ఒక జీవితం బతికిపోయింది

20 May, 2019 00:13 IST|Sakshi

ఒక రోజు వెళ్లిపోయింది. మరో రోజు వస్తోంది. వెళ్లిపోయిన రోజు గురించి ఆలోచిస్తుంటే వచ్చిన రోజు కూడా వెళ్లిపోతోంది.
ఇలా వచ్చి వెళ్లిపోయే రోజుల్లో ఒకరోజున పిచ్చయ్యగారు వెళ్లిపోయారు. చాలామంది వెళ్లిపోయే ఈ లోకంలో పిచ్చయ్యగారు వెళ్లిపోవటం ఓ విశేషం కాదు. పైగా ఆయన కవి, గాయకుడు ఇలాంటి వేమీ కాదు. జీవితంలో ఏదన్నా సాధించాడనుకుందామా అదీ లేదు. కాని పరుగెత్తే ప్రవాహం అడుగున తెలియకుండా ఈదుకెళ్లే చేపపిల్లలా, తొణకని సరస్సులో కదలని అలలా, ఆయన కాలానికి తెలియకుండా కాలంతో కలిసిపోయి జీవితమంతా గడిపాడు. శబ్దాల సంగతి అటుంచండి. నిశ్శబ్దంలో పరమ నిశ్శబ్దంగా కలిసిపోయి ఆయన జీవించిన తీరు తెలుసుకోవాలంటే ఆయన దినచర్య ఒక్కరోజు గమనిస్తే చాలు.
ఉదయం ఆయన వీధరుగు మీదకి రాగానే పిచ్చయ్యగారి భార్య సీతమ్మ గారు కుంభకోణం చెంబుతో నీళ్లు, కచ్చిక, తాటాకు పెట్టేది. మొహం కడిగి అటునింటి అటే కృష్ణకి బయల్దేరుతాడు. చలి అయ్యేది, వర్షమయ్యేది అంగోస్త్రం నడుంకి బిగించి కృష్ణలో దూకవలసిందే. గుండెలోతు నీళ్లలో నుంచుని సంధ్యావందనం ముగించి చెంబుతో కృష్ణోదకం తీసుకుని గుడికి బయల్దేరుతాడు. దోవలో వీధరుగుల మీద చిన్నపిల్లలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూంటే చల్లటి కృష్ణ నీళ్లు వాళ్లమీద చిలకరించేవాడు. వాళ్లు ‘‘చలి, చలి’’ అని ముడుచుకుపోతుంటే నవ్వుకుంటూ ముందుకు సాగిపోయేవాడు. రెండో ప్రాకారంలోని గన్నేరు చెట్టు దగ్గరకొచ్చి పూలు కోసుకుంటూ ‘ఇక్కడ నిన్న రెండు మొగ్గలుండాలే’ అనుకొనేవాడు. ఆయనకి కొమ్మలూ, రెమ్మలూ, పువ్వులూ, మొగ్గలూ అన్నీ లెక్కే. పున్నాగపూలు నాలుగు చెంబులో వేసుకుని మారేడుచెట్ల వైపు కొచ్చేవాడు. లేత మారేడు దళాలు ఓ గుప్పెడు కోసుకుని మూడో ప్రాకారం మెట్లెక్కేవాడు.
పిచ్చయ్యగారొచ్చే సమయానికి అర్చకులు అమరేశ్వరుడికి అభిషేకం చేసి సిద్ధంగా ఉండేవారు. స్వయంగా తెచ్చుకున్న కృష్ణోదకంతో స్వామికి అభిషేకం చేసుకొని పత్రీ, పూలు పూజచేసేవాడు. అదేవిపూజో! పిచ్చయ్యగారి పెదవి కదిలేది కాదు. మంత్రం బయటికి విన్పించేది కాదు. ఆ మౌనస్వామికే తెలియాలి ఆ మౌన పూజ! కిందికి దిగివచ్చి గంట మోగించి శలవు తీసుకొని, నందిచుట్టూ తిరిగి బాల చాముండేశ్వరిని దర్శించుకుని సాగిలపడేవాడు. ఆ తల్లి పాదాలనంటి వున్న కుంకుమని నుదుట పెట్టుకుని మంటపంలో కొచ్చి కూర్చునేవాడు.
అప్పటికే అక్కడికి చేరుకున్న అభిషేక బ్రాహ్మలు రకరకాల చర్చలు చేస్తూ ఉండేవారు. పెరుగుతున్న ధరల గురించీ, ఆవకాయ వూరగాయ గురించీ, పాకిస్తానం గురించీ, ఎవళ్లో లేచిపోవడం గురించీ. ఈ మాటలు సాగుతుంటే అన్నీ వింటూ కూర్చునేవాడు. మధ్యలో ఏ లింగయ్యగారో ‘పిచ్చయ్యగారూ! అవునంటారా, కాదంటారా’ అంటే పిచ్చయ్యగారు చిరునవ్వు నవ్వేవాడు. అంతేకాని పెదవి విప్పేవాడు కాదు. మధ్య మధ్యన గాలిగోపురం మీద వాల్తున్న పావురాళ్లని లెక్కపెడ్తుండేవాడు.
అంత మౌనంగా లోకాన్ని తిలకిస్తున్న పిచ్చయ్యగారు ఇంటికొస్తూనే గుమ్మంలోంచి ‘పచ్చడేవిటో?’ అని పెద్దగా అరిచేవాడు. దొడ్లోంచి సీతమ్మగారు ‘దోసకాయ పచ్చడి బద్దలనో లేక చింతచిగురు పచ్చడనో’ అంటే ‘కారం జాగ్రత్త’ అనేవాడు. పిచ్చయ్యగారికి రోజూ నూరిన పచ్చడుండాలి. అందులో కారం దివ్యంగా వుండాలి. లేకపోతే గొప్ప చిరాకు పడేవాడు. భోజనానంతరం వక్కపలుకు వేసుకుని పిచ్చయ్యగారు నులకమంచంలో వాలగా సీతమ్మగారు కాళ్లకట్టన చేరి పాదాలకు ఆముదం రాసేది. వక్కపలుకు నముల్తూ నముల్తూ పిచ్చయ్యగారు నిద్రపోతే అంతకుముందే పట్టెమీద తలవాల్చి ఆవిడ నిద్రపోయేది.
సాయంత్రం పిచ్చయ్యగారు వూరు చుట్టివచ్చేవాడు. పాండురంగస్వామి గుళ్లో ఆచార్లుగారికీ ఆయనకీ సంభాషణ ప్రతిరోజూ ఇలాగే వుండేది.
‘‘ఇవ్వాళేం కూర?’’
‘‘పొట్లకాయ.’’
‘‘పచ్చడో?’’
‘‘కొత్తిమెర కారం.’’
‘‘ఇవ్వాళెన్ని పూజలు?’’
‘‘రెండు.’’
‘‘ఏవన్నా గిట్టిందా?’’
‘‘ఏదో...’’ నవ్వేవాడు ఆచార్లు గారు.
పిచ్చయ్యగారూ నవ్వేవాడు.
అక్కణ్నించి పెద్ద బజార్లో రాములవారి గుడి మెట్లమీద కొంతసేపు కూర్చుని అక్కడ పిల్లల గోలీలాట చూసేవాడు. పిల్లల్తోపాటు తనూ గోలీలు లెక్కపెట్టేవాడు. రేక్కాయల కాలమయితే, ఓ గిద్దెడు కొని తలా ఒక రేక్కాయ పంచేవాడు. సంజెవేళకి తిరిగి గుళ్లో కొచ్చేవాడు. గుళ్లో పిచ్చయ్యగారి చోటు పిచ్చయ్యగారిదే. అక్కడ కూర్చుని గోపురంలో రామచిలకల వైపో, వూగుతున్న జమ్మిచెట్టు వైపో చూస్తూ ఉండేవాడు. గుడి తలుపు వేసేటప్పుడు ప్రసాదంగా పెట్టిన వడపప్పు తుండుగుడ్డ కొంగున కట్టుకుని ఇంటికొచ్చేవాడు. రెండు మెతుకులు తిని ఆ వడపప్పు సీతమ్మగారికిన్ని పెట్టి తను ఒక్కొక్క గింజే నములుతూ నిద్రలోకి వెళ్లిపోయేవాడు. అలా నిద్రలోకి వెళ్లిపోయిన పిచ్చయ్యగారు ఒకరోజు తిరిగి లేవలేదు. కాళ్లకట్టనుంచి లేచిన సీతమ్మగారు పిచ్చయ్యగారు పోతే గొల్లుమనలేదు. ‘‘బొట్టు మాత్రం చెరుపుకుని’ ఇంతకాలం నా ఎదురుగా ఉండేవారు. ఇప్పుడే నాలోనే ఉన్నారు’’ అనుకుంది.
పిచ్చయ్యగారు ఏవీ సాధించలేదు. తగాదాలు తీర్చలేదు. సమస్యలు చర్చించలేదు. కానీ కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు. అది చాలదా? చాలటం లేదు చాలామందికి.

‘అమ్మ చెప్పిన కథలు అయ్యకే చెబుదునా’ అనుకుంటాడు సత్యం శంకరమంచి (1937–1987) తన అమరావతి కథలు అంకితంలో. ఆ అమరావతి కథలులో ఒక కథ ‘ఒక రోజెళ్లిపోయింది’. పైది దాని పూర్తి పాఠం. అమరావతి కథలు 1978లో తొలిసారి పుస్తకంగా వచ్చాయి. అంతకుమునుపు ‘ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక’లో ధారావాహికగా ప్రచురితమైనాయి. ‘అమరావతి కీ కథాయే’ పేరిట వీటిని దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌ దూరదర్శన్‌ హిందీలో దూరదర్శన్‌ కోసం తెరకెక్కించారు.

మరిన్ని వార్తలు