గాలం వేసేయ్..!

21 May, 2014 01:27 IST|Sakshi
గాలం వేసేయ్..!

సాక్షి, మంచిర్యాల : జిల్లా, మండల పరిషత్, పురపాలక అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకోవడానికి పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్‌ను అమలు చేస్తున్నాయి. ఎన్నికలపై ఇంకా స్పష్టత రానప్పటికీ ఇప్పటి నుంచే రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. క్యాంపు రాజకీయాలతో వేడేక్కిస్తున్నాయి. స్థానిక సంస్థల ఫలితాల్లో జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించిన టీఆర్‌ఎస్‌లో అంతర్గత పోరు నెలకొంది. జెడ్పీ చైర్ పర్సన్ పీఠంపై గురిపెట్టిన ఆయా పార్టీల అగ్రనేతలు ఇప్పటికే క్యాంపు రాజకీయాలు నడిపిస్తున్నారు.
 
 పార్టీలోని ప్రత్యర్థులు సైతం ఇదే రీతిలో ముందుకెళ్తున్నారు. దీంతో ఎవరికి వారు తమ వ్యూహాలకు పదునుపెట్టి ఎదు టి క్యాంపులోని వారి ని తమ గూటికి చేర్చుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. క్యాంపుల్లో ఉన్నవారు ఎవరు చెబితే వింటారో వారితో మంతనాలు సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి పరిషత్ అధ్యక్ష స్థానాన్ని తామే అధిరోహించాలనే పట్టుదలతో ముందడుగు వేస్తున్నారు. మరో వైపు మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇదే తీరును అనుసరిస్తున్నారు.
 
జంప్ జిలానీలు..
ఆసిఫాబాద్ మండల పరిషత్‌లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అనిశ్చితి నెలకొంది. 17 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ 6, కాంగ్రెస్ 6, టీడీపీ 4, సీపీఐ ఒక స్థానం దక్కించుకున్నాయి. ఎంపీపీ పీఠం కోసం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పోటీ పడుతున్నాయి.  ఈ నెల 19న టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి అలిబిన్ అహ్మద్, ము గ్గురు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచులు ఎమ్మెల్యే కోవ ల క్ష్మి సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తగా చేరిన ఎంపీటీసీ సభ్యులతో కలిసి టీఆర్‌ఎస్ సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది.
 
దీంతో ఎంపీపీ పీఠంపై ఉ త్కంఠకు తెరపడిందని భావించారు. ఈ క్రమంలో సో మవారం రాత్రి  టీఆర్‌ఎస్‌లో కొత్తగా చేరిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులతోపాటు మరో ఎంపీటీసీ కాంగ్రెస్ శిబిరానికి తరలి వెళినట్లు సమాచారం. దీంతో సీన్ మారిపోయింది. తాజా పరిణామాలతో ఎంపీపీ పీఠం కాంగ్రెస్‌కు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మొదట్నుంచి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై ఇటీవల ఎన్నికల్లో విజేతలైన వారు, పార్టీలు మారి గెలిచిన వారి మధ్య పోటీ నెలకొంది. దీంతో ఎవరి మార్కు రాజకీయాలను వారు నడిపిస్తూ అధ్యక్ష స్థానంపై దస్తీ వేస్తున్నారు.
 
ఆసక్తికరం పురపాలక పీఠం
పురపాలక అధ్యక్ష స్థానాన్ని అధిరోహించాలని ఎత్తులు వేస్తున్న నాయకులు, కౌన్సిలర్లు అంతర్గత రాజకీయాలతోపాటు విజేతలతో మంతనాలు నడిపిస్తున్నారు. ఆయా వార్డుల వారీగా గెలిచిన వారికి అభివృద్ధి పనుల కేటాయింపులో పెద్దపీట వేయడంతోపాటు ఉపాధ్యక్ష స్థానం కట్టబెడతామని హామీ ఇస్తున్నారు. ఇదే హామీని అందరికీ ఇవ్వడం కొసమెరుపు. కొన్ని మున్సిపాలిటీలో మిశ్రమ ఫలితాలు వ చ్చిన  నేపథ్యంలో వారికి గాలం వేయడంలో టీఆర్‌ఎస్ వర్గాలు ముందుంటున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకే మద్దతిస్తే భవిష్యత్తుకు ఢోకా ఉండదన్న అభిప్రాయంలో పలువురు కౌన్సిలర్లు ఉన్నట్లు సమాచారం.
 
జిల్లాలో బెల్లంపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్ బల్దియా చైర్‌పర్సన్ స్థానాలపై ఆసక్తి నె లకొంది. బెల్లంపల్లిలోని 34వార్డులకు కాంగ్రెస్ పార్టీ 14, టీఆర్‌ఎస్ 10, ఇతరులు 5 స్థానాలు గెలుచుకున్నారు. ఇక్కడ స్వతంత్రుల మద్దతు కీలకం అయిన నేపథ్యంలో వారితో కలిసి పీఠాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ టీఆర్‌ఎస్‌కే వారు మద్దతిస్తారేమోననే గుబులు సైతం వారిని పట్టిపీడిస్తోంది. మంచిర్యాలలో 18 స్థానాలు కాంగ్రెస్, 14 స్థానాలు టీఆర్‌ఎస్ గెలుచుకున్నప్పటికీ హస్తం గూటిలోని కొందరు తమకు మద్దతిచ్చే అవకాశాలున్నాయని తద్వారా బల్దియాపై జెండా ఎగరవేస్తామని టీఆర్‌ఎస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి.
 
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలోని 28 స్థానాలకు గాను టీఆర్‌ఎస్ 13, కాంగ్రెస్ 5, ఇతరులు 10 గెలుచుకున్నారు. ఇక్కడ సైతం ఇతరులతో కలిసి చైర్‌పర ్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. స్వతంత్రులు అధిక స్థానాలున్న టీఆర్‌ఎస్ వైపు మొగ్గుచూపుతారా లేదా కాంగ్రెస్‌తో కలిసి పీఠాన్ని చేజిక్కుంచుకొని వారిలో ఎవరో ఒకరు ముఖ్యస్థానాన్ని అధిరోహిస్తారా అనే చర్చ మున్సిపాలిటీలో జోరుగా సాగుతోంది.

మరిన్ని వార్తలు