'వైఎస్ఆర్ పథకాలన్నీ అద్భుతంగా చేసి చూపిస్తాం'

1 May, 2014 20:22 IST|Sakshi

గుంటూరు: వైఎస్ఆర్ పాలనలో ఏ ఛార్జీ పెరగలేదని వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా పెదకాకానిలో నిర్వహించిన రోడ్ షోలో షర్మిల ప్రసంగించారు. చంద్రబాబు పాలనలో 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు.
వైఎస్ పాలనలో కరెంట్ ఛార్జీలు పెరిగాయని ఏ ప్రతిపక్షపార్టీ కూడా ఆరోపించలేదని తెలిపారు. వైఎస్ఆర్ పథకాలకు తూట్లు పొడవటమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన సాగిందని విమర్శించారు. సర్‌ఛార్జీల పేరుతో రూ.32 వేల కోట్ల కరెంట్ భారాన్ని ప్రజలపై మోపారన్నారు. ఐదేళ్లూ జగనన్న ప్రజల పక్షానే పోరాడారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే విప్ జారీ చేసి కాంగ్రెస్ సర్కార్‌ను చంద్రబాబు కాపాడారని చెప్పారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించే ధైర్యం చేసిదంటే చంద్రబాబు లేఖే కారణమన్నారు. మామనే వెన్నుపోటు పొడిచిన ఘనడు చంద్రబాబు అన్నారు. 10 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబుకు ప్రజల పక్షాన పోరాడానని చెప్పుకునే ధైర్యం లేదన్నారు.

వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ పథకాలన్నీ అద్భుతంగా చేసి చూపిస్తామన్నారు. వైఎస్ పథకాలనే అమలు చేస్తానంటూ సిగ్గులేకుండా చంద్రబాబు తిరుగుతున్నాడని షర్మిల ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలు తనవి అనుకున్నది జగనన్నే అని చెప్పారు. రోజుల తరబడి నిరాహారదీక్షలు చేసింది జగనన్నే అని షర్మిల తెలిపారు.

మరిన్ని వార్తలు