ఉమెన్‌ గ్రూప్‌ 1

21 Oct, 2019 01:18 IST|Sakshi

మీ సంకల్ప బలానికి సెల్యూట్‌

మీ సేవా భావానికి సెల్యూట్‌

మీ దీక్షా దక్షతలకు సెల్యూట్‌

మీ నెంబర్‌ వన్‌ గ్రూప్‌కు సెల్యూట్‌

నవ్యాంధ్ర తొలి డీఎస్పీ బ్యాచ్‌లోని 25 మందిలో 12 మంది మహిళలు చోటు దక్కించుకుని కొత్త చరిత్ర సృష్టించిన సందర్భం ఇది. వీరంతా ఇప్పుడు విధులకు సిద్ధం అవుతున్నారు. సమాజానికి రక్షణ కవచంగా యూనిఫామ్‌ ధరించబోతున్నారు.  చట్టం, న్యాయం, ధర్మానికి ప్రతీక అయిన మూడు సింహాలతో కలిసి కర్తవ్య నిర్వహణ నాలుగో సింహంగా కొత్త బాధ్యతలు చేపట్టనున్నాను. కరకు ఖాకీ వృత్తి మగవాళ్లకే పరిమితమన్న వాదనకు చెల్లుచీటి రాస్తూ ‘మేము సైతం’ అంటూ సత్తా చాటేందుకు సంసిద్ధులయ్యారు.

ఉన్నత చదువులతో ఉన్నత లక్ష్యాలవైపు అడుగులు వేసిన ఈ మహిళా డీఎస్పీలు మహిళావనికే ఆదర్శం. ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ చదువులు పూర్తి చేసిన ఈ పన్నెండు మందీ ఏదో బతుకుదెరువు కోసం ఉద్యోగం చేయాలనే నిర్ణయానికి పరిమితం కాలేదు. జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన సివిల్‌ సర్వీసెస్‌ పోటీ పరీక్షలకు బరిలో దిగారు. ఢిల్లీ, హైదరాబాద్‌లలోని ఐఏఎస్‌ అకాడమీల్లో రేయింబవళ్లు విరామమెరుగకుండా శ్రమించారు. సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమైన వీరంతా.. అంతకంటే ముందుగా వచ్చిన గ్రూప్‌–1 పరీక్ష రాశారు.

విశేషం ఏమిటంటే ఉన్నతమైన సివిల్స్‌కు కోచింగ్‌ తీసుకున్న వారు గ్రూప్‌–1 పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా ఎటువంటి కోచింగూ లేకుండానే నెగ్గుకొచ్చారు. సివిల్స్‌ కొట్టాలనుకుని గ్రూప్‌–1కు ఎంపికై డీఎస్పీ పోస్టును సాధించిన వారిలో కొందరు మాత్రం ఏమైనా సివిల్స్‌కు వెళ్తామంటున్నారు. పోలీసు ఉద్యోగంతో సమాజానికి నేరుగా సేవ చేసే భాగ్యం దక్కిందని మరికొందరు ఇక్కడికే పరిమితమవుతున్నారు. వీరిలో కొందరిని సా„ì  పలకరించింది. వారి మనోభావాలను తెలుసుకుంది.

యూనిఫాం చూసుకుని గర్వపడుతున్నా
ఖాకీ యూనిఫాం వేసుకోవడానికి చాలా గర్వంగా ఫీలవుతున్నాను. నేను బీటెక్‌ చదివాను. గ్రూప్‌–1లో డీఎస్పీగా ఎంపిక కావడాన్ని ఎప్పటిక మరిచిపోలేను. నా తల్లిదండ్రులు లలిత, ఎస్‌ఏ బషీర్, నా భర్త షఫీ, నా మావయ్య వన్నూర్‌ సాహెబ్‌ (రిటైర్డ్‌ ఏఎస్పీ) అందించిన ప్రోత్సాహం మరువలేను. వృత్తిపరంగా ప్రతీ రోజు నేను వేసుకున్న ఖాకీ యూనిఫాంకు న్యాయం చేసేలా పనిచేస్తాను. ఒక పోలీసుగా గర్వంగా ఫీలయ్యేలా సమాజానికి సేవ చేస్తాను. వ్యక్తిగతంగా మంచి కూతురు, మంచి తల్లి అన్పించుకునేలా ఉంటాను.
–షేక్‌ షాను,రేణిగుంట, చిత్తూరు జిల్లా

సివిల్‌ సర్వీసెస్‌ నా టార్గెట్‌
డీఎస్పీగా పనిచేస్తూ సివిల్‌ సర్వీసెస్‌లో రాణించాలన్నదే నా ముందున్న లక్ష్యం. నేను తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బీటెక్‌ పూర్తి చేయడంతోపాటు గోల్డ్‌మెడల్‌ సా«ధించాను. స్టేట్‌ బ్యాంక్‌ ఇఫ్‌ ఇండియా, ఏపీజెన్‌కోలో ఉద్యోగం చేశాను. సివిల్స్‌ సాధించాలనే నా పట్టుదలను చూసి నా తల్లిదండ్రులు ఎన్‌.చంద్రశేఖర్, బీవీ ఉమ, నా భర్త పీవీ రాఘవ నన్ను ప్రోత్సహించారు. నాకు రెండేళ్ల కూతురు హంసిక ఉంది. ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూ మరోవైపు డీఎస్పీ విధులు నిర్వర్తిస్తూ, అదే సమయంలో సివిల్స్‌ పై దృష్టి పెట్టి సాధిస్తాను.
– ఎన్‌.రమ్య, తిరుపతి

బాధితులకు న్యాయం జరిగేలా పనిచేస్తాను
అనంతపురం జేఎన్‌టీయూలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాను. మా నాన్న ఎస్‌ఎం రమేష్‌చంద్ర రిటైర్డ్‌ డీఈఈ. అమ్మ ఎం.అనుపమ అనంతపురం కలెక్టరేట్‌లో తహíసీల్దార్‌గా పనిచేస్తోంది. ఒక సోదరి కోటచెరువు మండలంలో డిప్యూటీ తహíసీల్దార్‌గా పనిచేస్తోంది. మరో సోదరి సుస్మిత ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేసింది. డీఎస్పీగా విధుల్లో చేరిన నేను ఒక పోలీసుగా బాధితులకు న్యాయం చేసేలా పనిచేస్తాను. ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారిస్తాను.
– ఎస్‌.రమేష్‌ చంద్ర హర్షిత, అనంతపురం

మా నాన్న జడ్జి కావడంతో..
నాకు పోలీస్‌ కావాలని ఉండేది మా నాన్న గాంధీ.. డిస్టిక్ట్ర్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి (హైదరాబాద్‌) కావడంతో ఆయన ప్రభావం నాపై ఉండేది. ఆయన నిత్యం కేసులు, విచారణలో బిజీగా ఉండటం చూసి నేను పోలీసు కావాలని అనుకునేదాన్ని. బీటెక్‌ పూర్తి చేసి, ఖాళీగా ఉండటం ఎందుకని ఐడియా సెల్యులార్‌ సర్వీసెస్‌ (హైదరాబాద్‌)లో కొంతకాలం జాబ్‌ చేశాను. సివిల్స్‌ సాధించాలని ఇటీవల ఢిల్లీ వెళ్లి కోచింగ్‌ తీసుకున్నాను. ఈ మధ్యలో గ్రూప్‌–1 పరీక్ష రాసి డీఎస్పీ సాధించాను. పోలీసు ఉద్యోగం అంటే ఇష్టపడే నేను నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న ఈ వృత్తిని వదులుకోను. అవకాశం ఉన్నంత మేరకు ప్రజలకు పోలీసు సేవలను అందించాలన్నదే నా లక్ష్యం. మహిళలు, చిన్నారులు, అట్టడుగు వర్గాల రక్షణ కోసం పనిచేస్తాను.
– ఎం.శ్రావణి, కొవ్వూరు, పశ్చిమగోదావరి

మా మండలంలో నాదే రికార్డు
మా నాన్న గురుప్రసాద్‌ సాధారణ రైతు. మా అమ్మ లక్ష్మీదేవి గృహిణి. ఆడపిల్లనైనా నన్ను ఎంతో కష్టపడి చదివించారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసి 2016–2018 మధ్య భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం చేశాను. సివిల్స్‌ సాధించాలనే తపనతో హైదరాబాద్‌ వెళ్లి కోచింగ్‌ తీసుకున్నాను. గ్రూప్‌–1 సా«ధించి డీఎస్పీగా ఎంపికయ్యాను. మా ఓబులావారి మండలం మొత్తం మీద నేరుగా(డైరెక్ట్‌) గ్రూప్‌–1 సాధించిన ఘనత నాదే కావడం గర్వంగా ఉంది. ప్రజల సమస్యలు కళ్లారా చూసి వారికి న్యాయం చేసే అవకాశం ఉన్న పోలీసు అధికారిగా నా బాధ్యతను సక్రమంగా నిర్వహించాలనే ఆశయంతో ముందుకు సాగుతాను.
– ఎం.శ్రీలత, ఇందిరానగర్,
వైఎస్సార్‌ కడప జిల్లా

నాన్నే నాకు స్ఫూర్తి
తిరుపతిలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్యామ్‌ సుందరం మా నాన్న. పోలీసుగా ఆయనను దగ్గర నుంచి చూసిన నాకు పోలీసు కావాలనే లక్ష్యం ఉండేది. నేను డీఎస్పీగా ఎంపిక కావడానికి నాన్నే నాకు స్ఫూర్తిగా నిలిచారు. అమ్మ సునీత వినోదిని గృహిణిగా ఉంటూ నన్ను చదువులో ప్రోత్సహించేది. బీటెక్‌లో నేను గోల్డ్‌మెడల్‌ సాధించాను. సివిల్స్‌ సర్వీసెస్‌ను టార్గెట్‌గా పెట్టుకుని హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకున్నాను. ఈలోపు గ్రూప్‌–1 రాసి డీఎస్పీ పోస్టు సాధించాను. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా ఇక్కడితో ఆగిపోను. డీఎస్పీగా పనిచేస్తూ సివిల్స్‌ కొడతాను. ఐఏఎస్, ఐపీఎస్‌లలో ఏదో ఒకటి సాధిస్తాను. పాజిటివ్‌గా పనిచేస్తే ప్రజలకు మరింత చేరువ అయ్యే అవకాశం పోలీసులకే ఉంది. నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న పోలీసు వృత్తి నాకు చాలా ఇష్టం.
– ఇ.జెస్సీ ప్రశాంతి, తిరుపతి

ప్రభుత్వ సర్వీసులో చేరాలన్నకోరిక నెరవేరింది
ప్రభుత్వ సర్వీసులో చేరి ప్రజలకు సేవ చేయాలన్న నా లక్ష్యం నెరవేరింది. నేను డీఎస్పీ పోస్టు సాధించడంలో అమ్మా, నాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట సొంత ప్రాంతమైనప్పటికీ  అమ్మా, నాన్నలకు ఉద్యోగరీత్యా తిరుపతిలో ఉంటున్నాం. నాన్న డాక్టర్‌ ఎస్‌.కిషోర్‌ శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ(తిరుపతి)లో ప్రొఫెసర్‌. అమ్మ కేఎం రోజ్‌మండ్‌ నెల్లూరులో డిప్యూటీ కలెక్టర్‌. వారి స్ఫూర్తితో ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో పట్టుదలగా సాధించాను.
– ఎస్‌.భవ్య కిషోర్, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా

డీఎస్పీగా ఎక్కువ సేవలు  అందించాలనుకున్నా..
మా నాన్న ధర్మరాయ్‌ ఆంధ్రా యూనివర్సిటీలో ఫార్మసిస్టు. మా అమ్మ అప్పల నర్సమ్మ మున్సిపల్‌ స్కూల్‌ టీచర్‌. వారి ప్రోత్సాహంతోనే నేను రాణించాను. నేను ఎంబీబీఎస్‌ పూర్తి చేశాను. అయితే  ప్రజలకు విస్తృతంగా అందు బాటులో ఉండటానికి డీఎస్పీ అవడం అవసరం అనుకున్నాను. పోలీసు అధికారిగా వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు మేలైన సేవలు చేయాలన్నది నా సంకల్పం.
–కె.స్రవంతి రాయ్, తురైగూడ, అరకు మండలం, విశాఖ

2018–19 బ్యాచ్‌ మహిళా డీఎస్పీలు
ఎస్‌.రమేష్‌చంద్ర హర్షిత, ఎం.శ్రావణి, షేక్‌ షాను, ఎం. శ్రీలత,కె. లతకుమారి, ఎం. నాగ భార్గవి, ఎస్‌. శిరీషా, కె. స్రవంతిరాయ్, ఇ.జెస్సీ ప్రశాంతి, ఎస్‌. భవ్యకిషోర్, వై. శృతి, ఎన్‌. రమ్య

– ఇరింకి ఉమామహేశ్వరరావు, సాక్షి, అమరావతి
ఫొటోలు: పి. విజయ్‌ కృష్ణ

మరిన్ని వార్తలు