ఎప్పటికప్పుడు ఎన్నికల సమాచారం

27 Mar, 2014 03:40 IST|Sakshi

గుంటూరుసిటీ, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు అందించాలనే  మీడియా సెంటర్‌ను ప్రారంభించినట్లు  కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.సురేశ్‌కుమార్ చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ హాల్లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, మీడియా సెంటర్‌లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
 
 ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఎన్నికల సమాచారాన్ని జిల్లా సమాచార శాఖ ద్వారాప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు అందిస్తామన్నారు.  అభ్యర్థుల ఖర్చును నియంత్రించేందుకు ఎన్నికల సంఘం ఎంసిఎంసి కమిటీనిఏర్పాటు చేసిందన్నారు. టీవీ ఛానళ్ల ద్వారా ప్రచారం నిర్వహించదలచినపుడు అభ్యర్థులు ముందస్తుగా ఎంసిఎంసికి దరఖాస్తును ప్రసార సీడీని జతపరచి అందజేయాలన్నారు.
 
ప్రసారాలలో అభ్యంతరాలు ఉంటే కమిటీ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు.  దినపత్రికలలో వచ్చిన వార్తలను కమిటీ పరిశీలించి పెయిడ్ న్యూస్‌గా పరిగణిస్తుందన్నారు.  ఎన్నికల నియమావళి అమలుకు జిల్లా, మండలస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు అతిక్రమించినవారిపై  క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
 
ఎంసి ఎంసికి సంయుక్త కలెక్టర్ చైర్మన్ వ్యవహరిస్తారని, నోడల్ అధికారిగా డీపీఆర్‌వో, కన్వీనర్‌గా పులిచింతల ప్రత్యేక ఉప కలెక్టర్ డి. వేణుగోపాల్, సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ ప్రసారశాఖ అధికారి హరిప్రసాద్, దూరదర్శన్ ప్రతినిధి ఎంపి.రవి శంకర్, హిందూ స్టాఫ్ రిపోర్టర్ శామ్యూల్‌జోనాధన్, ఫ్రీ లాన్సర్ సిహెచ్.రామ్‌గోపాలశాస్త్రి ఉంటారన్నారు. కార్యక్రమంలో జెసి వివేక్‌యాదవ్, డిఆర్వో కె.నాగబాబు, పులిచింతల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.
 
 ఎన్నికల అధికారులకు శిక్షణ
బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఆర్వోలు, ప్రత్యేక అధికార్లు, ఎంపీడీవోలకు శిక్షణ  తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో  కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్   మాట్లాడుతూ మండల స్థాయిలో పాత్రికేయులకు ఆయా రిటర్నింగ్ అధికారులు ప్రెస్‌పాస్‌లు జారీచేయాలని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేర్లున్న ఓటర్లు ఒక చోట మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పీవో, ఎపివోలకు విధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జెసి వివేక్‌యాదవ్, జెడ్పీ సీఈవో సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
ఈనెల 9, 16 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాల ద్వారా స్వీకరించిన ఫారం-6 దరఖాస్తుల పరిశీలనను ఈనెలాఖరులోగా  పూర్తిచేయాలని కలెక్టర్ సురేశ్‌కుమార్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులను, తహశీల్దార్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
 
 లక్షా 25వేల ఫారం-6 దరఖాస్తులు అందగా, ఇప్పటి వరకూ 90వేల దరఖాస్తులను అప్‌డేట్ చేశామన్నారు. త్వరగా బూత్ లెవల్ అధికారులతో విచారణ పూర్తిచేయించి వివరాలు అప్‌డేట్ చేయాలన్నారు. పల్నాడు ప్రాంతంలో డబ్బు, మద్యం అక్రమంగా తరలుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ విషయాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెసి వివేక్‌యాదవ్, డిఆర్వో కె.నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
 
 ఎన్నికల సామాగ్రి పంపిణీ..
ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని పోలింగ్ ఆఫీసర్‌లకు బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో పంపిణీ చేశారు.
 
భన్వర్‌లాల్ వీడియో వీడియో కాన్ఫరెన్స్
ఓటు హక్కుపై ఓటర్లలో సంపూర్ణ అవగాహన కలిగించేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. బుధవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన గుంటూరు కలె క్టరేట్‌లోని అధికారులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం కలిగించాలని సూచించారు.  వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ  వివేక్‌యాదవ్, పాఠశాలవిద్యా ఆర్జేడీ పి.పార్వతి, ఉన్నతవిద్య ఆర్జేడీ ఎం.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు