అభివృద్ధికి దిక్సూచి

14 Apr, 2014 00:49 IST|Sakshi
అభివృద్ధికి దిక్సూచి

 సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో అభివృద్ధి, సంక్షేమానికి మార్గం చూపనుంది. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుని సీమాంధ్ర ప్రజలకు కష్టనష్టాలు మిగిల్చిందని, వైఎస్సార్ సీపీ అమలు చేపే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అనతికాలంలోనేఆ నష్టాన్ని భర్తీ చేయవచ్చని వివిధ రంగాలకు చెందిన నిపుణులు చెబుతున్నారు. సంక్షేమ పథకాల అమలు, బలహీనవర్గాల ప్రజలకు అందించనున్న రాయితీలతో వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. గుంటూరుకు 50 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో పేర్కొనడంతో గుంటూరు, విజయవాడ పరిసర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
 ఇప్పటికే ఎన్‌హెచ్-16(గతంలో ఎన్‌హెచ్ -5)ను చిలకలూరిపేట నుంచి కనకదుర్గ వారిధి వరకు ఆరులైన్ల రహదారిని విస్తరించారు. అక్కడి నుంచి నాలుగు లైన్ల రహదారి విస్తరణ జరిగింది. ఈ రహదారి ఏర్పాటుతో ప్రయాణ సమయం, ఇంధనం ఆదా అవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తే తక్కువ సమయంలో ఇక్కడి నుంచే విదేశాలకు ప్రయాణించే అవకాశం ఏర్పడుతుంది. ఈ విమానాశ్రయ ఏర్పాటుతో గుంటూరు, విజయవాడ నగరాల్లో సేవారంగాలు విస్తరించి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం మహానేత వైఎస్ హయాంలో రూ.8 వేల కోట్లతో అభివృద్ధి పరిచారు. దీని ఏర్పాటుతో అనేక అనుబంధ రంగాలు అభివృద్ది చెందాయి. అదే రీతిలో గుంటూరు, విజయవాడల్లో అనుబంధ రంగాలు విస్తరించి ఉపాధి అవకాశాలు పెరుగుతాయనేది నిపుణుల మాట.
 
 ఫీజు రీయింబర్‌‌సమెంట్‌పై ఆంక్షలు తొలగింపు..
 కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రించేందుకు అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంక్షలు లేకుండా చేస్తామని చేసిన ప్రకటన మధ్య తరగతి కుటుంబాలకు ఆనందం నింపింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా జిల్లాలో సుమారు 80 వేల మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. ఆంక్షలు లేకుండా చేస్తే వీరి సంఖ్య 80 వేల నుంచి లక్ష వరకు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అమ్మ ఒడి పథకం దోహదం చేస్తుందని, దీని ద్వారా బడికి వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని విద్యారంగ నిపుణుల అభిప్రాయం.
 

మరిన్ని వార్తలు