ఉద్యమం వేరు పాలన వేరు: విజయశాంతి

16 Apr, 2014 01:19 IST|Sakshi
ఉద్యమం వేరు పాలన వేరు: విజయశాంతి

ఇంటర్వ్యూ:  విజయశాంతి
* టీఆర్‌ఎస్‌కు పరిపాలన చేతకాదు
* టీడీపీ-బీజేపీ పొత్తుతో ఒరిగేదేమీలేదు
* అమరవీరుల త్యాగాలను రాజకీయం చేయొద్దు

 
ఎలక్షన్ సెల్: విజయశాంతి... సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ‘తెలంగాణ ఉద్యమం’లో భాగస్వామి అయ్యారు. మొదట్లో బీజేపీ, తరువాత టీఆర్‌ఎస్... ఇపుడు కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ తరఫున ఎంపీగా ఉన్న ఆమె ఇపుడు కాంగ్రెస్ తరఫున మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోటీ చేస్తున్నారు. ప్రచారంలో తలమునకలై ఉన్న ఆమె తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాగా వేస్తుందంటున్నారు.
 
 టీడీపీ-బీజేపీ పొత్తులతో తెలంగాణలో ఒరిగేదేమీ లేదు. బీజేపీ ఆహా ఓహో అం తా బాగుంది అంటూ ఊదరగొడుతోంది. కానీ ఆ పరిస్థితి లేనేలేదు. నేను ఆ పార్టీ లో నుంచే వచ్చాను కదా నాకు అంతా తెలుసు. ఆ పార్టీతో ఏమీ కా దు. మోడీ గాలి అంటున్నారు కానీ ఆ పరిస్థితి కిందిస్థాయిలో అంటే గ్రామ స్థాయిలో లేనేలేదు. ఇక టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. ఆ పార్టీ నుంచి అనేక మంది వివిధ పార్టీల్లో చేరిపోయారు. దీంతో ఆ పార్టీకి ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేదు. తెలంగాణలో అధికారం ఇస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని తెలుగుదేశం పార్టీ చెబుతుతోంది. అది సరే తెలంగాణకు మద్దతు ఇస్తామ ని చెప్పి తర్వాత ఆ పార్టీ మాట మార్చుకోలేదా? బీసీ సీఎం హామీ కూడా అంతే. టీడీపీవన్నీ మాయమాటలు.
 
టీఆర్‌ఎస్‌వి మాయమాటలు...

 తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం కల్ల. ఉద్యమాలు వేరు పరిపాలన వేరు. టీఆర్‌ఎస్ పరిపాలన చేయలేదు. కరీంనగర్, మహబూబ్‌నగర్‌ల నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించి కేసీఆర్ ఏం చేశారు? ప్రజలకు ఏం పనులు చేశారు? వారికి అందుబాటులో ఉన్నారా? జాతీయ పార్టీగా కాంగ్రెస్సే మంచి పరిపాలన ఇవ్వగలదు. కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీనే తెలంగాణ ఇచ్చినప్పుడు దాన్ని గెలిపిం చాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలదే. తెలంగాణ ఇస్తే సోనియాను, కాంగ్రెస్‌ను నెత్తిమీద పెట్టుకుంటాం అంటూ కేసీఆర్ ఏమేమో చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విలీనం అన్నాడు... ఏం చేశాడు? టీఆర్‌ఎస్ మాయమాటలు చెబుతోంది. వారు చేసేది లేదు పెట్టేది లేదు. తెలంగాణ పునర్నిర్మాణం కాంగ్రెస్‌తోనే సాధ్యం. అసలు టీఆర్‌ఎస్ వారికి అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు. వారికి పదవులు కావాలంతే. వారికి పరిపాలన చేతకాదు. దళితులను సీఎం చేస్తానన్నారు. మరెందుకు వెనక్కు తగ్గారు? తెలంగాణ పునర్నిర్మాణం అంటే తెలంగాణ అభివృద్ధి కోసం పెట్టుబడులు రావాలి. స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావాలి. ప్రాజెక్టులు రావాలి. ఒక్కటి అనేక అంశాలపై తెలంగాణ అభివృద్ధి కావాలి. తెలంగాణ ప్రాంతం మొత్తం సెట్‌రైట్ కావాలి. అందుకు విజన్ ఉండాలి. అలాంటి విజన్ కాంగ్రెస్ పార్టీకే ఉంది.
 
మెదక్ అభివృద్ధిపై దృష్టి...

 ఈసారి ఎంపీగా పోటీచేయదలచుకోలేదు. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మెదక్‌ను అభివద్ధి చేయాల్సిన బాధ్యత నామీద ఉంది. ప్రతిపక్షంలో ఉండి కూడా ఎంపీగా చాలా పనులు చేశాను. వెయ్యి గ్రామాలుంటే 700 గ్రామాల్లో తిరిగాను. తెలంగాణ ఉద్యమాలు చేస్తూ కూడా బాగా పనిచేశాను. పోలీస్‌స్టేషన్లు, గొడవలు, ఉద్యమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నాను. మెదక్ ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ అభివద్ధిపై దృష్టిపెట్టాలన్నదే నా ఉద్దేశం. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినవారెవరూ దీన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. 40 శాతం కూడా పనిచేయలేదు. టీఆర్‌ఎస్ నుంచి ఉన్నవారెవరు దీన్ని పట్టించుకోలేదు. నాకు గెలుపు అవకాశాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడే ప్రచారం మొదలుపెట్టాను. ప్రజల నుంచి స్పందన బాగుంది. నన్ను గెలిపించుకుంటాం అని చెబుతున్నారు.
 
పదవుల కోసం అమరవీరులు త్యాగాలు చేయలేదు...
 తెలంగాణ అమరవీరులకు కాంగ్రెస్ పార్టీ ఒక్క టిక్కెట్టు కూడా ఇవ్వలేదని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకు అర్థంలేదు. అమరులైన వాళ్లు పదవులు ఆశించి త్యాగం చేయలేదు. టిక్కెట్ల కోసం చేయలేదు. తెలంగాణ భవిష్యత్తు బాగుం డాలన్న విశాల ధృక్పథంతో ఆత్మార్పణ చేసుకున్నారు. కొందరు దీన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారు. ఆ కుటుంబాలకు న్యాయం జరగాలి. త్యాగాన్ని గుర్తించాలి. అంతేతప్ప త్యాగాలు చేసినవారు రాజకీయ పదవులు తమ కుటుంబాలకు కావాలని చేయలేదు. సీమాంధ్ర ప్రజలు ఇక ద్వేషాలకు పోకుండా అర్థంచేసుకోవాలి. తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థంచేసుకోవాలి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినందున అభివృద్ధిపై ఎవరికివారు కృషిచేయాలి. అక్కడ ఎవరికి ఓటేయాలో వారే సరైన నిర్ణయం తీసుకొని ఆలోచించుకోవాలి.

మరిన్ని వార్తలు