కార్యకర్తలను రెచ్చగొట్టిన టీడీపీ అభ్యర్థి వంశీ
దాడిలో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు
హనుమాన్ జంక్షన్ నేను ఉన్నాగా.. కొట్టండి... చెప్పుతో కొట్టండి...’అంటూ కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ బాహాటంగానే పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. నియోజకవర్గ పరిధిలోని కొత్త మల్లవల్లిలో మంగళవారం టీడీపీ కార్యకర్తలు చేసిన ఈ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు నలుగురు, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కొత్త మల్లవల్లిలో వంశీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు గన్నవరంలో జరిగిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ సభకు హాజరై ఆటోలో తిరిగివస్తున్నారు.
వంశీ ప్రచారాన్ని గమనించి.. ఆ ఆటోను మరో మార్గంలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తుండగా టీడీపీ కార్యకర్తలు వారిని దూషించారు. దీంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రచార వాహనంపై ఉన్న వంశీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ... ‘నేనున్నానుగా.. కొట్టండి.. చెప్పుతో కొట్టండి’ అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఇదే అదనుగా వారు రాళ్లతో దాడి చేశారు.