మందకొడిగా రీపోలింగ్

14 May, 2014 01:07 IST|Sakshi
మందకొడిగా రీపోలింగ్

 కేపీహెచ్‌బీ కాలనీ, న్యూస్‌లైన్: కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని 371/ఏ కేంద్రంలో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 53.89 పోలింగ్ శాతం నమోదైంది. గత నెల 30న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం మొరాయించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మంగళవారం రీపోలింగ్ నిర్వహించారు.

ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు మందకొడిగా జరిగిన పోలింగ్‌లో 450 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ కేంద్రం పరిధిలోని మొత్తం 835 ఓట్లు ఉన్నాయి. వీరిలో 210 మంది మహిళలు, 240 మంది పురుషులు ఓటు వేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి గంగాధర్‌రెడ్డి తెలిపారు. గత నెల 30న పోలైన ఓట్లకంటే 12 తగ్గాయని అధికారులు వెల్లడించారు.

కాగా, కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో 29 మంది అభ్యర్థులు నిలిచారు. అయితే, ప్రధానంగా ముగ్గురి మధ్యనే పోటీ ఉంది. జంపన ప్రతాప్ (వైఎస్సార్‌సీపీ), గొట్టిముక్కల పద్మారావు (టీఆర్‌ఎస్), ముద్దం నర్సింహయాదవ్ (కాంగ్రెస్) మంగళవారం పోలింగ్ సరళిని పరిశీలించారు. రీపోలింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులు రీపోలింగ్‌లో నమోదైన ఓట్లపై అంచనాలు వేసుకోవడంతో మునిగిపోయారు. 

మరిన్ని వార్తలు