అక్కకు భర్త. అంటే, పితానికి తమ్మయ్య బావగారు అవుతారు. ఇప్పుడు ఆచంట టీడీపీ టికెట్ పితానికి దక్కొచ్చని చెబుతున్నారు. అంటే, సొంత బావగారి నోటిదాకా వచ్చిన ముద్దను బావమరిదే లాగేసుకుంటున్నారన్న మాట. ఇదెక్కడి చోద్యమని ఆ జిల్లా వాసులు నోళ్లు నొక్కుకుంటున్నారు.

మరిన్ని వార్తలు