సాక్షి,ముంబయి: జాతీయ అవార్డును గెలుచుకున్న బాలీవుడ్ బ్యూటీ, హృతిక్ రోషన్తో వివాదాలతో వార్తల్లో నిలిచిన కంగనా రనౌత్ ‘మీ టూ’ క్యాంపెయిన్లోనూ నైను సైతం అంటూ ముందుకొచ్చారు. లింగ వివక్ష సంబంధిత అంశాలపై గళమెత్తడం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా లైంగిక వేధింపులను ఎదుర్కొన్న వివిధ రంగాల మహిళలు సోషల్ మీడియాలో మీ టూ క్యాంపెయిన్తో ఏకమవుతున్నారు. శారీరక వేధింపులు, అణిచివేత, లైంగిక వేధింపులు, వివక్ష వంటి అసమానతలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడాలని తాను నిర్ణయించుకున్నానని, తనకు ఎదురయ్యే ప్రతికూలతలపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని కంగనా పేర్కొన్నారు.
తన గురించి శ్రేయోభిలాషులు, స్నేహితులు ఆందోళన చెందుతారని తనకు తెలుసని,అయినా పెడ ధోరణులపై రాజీలేని పోరాటంతో తన గళాన్ని వినిపిస్తానని, పోరాటం నుంచి తనను ఎవరూ ఆపలేరని కంగనా స్పష్టం చేశారు. మహిళలకు ఎదురయ్యే సమస్యలపై కంగనా పోరాడుతున్న తీరును నెటిజన్లు ప్రశంసిస్తూ కంగనాటూ పేరుతో ట్విట్టర్లో ట్రెండ్ను స్టార్ట్ చేశారు. అంతకుముందు బాలీవుడ్లో నూతనంగా కెరీర్ స్టార్ట్ చేసిన తనకు ఎదురైన అనుభవాలపై కంగనా బహిరంగంగా వెల్లడించిన విషయం తెలిసిందే.