రాములమ్మే దిక్కు!

5 Apr, 2014 00:00 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ ఎంపీ అభ్యర్థిగా రాములమ్మ పేరు మళ్లీ తెరమీదకు వచ్చింది. దాదాపు ఆమె పేరే ఖరారు కానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు విజయశాంతిని ఒప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇప్పటికే రెండు పర్యాయాలు ఆమెతో సంప్రదింపులు జరిపినట్టు వినికిడి. కేసీఆర్ కూడా మెదక్ నుంచే పోటీ చేయడం దాదాపు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో.. సిట్టింగ్ ఎంపీ విజయశాంతి అయితేనే గట్టి పోటీ ఇవ్వగలరని అధిష్టానం భావిస్తోంది.

దీంతో ఆమెను ఒప్పించే పనిలో ఉన్నారు. ఒకవేళ మెదక్ నుంచి ఓడిపోయినా రాజ్యసభకు పంపుతామనే హామీ కూడా ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన రాములమ్మ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొదట డీసీసీ అధ్యక్షుడు వి. భూపాల్‌రెడ్ది పేరును అధిష్టానం పరిశీలించింది. కానీ కేసీఆర్‌లాంటి బలమైన ప్రత్యర్థిపై పోటీ చేయడానికి ఆయన విముఖత చూపినట్టు తెలిసింది. తెలంగాణ ప్రజలు.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్ర కటించే తాయిలాల కంటే సెంటిమెంటుకే ఎక్కువ ప్రాధాన్యత  ఇస్తారని కాంగ్రెస్ అధిష్టానం బలంగా నమ్ముతోంది. సోనియాగాంధీ ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటుచేసి ఇక్కడి ప్రజలకు చేరువయ్యారని, తెలంగాణ కోసం పోరాటం చేసిన నేతలే బరిలో నిలబడితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఆ దిశగా రాములమ్మే సరైన అభ్యర్థి అని ఏఐసీసీ భావిస్తోంది.

 తెలంగాణవాదంతోనే తెర మీదకు వచ్చిన ఆమె కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కోగలదని, పైగా పట్టుబట్టి మెదక్‌కు రైల్వే లైన్ మంజూరు చేయించి అక్కడి ప్రజలకు దగ్గరయ్యారని, కేసీఆర్‌ను దెబ్బ కొట్టాలంటే విజయశాంతిని బరిలోకి దింపడం ఉత్తమమని అధిష్టానం నిర్ణయించింది హస్తిన వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ ఇప్పటికే విజయశాంతితో ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. మెదక్ ను ంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేయాలని కోరినట్లు, ఒకవేళ ఓడిపోతే రాజ్యసభకు పంపిస్తామని సోనియాగాంధీ మాటగా చె ప్పినట్టు తెలిసింది.

>
మరిన్ని వార్తలు