నల్లగొండ.. అండెవరికో ?

17 Apr, 2014 01:01 IST|Sakshi
నల్లగొండ.. అండెవరికో ?

సాయుధ రైతాంగ పోరాటంలో నల్లగొండది ఓ ప్రత్యేక చరిత్ర. ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న ప్రధాన నాయకుల్లో రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, భీంరెడ్డి నర్సింహారెడ్డి వంటి సాయుధ పోరాట యోధులంతా ఇక్కడి వారే. బందూకుల నుంచి బ్యాలెట్ దాకా సాగిన వీరి రాజకీయ జీవితంతో జిల్లాకు గుర్తింపు వచ్చింది. అంతటి ఘనమైన చర్రిత ఉన్న నల్లగొండ తెలంగాణ  రాష్ట్ర పోరాటంలోనూ ముందు వరుసలో నిలిచింది. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల పోరులో ఇక్కడి లోక్‌సభ స్థానం ప్రతిష్టాత్మకంగా మారడంతో అన్ని పార్టీలూ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నాయి.
 
 నల్లగొండ: లోక్‌సభ నియోజకవర్గం
 ప్రస్తుత ఎంపీ,  గుత్తా సుఖేందర్‌రెడ్డి
 ప్రస్తుత రిజర్వేషన్  : జనరల్
 నియోజకవర్గంలోని
 అసెంబ్లీ స్థానాలు:
 నల్లగొండ, సూర్యాపేట, కోదాడ,  
 హుజూర్‌నగర్, మిర్యాలగూడ,
 నాగార్జునసాగర్, దేవరకొండ (ఎస్టీ).
 మొత్తం ఓటర్లు: 14,60,881
 పురుషులు: 7,29,653
 మహిళలు: 7,31,192
 ప్రస్తుతం బరిలో నిలిచింది: 9
 ప్రత్యేకతలు: మెజారిటీ ప్రాంతం
 నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోకి వస్తుంది. సిమెంటు పరిశ్రమ, పారా
 బాయిల్డ్ రైసు మిల్లులు ఎక్కువ . ఎస్సీ, బీసీ, రైతు, కార్మికులు మహిళల ఓట్లు కీలకం
 ప్రధాన అభ్యర్థులు వీరే:
 గున్నం నాగిరెడ్డి ( వైఎస్సార్ సీపీ)
 గుత్తా సుఖేందర్‌రెడ్డి (కాంగ్రెస్)
 తేరా చిన్నపురెడ్డి (టీడీపీ )
 నంద్యాల  నర్సింహారెడ్డి (సీపీఎం)
 పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్‌ఎస్)
 
 ఎన్. క్రాంతి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన టీ కాంగ్రెస్ ఎంపీల్లో  ఒకరైన  గుత్తా సుఖేందర్‌రెడ్డి  ఈసారి తెలంగాణ ఓటుపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. అయితే తొలిసారి టీఆర్‌ఎస్ కూడా బరిలోకి దిగుతూ అదే తెలంగాణవాద ఓటుపై ఆశలు పెట్టుకుంది. మరో వైపు పరువు నిలబె ట్టుకునేందుకు మాత్రమే పోటీకి దిగుతున్న టీడీపీ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. సీపీఎం కూడా నల్లగొండలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
 
 గుత్తాకు ఎదురుగాలి
 గత ఎన్నికల  సమయంలో  రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఎంపీగా టికెట్ దక్కించుకున్న ‘గుత్తా’.. వైఎస్ హవాతో బయటపడ్డారు. అయితే ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనికితోడు నాలుగు ప్రధాన రాజకీయ పక్షాలు కూడా బరిలోకి దిగడంతో ఆయన గెలుపు నల్లేరుమీద నడక కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
 వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా..
 నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో అభివృద్ధి ఊసే ఎత్తని కాంగ్రెస్ తీరును ప్రత్యర్థి రాజకీయ పక్షాలు ప్రచార అస్త్రాలుగా మలుచుకుంటున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏర్పాటైన తొలి రైల్వేలైన్ బీబీనగర్-నడికుడి లైన్లో రైల్వేకు కావాల్సినంత ఆదాయం ఉన్నా డబ్లింగ్ పనులు కానీ, విద్యుద్దీకరణ పనుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని వైరి పార్టీలు విమర్శలు సంధిస్తున్నాయి. అలాగే నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ.. ఇలా నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కింద ఉన్నా ఇక్కడి రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా తయారవడంతో రైతులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల గురించి, సాగునీటి గురించి కాంగ్రెస్ పాలకులు ఆలోచించడమే మర్చిపోయారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ప్రస్తుత ఎన్నికల్లో కాం గ్రెస్‌కు ప్రతిబంధకంగా మారనున్నాయి.
 
 అగమ్యగోచరంగా టీడీపీ పరిస్థితి
 ఈ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవడంతో కేవలం ఉనికి కోసమే ఇక్కడ బరిలోకి దిగింది. బీజేపీతో పొత్తువల్ల ఇక్కడ టీడీపీకి ఒనగూడే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువనేది రాజకీయ విశ్లేషకుల భావన.  నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న తేరా చిన్నపురెడ్డిని ఈసారి నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపుతూ టీడీపీ ప్రయోగం చేస్తోంది. అయితే నల్లగొండ అసెంబ్లీ సీటును బీజేపీకి ఇచ్చేయడంతో అక్కడి టీడీపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అలాగే కోదాడలో సిట్టింగు ఎమ్మెల్యే వేనేపల్లిని పక్కన పెట్టడంతో అక్కడ పార్టీ రెండుగా చీలిపోయింది. ఇవన్నీ తెలుగుదేశానికి ప్రతికూలాంశాలు కానున్నాయి.
 
 సంచలనం కోసం టీఆర్‌ఎస్
 తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీగా తమకే పట్టం కడతారన్న ఆశ టీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది. అయితే రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని విద్యాసంస్థల అధినేత పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టికెట్ ఇచ్చి సంచలనం కోసం వేచి చూస్తోంది. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండడంతో ఆ అభ్యర్థి అందరికీ పరిచయం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే తెలంగాణ అభిమాన ఓటు గట్టెక్కించకపోతుందా అన్న ఆశ ఆ పార్టీలో ఉంది.
 
 కేడర్‌పైనే భారం వేసిన సీపీఎం
 సీపీఎం తొలిసారి జిల్లావ్యాప్తంగా అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి అభ్యర్థులను ఎన్నికల క్షేత్రంలోకి దింపింది. కేవలం కేడర్‌పైనే భారం వేసిన సీపీఎం నంద్యాల నర్సింహారెడ్డిని ఇక్కడి లోక్‌సభ స్థానం నుంచి పోటీలో నిలిపింది. తమకున్న బలమైన కేడర్‌తోపాటు కొంత కష్టపడితే విజయం సాధించవచ్చనే ధీమా ఆ పార్టీ వ్యక్తం చేస్తోంది.
 
 వైఎస్ సంక్షేమ పథకాలే అండగా వైఎస్సార్ సీపీ
 బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి పల్లెల్లో ఉన్న ఆదరణ ఓటుగా మారుతుందని వైఎస్సార్ సీపీ భావిస్తోంది. ఆ పార్టీ తరపున బరిలో ఉన్న గున్నం నాగిరెడ్డి.. వైస్సార్ సంక్షేమ పథకాలే తమను విజయ తీరానికి చేరుస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ఎస్‌ఎల్‌బీసీతోపాటు ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులు వైఎస్సార్ హయాంలో చకచకా సాగాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి సంఖ్య కూడా ఎక్కువే కావడం ఆ పార్టీకి కలిసివచ్చే అంశం. అలాగే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు కూడా తమకే పడుతుందని వైఎస్సార్ సీపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
 
 నే.. గెలిస్తే: బలాబలాలు
 గున్నం నాగిరెడ్డి (వైఎస్సార్ సీపీ)
 -    విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తా. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తా
 -    ఫ్లోరైడ్ సమస్యను నివారించేందుకు అన్ని గ్రామాలకు కృష్ణా జలాలు అందించే కృషి చేస్తా
 -    {పజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆస్పత్రుల్లో  పడకల స్థాయిని పెంచుతా
 -    రైతులకు ఏడు గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తా.
 9 గంటలు ఇవ్వడంపై దృషిపెడతా.
 -    రహదారులను మెరుగుపరుస్తా.
 
 అనుకూలం
 -    వైఎస్సార్‌పై ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న అభిమానం
 -ఙ్ట్చఛగ్రామ గ్రామాన ఉన్న వైఎస్‌ఆర్ అభిమాన ఓట్లు
 -    వైఎస్సార్ ఆరేళ్ల పాలనలో లభించిన సుబిక్షమైన పాలన
 -    ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంటు,
 ఉచిత విద్యుత్ లబ్ధిదారుల ఓట్లు
 ప్రతికూలం
 -    రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు బరిలో లేకపోవడం
 
 గుత్తా సుఖేందర్ రెడ్డి (కాంగ్రెస్)
 -    నల్లగొండ-మాచర్ల రైల్వే లైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తా
 -    పెండ్లిపాకల రిజర్వాయర్ సామర్థ్యం పెంచడం, నక్కలగండి పనులు
     పూర్తి చేయడంపై దృష్టి సారిస్తా
 -    కొత్త జాతీయరహదారి నిర్మాణానికి కృషి చేస్తా
 -    తాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తా
 -    నల్లగొండలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ
 ఏర్పాటుకు కృషి చేస్తా
 
 అనుకూలం
 -    {పత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఉద్యమించిన టీ కాంగ్రెస్ ఎంపీల్లో ముఖ్యుడు కావడం
 -    పార్టీలోని ఎమ్మెల్యే అభ్యర్థులతో సత్సంబంధాలు
 -    ఏడు సెగ్మెంట్ల కాంగ్రెస్ కార్యర్తలతో నేరుగా పరిచయాలు ఉండడం
 ప్రతికూలం
 -    తెలంగాణ కార్యక్రమాల వరకే పరిమితం కావడం
 -    చెప్పుకోదగిన అభివృద్ధి పనులు చేయకపోవడం
 -    కొత్త అభ్యర్థులు, సీపీఐతో పొత్తు దేవరకొండలో ఫలించే అవకాశం లేకపోవడం
 -    తెలంగాణ ఓటు చీలిపోవడం
 
 తేరా చిన్నపరెడ్డి (టీడీపీ)
 -    ఫ్లోరైడ్ సమస్య నిర్మూలనకు కృషి
 -    మండల కేంద్రాల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ కేంద్రాలు
 -    నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ
 ఆస్పత్రికి అనుసంధానంగా కార్పొరేట్ స్థాయిలో నర్సింగ్ కాలేజీ
 -    {పతి మండలానికి డిగ్రీ కాలేజీ, ఐటీఐ, పాలిటె క్నిక్ కాలేజీలు ఏర్పాటు చేయిస్తా
 -    {పతి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి కట్టిస్తా
 అనుకూలం
 -    నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చూపిన పోరాట పటిమ
 -    వివాద రహితుడు, సౌమ్యుడు
 
 ప్రతికూలం
 -    అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు బలహీనులు కావడం
 -    సంస్థాగతంగా ఉన్న గ్రూపుల గొడవలు
 -    తెలంగాణపై టీడీపీ అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతం
 -    బీజేపీతో పొత్తు పెద్దగా లాభించకపోవడం
 
 నంద్యాల నర్సింహారెడ్డి (సీపీఎం)

 -    నల్లగొండ -మాచర్ల రైల్వేలైను ఏర్పాటు కృషి చేస్తా
 -    కేంద్ర ప్రభుత్వ నిధులతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయిస్తా  
 -    విద్యాభివృద్ధికి కృషిచేస్తా
 -    భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పిస్తా
 -    9 వేల ఎకరాల అటవీ భూములను పేదలకు పంచిపెడతాం.
 -    యురేనియం త వ్వకాలను నిలిపేస్తాం
 
 అనుకూలం
 - ముందు నుంచీ కమ్యూనిస్టులకు పట్టున్న నియోజకవర్గం కావడం
 - గ్రామ స్థాయిలో పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటు
 
 ప్రతికూలం
 -సమైక్య రాష్ట్ర విధానానికే కట్టుబడి వెనుకబడి పోవడం
 - అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కేడర్  
 చెల్లాచెదురు కావడం హామిర్యాలగూడ మినహా, ఇతర నియోజకవర్గాలో వెనుకబడి ఉండడం
 
 పల్లా రాజేశ్వరరెడ్డి (టీఆర్‌ఎస్)

 - ప్రజలకు ఫ్లోరైడ్ రహిత జలాలు అందిస్తా
 - ఎత్తిపోతల పథకాలకు 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తా
 - సూర్యాపేటను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయిస్తా
 - నల్లగొండలో నూతన మెడికల్ కళాశాల ఏర్పాటు చేయిస్తా
 - దేవరకొండలో బత్తాయి మార్కెట్, జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషిచేస్తా
 - సిమెంట్ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తా.
 - నియోజక వర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తా
 
 అనుకూలం
 - తెలంగాణవాద ఓటు
 ప్రతికూలం
 - స్థానికేతరుడు  కావడం
 - రాజకీయాలకు కొత్త. నియోజకవర్గ ప్రజలకు
 కొత్త ముఖం
 - పనిచేసే క్షేత్ర స్థాయి బలగం సరిగా లేకపోవడం

మరిన్ని వార్తలు