కొత్త బంగారం
25 ఏళ్ళ సేజ్కు, న్యూ హామ్షర్ (అమెరికా)లో బేకరీ ఉంటుంది. గతంలో జరిగిన కారు ప్రమాదంలో తన సగం మొహంమీద పడిన మచ్చతోనే తనని తాను నిర్వచించుకుంటుంది ఆమె. కార్లో ఉన్న తల్లి చనిపోతుంది. ‘అమ్మ పోయి మూడేళ్ళయినా, ఆమెను తలచుకున్నప్పుడల్లా, నా పక్కటెముకలనుండి కత్తి దూసుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది’ అంటుంది.
ఎవరితోనూ సంబంధం ఏర్పరచుకోని ఏకాంతవాసైన సేజ్కు, 90 ఏళ్ళ గౌరవనీయుడైన జర్మన్ టీచర్– వెబెర్తో స్నేహం కుదురుతుంది. తను ‘ఔషివిత్జ్’లో పని చేసిన నాజీననీ, తను గతంలో చేసిన తప్పులకి తనకి జీవించే అర్హత లేదనీ అంటాడతను. ‘జరిగినది ఎవరితోనో పంచుకోవడం వేరు. ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని తిరిగి అనుభవించడం వేరు. అది గాయం అనిపించదు. పిండికట్టు (పుండు పగలడానికై ఉడకబెట్టి కట్టే పిండి)లా ఉంటుంది’ అని చెప్తూ, ‘నేను ఎందరి యూదుల ప్రాణాలో తీశాను. నువ్వూ యూదురాలివే కనుక నా మరణానికి సహాయపడు’ అని సేజ్ను అడుగుతాడు ‘ద స్టోరీటెల్లర్’ నవలలో.
సేజ్– నాజీ యుద్ధ నేరాల కేసులు చూసే పోలీసైన లియోని సంప్రదిస్తుంది. రికార్డుల్లో వెబర్ పేరే కనబడదు. అతని అసలు పేరు రైనర్ అనీ, ఔషివిత్జ్లోని క్యాంపులో ఉన్నత అధికారిగా పని చేశాడనీ తెలిసిన తరువాత పరిశోధన మొదలవుతుంది. రైనర్ను గుర్తు పట్టే ప్రత్యక్ష సాక్షుల అవసరం పడినప్పుడు, సేజ్ తన నాయనమ్మ మింకను సంప్రదిస్తుంది. మింక రెండవ ప్రపంచ యుద్ధపర్యంతం, పోలండ్ దేశపు నిర్బంధ శిబిరంలో గడిపిన వ్యక్తి అవడం కాకతాళీయం. ‘నాకది జ్ఞాపకం లేదని చెప్పను. గుర్తు తెచ్చుకోవడమే ఇష్టం లేదు’ అంటూనే కొన్ని వివరాలు చెప్తుంది.
పోలండ్లో – నాజీలు యూదులందరినీ నిర్బంధ శిబిరాల్లోకి నెట్టినప్పుడు, వారిలో మింక, ఆమె స్నేహితురాలైన డోర్జియా కూడా ఉంటారు. మింకకు జర్మన్ భాష వచ్చినందువల్ల, ఫ్రాన్జ్ అన్న అధికారి అనుమతితో అక్కడ ఉద్యోగం సంపాదించుకుంటుంది. ఒకరోజు స్నేహితురాళ్ళిద్దరూ, రైనర్ అన్న వ్యక్తి డబ్బు దొంగలిస్తుండటం చూసినప్పుడు, అతను డోర్జియాని హతం చేస్తాడు.
టైమ్ గడవడానికి, మింక – ఒక స్త్రీ, ఇద్దరన్నదమ్ముల కట్టుకథని, ఖైదీల శవాల సామాన్లల్లో దొరికిన ఫొటోల వెనుక రాస్తుంది. దాన్ని ఫ్రాన్జ్ చదువుతుంటాడు. డోర్జియా హత్య తరువాత, రైనర్– మింకను కూడా చంపకముందే, ఫ్రాన్జ్ ఆమెను శిబిరం నుండి తప్పిస్తాడు.
తనతో తిరుగుతున్న ఆడమ్ తనని మోసం చేస్తున్నాడని తెలిసిన సేజ్, ‘ఆడమ్ నాతో చెప్పిన మొదటి సంగతి– నేను అందంగా ఉంటానని. అతను అబద్ధాలకోరు అని నాకప్పుడే తెలియాల్సింది’ అంటూ, అతన్ని వదిలిపెడుతుంది. ఈలోగా మింక చనిపోతుంది.
రైనర్ మీద కేసు పెట్టాలంటే, లియోకి డోర్జియా మరణపు వివరాలు అవసరం. సేజ్– తను రైనర్తో మాట్లాడిన మాటలని రికార్డ్ చేసి, లియోకి అందిస్తుంది. రైనర్ కోరిక తీర్చడానికి బ్రెడ్డులో విషం కలిపి అతనికి ఇస్తుండగా, ‘ఇంతకీ అన్నదమ్ముల కథ అంతం ఏమిటి?’ అని అతను అడుగుతాడు. అప్పుడు, అతను రైనర్ కాడనీ, మృదుభాషి అయిన అతని తమ్ముడు ఫ్రాన్జ్ అనీ గ్రహిస్తుంది సేజ్. అన్న చేసిన హత్యలకు బాధ్యత వహించిన తమ్ముడు అన్నని హత్య చేశాడని తెలుస్తుంది.
అనేక పాత్రల దృష్టికోణాలతో సాగే రచయిత్రి జోడీ పికల్ కథనం– భావావేశం, ఉత్కంఠతో నిండి ఉన్నది. నిర్బంధ శిబిరాల వివరాలు, సంఘటనలు భయం పుట్టిస్తాయి. నైతిక ఎంపిక కాస్తా నైతిక అత్యవసరంగా ఎప్పుడు మారుతుంది? క్షమాపణకూ, దయకూ మధ్యనుండే గీత ఎక్కడ ఉంటుంది? అన్న ప్రశ్నలు లేవనెత్తే ఈ నవలను, ఏట్రియా– 2013లో ప్రచురించింది.
కృష్ణ వేణి