నడుమునొప్పి -ఆయుర్వేద చికిత్స

10 Oct, 2013 00:38 IST|Sakshi

ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది. పెరిగిపోతున్న పని ఒత్తిడి, పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వలన, ఈరోజుల్లో 40 ఏళ్లకే నడుము నొప్పి వస్తోంది. ముఖ్యంగా ఆహార లోపాలు, అస్తవ్యస్తమైన దినచర్యలు, స్వప్న విపర్యం అంటే రాత్రివేళ నిద్రపోకపోవటం, పగటిపూట నిద్రించడం వంటి అలవాట్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బ తీస్తున్నాయి. అలాగే ఆందోళన, మానసిక ఒత్తిడి వంటి కారణాలు కూడా అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిలో అతిముఖ్యమైనది నడుము నొప్పి (కటిశూల). ఆయుర్వేద శాస్త్రం నడుము నొప్పికి గుద్రసీవాతంగా నామకరణం చేసింది. నూటికి 90 శాతం మంది తమ జీవితకాలంలో ఎపుడో ఒక్కసారి నడుము నొప్పి బారిన పడతారని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
 
 కారణాలు: ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం, స్థూలకాయం, విశ్రాంతి అనేది లేకుండా ఎక్కువ గంటలు విపరీతంగా శ్రమించడం, అతిగా బరువులు మోయటం, ద్విచక్రవాహనం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్యం వ్యాధులు ఇవి అన్ని నడుమునొప్పికి కారణమవుతుంటాయి. ఈ కారణాల వల్ల ముఖ్యంగా వాత ప్రకోపం జరుగుతుంది. ఫలితంగా ముందు పిరుదులకు పైభాగాన స్థబ్దతను, నొప్పిని కలిగించి, ఆ తరువాత నడుముభాగం, తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాల్లోకి వ్యాపిస్తుంది. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువ అవుతుంది. నడుము భాగంలో ప్రత్యేకించి ఎల్-4, ఎల్-5 వెన్నుపూసల మధ్య ఉండే సయాటికా నరం మీద ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది.
 
 నడుము నొప్పికి ఆయుర్వేద చికిత్స
 నడుము నొప్పి అనే సమస్యకు ఆయుర్వేద శాస్త్రంలో సమగ్రమైన చికిత్సా పద్ధతులున్నాయి. అందులో నిదాన పరివర్జనం, శమన చికిత్స, శోధన చికిత్స అనే మూడు ప్రధానమైనవి.
 
 నిదాన పరివర్జనము: నిదాన పరివర్జనము అనగా వ్యాధికి కారణమైన విషయాలను పాటించకపోవడం. ఉదా: విరుద్ధ ఆహార - విహారసేవన. (రాత్రి మేల్కొనుట, పగలు నిద్రించుట మొదలైనవి)
 
 శమన చికిత్స: వ్యాధి దోషాలను శమింపచేయటానికి తెచ్చే ఔషధాలు, ఇందులో రోగ తీవ్రతను బట్టి, రోగి బలాన్ని బట్టి చూర్ణాలు, గుటికలు, కషాయాలు, లేహ్యాలు, తైలాలు ఇత్యాది ఔషధాలు రోగికి ఇవ్వబడతాయి. కానీ, ఈ శమనచికిత్స వలన ప్రకోపించిన దోషాలు మళ్లీ తిరగబడవచ్చు. అందుకే వ్యాధి తీత్రవను బట్టి శమన చికిత్సలతోపాటు, కొందరికి పంచకర్మ (శోధన చికిత్స) కూడా అవసరం. తద్వారా ప్రకోపించిన దోషాలను (వాత, పిత్త, కఫ) సమంగా చేసి శరీర శుద్ధిని, అగ్నిబలాన్ని పెంపొందించవచ్చును.
 
 ఆయుర్వేదాన్ని స్నేహకర్మ ద్వారా వెన్నుపూసల మధ్య, స్నిగ్ధత్వాన్ని పెంపొందించి కీళ్ల కదలికను సులభతరం చేసే అవకాశం ఏర్పడుతుంది. స్వేదకర్మ ద్వారా బిగుసుకుపోయిన కీళ్ళను వదులుగా, మృదువుగా మారేలా చేయవచ్చు.
 
 కటివస్తి:
ఈ విధానం ఆయుర్వేదంలోని ఒక విశిష్ట ప్రక్రియ. అరిగిపోయిన మృదులాస్థికి (కార్టిలేజ్) రక్తప్రసరణను పెంచి నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో సర్వాంగధార చికిత్స కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది.
 
 వస్తికర్మ: ఆయుర్వేద శాస్త్రంలో వస్తికర్మ అనే చికిత్స అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వస్తికర్మ ముఖ్యంగా చిన్నప్రేవులు, పెద్దప్రేవులలోని ఎంటరిక్ వర్వస్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుంది. తద్వారా నాడీకణాలలో ఏర్పడిన లోపాలను సరిచేసి బలం చేకూర్చవచ్చు. అలాగే పక్వాశయలో వాతస్థానం కాబట్టి ప్రకోపించిన వాతాన్ని కూడా సహజస్థితికి తీసుకునిరావచ్చును.
 
 జాగ్రత్తలు: అవసరమైన పోషకాహారం తీసుకుంటూ, వ్యాధి తిరిగి రాకుండా వైద్యులు సూచించిన విధానాలను అనుసరించడం చాలా అవసరం. ఔషధ చికిత్సల తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తే నడుము నొప్పి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది.
 
 డిస్క్‌లో వచ్చే మార్పులు
 వెన్నుపూసల మధ్య ఉండే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు, డిస్క్‌ల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో వాపు రావటం, డిస్క్‌కి రక్త ప్రసరణ సరిగా లేకపోవటం, డిస్కు అరిగిపోవడం వంటి అనేక సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్కులో వాపు వస్తే అందులోంచి చిక్కని ద్రవం బయటికి వచ్చి మేరుదండం నుంచి వచ్చే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల వెన్ను నొప్పి వస్తుంది.
 
 లక్షణాలు
 నడుములో నొప్పి, వాపు, ఏ కాస్త శ్రమించినా నొప్పి తీవ్రం కావటం, సూదులతో గుచ్చినట్లుగా నొప్పి, కాళ్లల్లో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శజ్ఞానం కోల్పోతారు. సమస్య తీవ్రమైతే కొందరు మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్‌లో మలబద్దకం, జీర్ణాశయ సమస్యలు వస్తాయి. వెన్ను సంబంధిత సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి రాకుండా పోతుంది.
 

మరిన్ని వార్తలు