కాశ్మీర్ లో ఎన్నికలపై దాడి చేసే కుట్ర భగ్నం

4 Apr, 2014 15:21 IST|Sakshi
కాశ్మీర్ లో ఎన్నికలపై దాడి చేసే కుట్ర భగ్నం

జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలను భగ్నం చేసేందుకు, వోటు వేయాలనుకున్న ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతాదళాలు విఫలం చేశాయి. జమ్మూ ప్రాంతంలోని డోడా జిల్లాలోని పూనేజా-భదర్వాహ్ ఏరియాలోని రంట్ సాకా అడవుల్లో ఉగ్రవాదులు దాచిపెట్టిన ఆయుధాలను పోలీసులు చేజిక్కించుకున్నారు.


పోలీసులు రంట్ సాకా అడవుల్లోని కొండకోనల్లో భదానీ నాలా పక్కన దాదాపు 48 గంటల పాటు వెతికి, 8 కిలోల ఆర్డ డీ ఎక్స్, ఆరు ఆధునిక ఆయుధాలను, ఏడు గ్రెనేడ్లు, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని, కమ్యూనికేషన్ పరికరాలు,పాకిస్తానీ కరెన్సీ, రెండు డిటోనేటర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఉగ్రవాదుల సాయంతో విదేశీ ఉగ్రవాదులు ఈ స్థావరాన్ని నిర్మించారు. ఈ స్థావరం నుంచి ఉగ్రవాదులు ఎన్నికలను భగ్రం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఖచ్చితమైన సమాచారం లభించిన తరువాత భద్రతాదళాలు ఈ ఏరియాలో సోదాలు జరిపాయి.


భదర్వాహ్ - డోడా ఉధమ్ పూర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్ పోటీలో ఉన్నారు.

మరిన్ని వార్తలు