విలేకరిని కొట్టిన సీఐపై చర్యలు తీసుకోవాలి

1 May, 2014 03:10 IST|Sakshi
రాస్తారోకో చేస్తున్న విలేకరులు

కమాన్‌పూర్, న్యూస్‌లైన్: పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్,టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న ఘర్షణను కవరేజీ చేస్తున్న విలేకరినికొట్టిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు రాస్తారోకో చేశారు. బుధవారం మండలంలోని బేగంపేటలో ఓటింగ్ జరుగుతుండగా కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ఓటర్లకు పార్టీ గుర్తు చూపిస్తూ ఓట్లు అభ్యర్థించడంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాలు తోపులాడుకున్నాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. విలేకరులు ఫొటోలు తీస్తూ, వివరాలు తెలుసుకుంటున్నారు.

గోదావరిఖని టూటౌన్ సీఐ భద్రయ్య టీఆర్‌ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటూనే అక్కడ ఉన్న విలేకరి మల్యాల సురేశ్‌పై చేయిచేసుకున్నారు. మిగితా  లేకరులను కూడా దుర్భాషలాడారు. దీంతో విలేకరులు సీఐపై చర్యలు తీసుకోవాలని సెంటినరీకాలనీలోని తెలంగాణ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ శ్రీధర్, కమాన్‌పూర్ ఎస్సై సతీశ్ వచ్చి విలేకరులను సముదాయించారు.

 విచారణ జరిపి సీఐపై చర్యలు తీసుకుంటామని గోదావరిఖని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో పూదరి సత్యనారాయణ, పీవీ రావు, బబ్బార్‌ఖాన్, బుర్ర తిరుపతి, పోసు భిక్షపతి, బండ సాయిశంకర్, గాదె బాలయ్య, బొల్లవరం వాసు, విజయ్, మాటేటి కుమార్, చేతి రవి, ఆరెపెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు