డ్రోన్ల శక్తి పెరిగింది....

18 Feb, 2019 01:30 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్‌ కంపెనీ ఎల్‌రాయ్‌.. ఏకంగా 250 కిలోల బరువును మోసుకెళ్లగలిగే డ్రోన్‌లను సిద్ధం చేసింది. వస్తువుల రవాణాకు ఉపయోగపడే డ్రోన్లు ఇప్పటికే కొన్ని అందుబాటులో ఉన్నప్పటికీ అవన్నీ కేవలం పది, ఇరవై కిలోల బరువు మాత్రమే మోసుకెళ్లగలవు. పైగా ఇవి ప్రయాణించే దూరం కూడా చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఎల్‌రాయ్‌ 250 కిలోల బరువును మోసుకెళ్లగలిగే డ్రోన్లను సిద్ధం చేయడం.. అది కూడా ఏకంగా 300 మైళ్ల దూరం ప్రయాణించేలా సిద్ధం చేయడం విశేషం.

ఆరు రోటర్లతో కూడిన ఈ డ్రోన్లు నిట్టనిలువుగా పైకి ఎగురుతాయి. నేలకు దిగగలవు కూడా. వీటితోపాటు వెనుకభాగంలో ఏర్పాటు చేసిన ఇంకో రోటర్‌ కారణంగా వేగంగా ముందుకెళ్లగలదని కంపెనీ సీఈవో డేవిడ్‌ మెరిల్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ అవసరం కూడా లేకుండా ఇది హైబ్రిడ్‌ వపర్‌ ట్రెయిన్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. విపత్తుల సందర్భంలో సరుకులు రవాణా చేసేందుకు ఈ డ్రోన్లు బాగా ఉపయోగపడుతాయని.. భవిష్యత్తులో ట్రక్కులకు బదులుగా ఈ డ్రోన్లను వాడాలన్నది తమ లక్ష్యమని మెరిల్‌ వివరించారు. ఇప్పటికే దాదాపు 70 కోట్ల రూపాయల నిధులు సేకరించిన తాము మరిన్ని నిధుల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.  

మరిన్ని వార్తలు