ఎన్నికల సమీక్షకు కాంగ్రెస్ నేతల డుమ్మా

10 May, 2014 23:02 IST|Sakshi

 సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: స్థానిక సంస్థలు, మున్సిపల్, సాధారణ ఎన్నికల్లో విజయావకాశాలపై సమీక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా ముఖ్య నేతలు డుమ్మా కొట్టారు. దీంతో సమావేశం మొక్కుబడిగా సాగింది. డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డి విదేశీ పర్యటన లో ఉన్నందున సమావేశానికి రాలేకపోయారని డీసీసీ ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్‌రెడ్డి సమావేశంలో తెలిపారు.

అసెంబ్లీ అభ్యర్థులైన మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డితోపాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, పి.కిష్టారెడ్డి, నందీశ్వర్‌గౌడ్, మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయశాంతి, సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇదిలావుంటే జహీరాబాద్, మెదక్ లోక్‌సభ అభ్యర్థులు సురేశ్ షెట్కార్, శ్రావణ్‌కుమార్‌రెడ్డిలు సైతం డుమ్మా కొట్టారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే సమావేశానికి హాజరు కాలేదనే విమర్శలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుండడం వల్లే వీరు సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది.
 
 సమావేశం సాగింది ఇలా..
 డీసీసీ ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత మధ్యాహ్నం 3 గంటలకు సంగారెడ్డిలోని ఇందిర భవన్‌లో సమావే శం కొనసాగింది. ఈ సమావేశంలో పోలింగ్ సరళిపై చర్చించారు. ఈ సందర్భంగా గజ్వేల్ తాజా మాజీ ఎమ్మెల్యే టి.నర్సారెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు అత్యధిక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక తాజా మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎన్నికలను మూడేళ్ల క్రితమే నిర్వహించి ఉంటే జిల్లాకు రూ.3,500 కోట్లు వచ్చి ఉండేవన్నారు. జెడ్పీ పీఠాన్ని సైతం దక్కించుకునేందుకు సమష్టిగా పని చే యాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు